న్యూఢిల్లీ : జీర్ణక్రియ సాఫీగా సాగకుంటే మలబద్ధకం వెంటాడుతుంది. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో అనారోగ్యకరమైన అస్తవ్యస్తమైన జీవనశైలి జీర్ణాశయంలో ప్రేగు కదలికలు మందగించడంతో మలం గట్టిగా తయారై మలబద్ధకానికి దారితీస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
మలబద్ధకం దీర్ఘకాలం కొనసాగితే పైల్స్ వంటి వ్యాధుల బారినపడే అవకాశం ఉంది. ఇక శీతాకాలంలో ఎక్కువ నీరు తాగకపోవడం కారణంగా డీహైడ్రేషన్ ఏర్పడి మలబద్ధకానికి దారితీస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇక శీతాకాలంలో మలబద్ధకాన్ని నివారించేందుకు నీరు తగినంతగా తీసుకోవాలి.
ఇక ఆహారం తీసుకునే సమయంలో చల్లటి నీరు తీసుకోకుండా భోజనానంతరం అరగంట తర్వాత గోరువెచ్చని నీరు తాగాలి. ఇక పీచు అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు, ఆకుకూరలను అధికంగా తీసుకోవాలి. ఆహారాన్ని గట్టిగా నమిలి తినడం ద్వారా జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది. మరోవైపు ఫైబర్ అధికంగా ఉండే డేట్స్, బాదం, ఎండు ద్రాక్షను తరచూ తీసుకోవడం మేలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.