లక్నో : కొవిడ్-19 నూతన వేరియంట్లు కలవరం కలిగిస్తున్న క్రమంలో యూపీలో తాజాగా రెండు డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు, కప్పా స్ట్రెయిన్ కేసు ఒకటి వెలుగుచూడటం ఆందోళన రేకెత్తిస్తోంది. తాము ఢిల్లీలోని ఐజీఐబీ జీన్ సీక్వెన్సింగ్ సెంటర్కు 72 నమూనాలు పంపగా 30 నమూనాల రిపోర్టులు వచ్చాయని వాటిలో 27 డెల్టా వేరియంట్ కేసులు వెల్లడి కాగా, డెల్టా ప్లస్ కేసులు రెండు వెలుగు చూశాయని కప్పా వేరియంట్ ఒక రోగికి సోకినట్టు తేలిందని గోరఖ్పూర్ బీఆర్డీ మెడికల్ కాలేజ్ మైక్రోబయాలజిస్ట్ హెడ్ డాక్టర్ అమ్రేష్ సింగ్ తెలిపారు.
కప్పా వేరియంట్ను దృష్టిసారించాల్సిన వేరియంట్గా పరిగణిస్తున్నందున దీనిపై ఎలాంటి వివరాలను వెల్లడించడం తొందరపాటే అవుతుందని అన్నారు. కరోనా నూతన వేరియంట్లతో రోగులు తీవ్ర జ్వరం, తక్కువ సమయంలోనే శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని గుర్తించామనిసింగ్ పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలో రెండు కప్పా వేరియంట్ కొవిడ్-19 కేసులను గుర్తించామని యూపీ ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. రాష్ట్రంలో కరోనా కొత్త వేరియంట్ల వ్యాప్తి నేపథ్యంలో యూపీలో జీనోమ్ సీక్వెన్సింగ్ సదుపాయాలను పెంచేందుకు చర్యలు చేపడుతున్నామని ప్రభుత్వం పేర్కొంది.