తెలుగు యూనివర్సిటీ, ఆగస్టు 30 : ప్రతి ఏడాది తెలుగు విశ్వ విద్యాలయం పురస్కారాల పేరిట సాహితీవేత్తలను సముచిత రీతిలో సత్కరిస్తున్నదని ఉపాధ్యక్షుడు, ఆచార్య టి.కిషన్రావు పేర్కొన్నారు. బుధవారం వర్సిటీ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2021కు గాను 12 మందికి ప్రతిభా పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వెంకటేశ్వర విశ్వ విద్యాలయం పూర్వ ఉపాధ్యక్షులు ఆచార్య కొలకలూరి ఇనాక్ మాట్లాడుతూ.. సమాజంలో మరుగునపడిన మాణిక్యాల్లాంటి సాహితీవేత్తల శక్తిసామర్థ్యాల ప్రతిభను గుర్తించి పురస్కారాలతో సమాజానికి పరిచయం చేయడం తెలుగు వర్సిటీ ఔచిత్యానికి నిదర్శనమన్నారు. తెలుగు వర్సిటీ బోధన, పరిశోధనలతోపాటు సంగీతం, సాహిత్యం, నృత్యం, శిల్పం, నాటక రంగాల్లో నిష్ణాతులైన వారి సేవలకు గుర్తింపుగా పురస్కారాలు ఇవ్వడం మంచి పరిణామమన్నారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య భట్టు రమేశ్, విస్తరణ సేవా విభాగం ఇన్చార్జి రింగు రామ్మూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోండీ భాషలో పాండవుల కథ ప్రదర్శనను వెడ్మ శంకర్, సంప్రదాయ తెలుగు మెలట్టూరు భాగవత కళా వీడియోను ఎస్.కుమార్ ప్రదర్శించి ఆహుతుల ప్రశంసలందుకున్నారు.
పురస్కార గ్రహీతలు..
వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన ఉభయ తెలుగు రాష్ర్టాలకు చెందిన ప్రముఖులు గింజల నరసింహారెడ్డి(కవిత), తేరాల సత్యనారాయణ శర్మ(పరిశోధన), బి.నరహరి(చిత్రలేఖనం), డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి(శిల్పం), మేలట్టూర్ ఎస్.కుమార్(నృత్యం), పి.పూర్ణచందర్(సంగీతం), జి. వల్లీశ్వర్(పత్రికారంగం), దెంచనాల శ్రీనివాస్(నాటకరంగం), వేద్మ శంకర్(జానపద కళారంగం), డాక్టర్ ముదిగొండ అమరనాథ శర్మ(అవధానం), డాక్టర్ కొండపల్లి నిహారిణి(ఉత్తమ రచయిత్రి), డాక్టర్ జి.అమృలత(నవల,కథ) ప్రక్రియలకు గాను పురస్కారాలు అందుకున్నారు. ఒక్కొక్కరికి రూ.20,116 నగదు, జ్ఞాపిక, శాలువాతో సత్కరించారు.