సిటీబ్యూరో, జనవరి 20 (నమస్తే తెలంగాణ) : ఫోక్సో, లైంగిక దాడులకు సంబంధించి 60 రోజుల్లో కేసుల దర్యాప్తు పూర్తిచేసి కోర్టులో చార్జిషీట్లు వేయాలని రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహాన్ స్టేషన్ హౌస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఫోక్సో, లైంగిక దాడులకు సంబంధించిన కేసుల దర్యాప్తు, పెండెన్సీలకు సంబంధించిన అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ జనవరి 20వ తేదీ నాటికి 253 కేసులను 63కి తీసుకుచ్చి వేగంగా కేసులను దర్యాప్తు చేసి 100శాతం కేసుల దర్యాప్తు చేస్తున్నారని రాష్ట్ర ఉమెన్ సేఫ్టీ విభాగం నుంచి రాచకొండ పోలీసులు ప్రశంసలందుకున్నారన్నారు.
కేసుల దర్యాప్తుతో పాటు నిందితులకు శిక్షల శాతాన్ని పెంచాలని, 2019లో 12, 2020లో 13, 2021లో 15, 2022లో 15 కేసులలో శిక్షలు పడ్డాయని, దీనిని మరింతగా పెంచాలని సూచించారు. అన్ని పోలీస్ స్టేషన్ల ఎస్హెచ్ఓలు 100 శాతం కేసులను పరిష్కరిస్తూ నిర్ణీత సమయంలో చార్జిషీట్లు దాఖలు చేయాలన్నారు. కేసుల దర్యాప్తులో వివిధ విభాగాలతో సమన్వయం చేస్తూ, కేసుల పురోగతిని ఎప్పటికప్పుడు పరిశీలించే విధంగా కమిషనరేట్లో మానిటరింగ్ టీమ్ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఉమెన్ సేఫ్టి వింగ్ డీసీపీ ఎం.వెంకటేశ్వర్లు, సీసీఆర్బీ ఏసీపీ జగదీశ్, తదితరులు పాల్గొన్నారు.