రంగారెడ్డి : హఫీజ్పేట్ సర్వే నంబర్ 80లోని భూములు ప్రైవేట్ వ్యక్తులవేనని హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. హఫీజ్పేట్ సర్వే నంబర్ 80లోని 140ఎకరాలు వక్ఫ్ భూములు, ప్రభుత్వ భూములు కాదని, ప్రైవేట్ వ్యక్తులవేనని మంగళవారం హైకోర్టు తీర్పునిచ్చింది. అయితే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అంతేకాకుండా పిటీషనర్లకు రూ.4లక్షల చొప్పున చెల్లించాలని వక్ఫ్బోర్డుతోపాటు ప్రభుత్వాన్ని ఆదేశించడంతోపాటు సంబంధిత సర్వే నంబర్లోని 50 ఎకరాలను ప్రవీణ్రావు సహా యజమానుల పేరిట నమోదు చేయాలని హైకోర్టు సూచించింది.
హఫీజ్పేట్ భూములపై గత కొన్నేండ్లుగా వివాదం కొనసాగుతుంది. సర్వే నంబర్ 46, 48, 55, 66, 67, 74, 75, 77, 78, 79, 80, 100, 104, 151లోని 942ఎకరాలకు సంబంధించి వివాదం కొనసాగుతూ వచ్చింది. అయితే ప్రధానంగా సర్వే నంబర్ 80లోని 140 ఎకరాలకు సంబంధించి అధిక వివాదాలున్నాయి. అయితే సంబంధిత భూములకు సంబంధించి ఎలాంటి క్రయవిక్రయాలు చేయకూడదని 2013లో ప్రభుత్వం గెజిట్ కూడా విడుదల చేసింది. తదనంతరం ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేసి సంబంధిత భూములను క్రయవిక్రయాలు జరిపారు. అంతేకాకుండా అప్పటి కొందరు అవినీతి అధికారుల తీరుతో నిషేధిత భూములని ప్రభుత్వం తేల్చిచెప్పినప్పటికీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ వెబ్సైట్లో పొందుపర్చకపోవడంతో సంబంధిత భూముల విక్రయాలు యథేచ్ఛగా జరిగిపోయాయి. తదనంతరం ఇటీవల భూ రికార్డుల ప్రక్షాళన అనంతరం సంబంధిత భూములు ప్రభుత్వానివేనంటూ ధరణిలో కూడా పొందుపర్చారు.