సిటీబ్యూరో, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ ) : జలమండలి ఆధ్వర్యంలో సెఫ్టిక్ ట్యాంక్ క్లీనింగ్, ఫీకల్ స్లడ్జ్ సెఫ్టేజ్ మేనేజ్మెంట్ (ఎఫ్ఎస్ఎస్ఎం)పై ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఈఎస్సీఐ) సహకారంతో సోమవారం ఎన్జీవోలు, కార్యకర్తలకు శిక్షణ కార్యక్రమాన్ని ఖైరతాబాద్లోని సంస్థ ప్రధాన కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంస్థ ఎండీ దానకిశోర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఇప్పటికే డయల్ ఏ సెఫ్టిక్ ట్యాంక్ క్లీనింగ్ వాహనం సేవలకు మంచి స్పందన లభించిందని వివరించారు. 87 నూతన సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ వాహనాలను ప్రారంభించామని, ఈ నిర్వహణకు సంబంధించి 15 ఎన్జీవోలకు చెందిన దాదాపు 150 మందికి శిక్షణ ఇచ్చామని చెప్పారు. సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ వాహనాల యజమానులకు, కార్మికులకు పలు విషయాలపై అవగాహన కల్పిస్తామని, సెప్టిక్ ట్యాంక్ వ్యర్థాల లోడింగ్, డంపింగ్లో పాటించాల్సిన నియమాలు, విధి నిర్వహణలో వ్యక్తిగత రక్షణ కోసం తీసుకోవల్సిన జాగ్రత్తలు వివరిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జలమండలి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ ఎం.సత్యనారాయణ, డైరెక్టర్ శ్రీధర్ బాబు, సీజీఎం ప్రసన్నకుమార్, ఈఎస్సీఐ ప్రతినిధి అనితాఅగర్వాల్, ఎన్జీవో ప్రతినిధులు పాల్గొన్నారు.