కోల్కతా : మూడు రోజుల క్రితం తమ అభ్యర్థిగా ప్రకటించిన ఓ మహిళా నేతను అకస్మాత్తుగా టీఎంసీ నాయకత్వం మార్చేసింది. ఆమెకు ఆరోగ్యం బాగోలేనందున ఆమెను పోటీ నుంచి తప్పిస్తున్నట్లు టీఎంసీ నాయకత్వం పేర్కొంటున్నది. అయితే, తనకు కేటాయించిన నియోజకవర్గం నుంచి బరిలో దిగేందుకు సదరు అభ్యర్థి మొండికేయడం వల్లనే ఆమెను ఆరోగ్య కారణాలతో పక్కన పెట్టినట్లు తెలుస్తున్నది.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు హబీబ్పూర్ నియోజకవర్గం నుంచి సర్లా ముర్మును తమ అభ్యర్థి అని తృణమూల్ కాంగ్రెస్ ప్రకటించింది. అయితే, మూడు రోజులు కాకుండా ఈ అభ్యర్థిని మారుస్తున్నట్లు ప్రకటించింది. హబీబ్పూర్ సీటు నుంచి కొత్త అభ్యర్థిగా ప్రదీప్ భాస్కర్ను పార్టీ పేర్కొన్నది.
మాల్దా జిల్లా హబీబ్పూర్ అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థిగా గతంలో ప్రకటించిన సర్లా ముర్ము ఆరోగ్యం కారణంగా బరిలో నిలిచేందుకు విముఖత చూపారని, అందుకే మరో అభ్యర్థిని నిలుపుతున్నట్లు పార్టీ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మాల్డా స్థానం నుంచి సర్లా ముర్ము పోటీ చేయాలనుకున్నప్పటికీ టీఎంసీ నాయకత్వం ససేమిరా అనడంతో హబీబ్పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనని భీష్మించుకు కూర్చున్నది. దాంతో అక్కడ ప్రదీప్ భాస్కర్ను తమ అభ్యర్థిగా టీఎంసీ ప్రకటించిది. మాల్డా నుంచి పోటీ చేయడానికి అవకాశం కల్పించకపోవడంపై కలత చెందిన సర్లా ముర్ము.. మమతా బెనర్జీని కలువాలని నిర్ణయించుకున్నారు.
ఇంతలోపే పార్టీ నాయకత్వం అక్కడ కొత్త అభ్యర్థినా ప్రకటించడం విశేషం.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు తమ పార్టీ తరఫున పోటీ చేస్తున్న 291 మంది అభ్యర్థుల పేర్లను తృణమూల్ కాంగ్రెస్ శుక్రవారం ప్రకటించింది. నందిగ్రామ్ నుంచి తాను పోటీ చేయనున్నట్లు మమతా బెనర్జీ ధృవీకరించారు. టీఎంసీ అభ్యర్థుల జాబితాలో మొత్తం 50 మంది మహిళా అభ్యర్థులు, 42 మంది ముస్లిం అభ్యర్థులు, షెడ్యూల్డ్ కులం నుంచి 79 మంది, షెడ్యూల్డ్ తెగ నుంచి 17 మంది ఉన్నారు. 27 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అవకాశం ఇవ్వలేదు.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు మార్చి 27 న, ఏప్రిల్ 1, 6, 10, 17, 22, 26, 29 తేదీలలో ఎనిమిది దశల్లో జరుగనున్నాయి.మే 2 న ఓట్ల లెక్కింపు చేపడతారు.