అమ్మ పాలు అమృతం.. అద్భుతం.. కమ్మదనం.. ఆరోగ్యకరం.. దేవుడు అన్ని చోట్ల ఉండలేడు. అందుకే అమ్మ రూపంలో వచ్చాడు.. అని చెప్తుండగా వింటున్నాం. నిజమే. అమ్మ ఈ భూమిపై తిరిగే దేవత.. మాతృత్వం వరమని, దానితోనే పరిపూర్ణత సిద్ధిస్తుందని తల్లులు నమ్ముతుంటారు. బిడ్డ పుట్టింది మొదలు ఐదేండ్ల వరకు అమ్మ పాలు అమృతంగా, ఔషధంగా పనిచేస్తాయి. ఈ పాల ద్వారా బిడ్డకు విటమిన్లు, ప్రోటీన్లు లభించడమే కాకుండా తల్లి స్పర్శ, వాత్సల్యపూరిత ఆలింగనం వల్ల బిడ్డకు భరోసా కలుగుతుంది. ఆగస్టు 1 నుంచి 7 వరకు తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ప్రత్యేక కథనం మీ కోసం…
తల్లి కడుపులో నుంచి భూమిపైకి వచ్చిన శిశువుకు రోగ నిరోధక శక్తి ఇవ్వడం ఎవరి వల్లా కాదు. కేవలం తల్లిపాలతోనే సాధ్యం. పుట్టిన 15 నిమిషాల నుంచి గంట వరకు వచ్చే ముర్రు పాలు నవజాత శిశువులకు రోగ నిరోధక శక్తిని పెంపొందించే ఔషధంగా పనిచేస్తుంది. ఈ ముర్రు పాలతో 30 శాతం శిశు మరణాలను తగ్గించవచ్చునని వైద్యులు నమ్ముతున్నారు. ఇప్పటికీ ముర్రు పాలు చిన్నారికి పట్టొద్దనే అపోహలో చాలా మంది ఉన్నారు. ఈ రెండు చుక్కుల ముర్రు పాలు బిడ్డకు వారం రోజులకు సరిపడా పోషకాలను అందిస్తాయంటే ఎంత గొప్పవో అర్ధం చేసుకోవాలి.
కల్తీ లేనివి తల్లి పాలు..
బిడ్డ పుట్టిన 15 నిమిషాల నుంచి ఆరు నెలల వరకు తల్లి పాలు శ్రేయస్కరం. తల్లి పాలు కల్తీ లేనివి. వీటిలో ఎలాంటి బ్యాక్టీరియా ఉండదు. బిడ్డకు కావాల్సిన పోషకాలు ఎంత కావాలో.. ఎంత వేడిని అందివ్వాలో.. ఎంత మేర వ్యాధి నిరోధకత అవసరమో.. అవన్నీ తల్లి పాల నుంచి సహజసిద్ధంగా అందుతాయి. తల్లి పాలతో మలబద్ధకం రాదు. పొట్టలో గ్యాస్ తయారవ్వదు. డయేరియా, దగ్గు, జలుబు దరిచేరవు. ఇన్ఫెక్షన్లు సోకవు. ప్రతి రెండు గంటలకోసారి బిడ్డకు పాలు పట్టడం చాలా మంచి అలవాటు. 24 గంటల్లో దాదాపు 8 సార్లు పాలివ్వడం అలవాటు చేసుకోవాలి.
పాలను ఇలా పెంచుకోవచ్చు..
మారిన వాతావరణ పరిస్థితుల కారణంగా, ఇంగ్లిష్ మందుల వాడకం, రసాయన ఆహారాల వల్ల తల్లిపాలు 50 శాతం మేర తగ్గిపోయినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికలు చెప్తున్నాయి. పాలు ఎక్కువగా రావాలంటే తల్లి సరైన పోషకాహారాలు తీసుకోవడం అవసరం. ఎప్పుడూ ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండాలి. బాగా నిద్రపోవాలి. చక్కగా ఉడికిన ముడి బియ్యం తినాలి. తేలికగా జీర్ణమయ్యే ఆకుకూరలు, పండ్ల రసాలను తీసుకోవాలి. కారం, పులుపు, చల్లటి పదార్థాలను దూరం పెట్టాలి. మెంతి కూర ఆహారాన్ని తీసుకోవడం ద్వారా పాల ఉత్పత్తి పెరుగుతుంది. అలాగే మెంతులతో చేసిన పదార్థాలను తినిపించాలి. వెల్లుల్లి, కాకర కాయ, బొప్పాయి వంటివి ఎక్కువగా తీసుకోవడం చాలా అవసరం. తులసి ఆకులను తేనెతో కలిసి తినాలి. బీన్స్, స్వీట్ పొటాటో, నల్ల ద్రాక్ష, కర్బూజాతోపాటు బార్లీ జావా, బొబ్బర్లు, జీలకర్ర కూడా తల్లి పాలు పెరిగేందుకు సాయపడతాయి.
తల్లికీ బిడ్డకూ మంచిదే..
శిశువుకు పాలివ్వడం అంటే అందం కోల్పోతున్నట్లుగా ఇప్పటి తరం అమ్మాయిలు అపోహపడుతున్నారు. అయితే, పాపాయికి పాలు ఇవ్వడం వల్ల ప్రసవం తర్వాత వచ్చే బరువును తగ్గించుకోవచ్చు. గర్భాశయం తిరిగి ఎప్పటి మాదిరిగా అవుతుంది. రక్తస్రావం తగ్గిపోతుంది. రొమ్ము క్యాన్సర్, అండాశయ క్యాన్సర్ వంటివి దరి చేరవు. ఇక పిల్లలకు ఆర్నెళ్ల వరకు పాలు పట్టడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. చిన్నారికి సమతుల ఆహారం లభించడంతోపాటు వారిలో ల్యుకేమియా, శ్వాసకోశ వ్యాధులు, జీర్ణకోశ వ్యాధులు, చర్మం, చెవి సమస్యలు కనిపించవు. దృష్టి లోపం రాకుండా నివారించుతాయి. తెలివి తేటలను పెంచుతాయి. ఆకస్మికంగా చనిపోయే అవకాశాలను తగ్గించుకోవచ్చు. పెద్ద వయసులో హైబీపీ, డయాబెటీస్ వ్యాధులను రాకుండా కాపాడుతుంది.