భారతదేశము భాగ్యసీమరా/ఖనిజ సంపదకు కొదువ లేదురా/బంగరు పంటల భూములున్నయి/సావులేని మరి జీవనదులురా../అంగట్లోనా అన్ని ఉన్నయి/అల్లుని నోట్లో శని ఉన్నట్టు/సకల సంపదలు గల్ల దేశమున దరిద్రమెట్లుందో నాయన.. దరిద్రమెట్లుందో నాయన. ఈ పాట 1972లో ప్రజా యుద్ధనౌక గద్దర్ నోటి వెంట వెలువడినప్పుడు దేశం దద్దరిల్లింది. ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్లు లేదు నాగులో నాగన్న.. ధరల మీద ధరలు ఎక్కవట్టె నాగులో నాగన్న.. స్వతంత్ర భారత రజతోత్సవాల కాలంలో ఈ పాట దేశ ఆర్థిక, సామాజిక స్థితిగతులను చిత్రిక పట్టి ఎత్తి చూపింది. నేడు వజ్రోత్సవాలు ముగుస్తున్న తరుణంలోనూ అవే పాటలు ఇంకా పాడుకోవాల్సి రావడం.. సమకాలీన పరిస్థితులకు సరిపోలడమూ ఇక్కడ వైచిత్య్రం, అత్యంత విషాదకరం.
ఇన్నేండ్ల స్వతంత్ర భారత ప్రస్థానం సాధించిదేమిటి? పయనిస్తున్న మార్గం ఏమిటి? అనుసరిస్తున్న అభివృద్ధి విధానం ఏమిటి? ఎన్ని పంచవర్ష ప్రణాళికలు.. గరీబీ హఠావో నినాదం.. 20 సూత్రాలు.. మరెన్ని పథకాలు. ఎందరో ఢిల్లీ గద్దెనెక్కారు.. మరెందరో దిగిపోయారు. కానీ దేశంలో ఆశించిన మార్పు రాకపోవడం శోచనీయం. స్వాతంత్య్ర ఫలాలు అట్టడుగు వర్గాలకు అందకపోవడమే బాధాకరం. ఇప్పటికీ ఏటికేడు రెట్టింపవుతున్న రైతుల ఆత్మహత్యలు.. మద్దతు ధర కోసం ఢిల్లీకి కొనసాగుతున్న అన్నదాతల లాంగ్మార్చ్లు.. పట్టణాలకు పెరుగుతున్న వలసలు.. కనీస వసతులు కరువైన బీమారు రాష్ర్టాలు. వానాకాలంలో వరదలు.. ఎండాకాలంలో తాగునీటి కటకటలు. తరుగుతున్న ఎగుమతులు.. పెరుగుతున్న దిగుమతులు. దిగజారుతున్న అభివృద్ధి సూచికలు.. ఎగబాగుతున్న ధరలు.. పాతాళానికి పడిపోతున్న ఆదాయాలు. విస్మృతిలోకి జారుతున్న జాతులు.. విస్మరణకు గురవుతున్న సగటు భారతీయుడి ఆకాంక్షలు. ఒక్కమాటలో చెప్పాలంటే రజతోత్సవాల నాడు స్వయం సమృద్ధిగా ఉన్న దేశం వజ్రోత్సవాల నాటికి పరాధీనతకు గురవడమే అత్యంత విచారకరం. ఆలోచించాల్సిన అంశం.
“తాగబోతే నీళ్లు లేవు తుమ్మెదాలో/తడిగొంతులారిపాయె తుమ్మెదాలో/రాక రాక నల్ల వస్తే తుమ్మెదాలో/ఒక్క బిందె నిండదాయె తుమ్మెదాలో.. తలాపునా పారుతుంది గోదారి.. నీ చేను.. నీ చెలక ఎడారి.. పల్లె పల్లెనా పల్లేర్లు మొలిసె తెలంగాణలోనా.. మన పంట చేలలోనా.. అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గానమా.. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు.. వాగు ఎండిపాయెరో.. పెద్దవాగు తడి పేగు ఎండిపాయెరో.. ఇలా ఎన్నో.. ఎన్నెన్నో.. తెలంగాణ ఏర్పాటు ముందు వరకూ తెలంగాణ జన దీనజీవన స్థితిగతులను.. మన్నుకొట్టుకుపోయిన ఊళ్లను.. మనుషులను.. అక్షరబద్ధం చేసిన పాటలు ఎన్నో. తెలంగాణ దుఃఖాన్ని.. కష్టాన్ని.. నష్టాన్ని దర్పణం పట్టినవి మరెన్నో. తెలంగాణ వలపోతలను.. తలపోతలను ఎలుగెత్తి నినదించినవి ఎన్నెన్నో పాటలు. రెండు దశాబ్దాల క్రితం, ఉద్యమ కాలంలో పాడుకున్న ఆ పాటలన్నీ నేటి తెలంగాణ జలజీవన దృశ్యాలకు పూర్తి విరుద్ధమైనవిగా నిలువడం ముదావహం. ఆ పాటలన్నింటికీ ఇప్పుడు కాలం చెల్లింది. కాదు కాదు స్వరాష్ట్రం తెలంగాణే ఆ పాటల ఔచిత్యాన్ని తుడిచేసింది. ఆ రాతలను చెరిపేసింది. జీవన దృశ్యాలను మార్చేసింది. ఇది 9 ఏండ్ల స్వరాష్ట్రం తెలంగాణ సాధించిన విజయం. ఆసేతుహిమాచలం కోరుకుంటున్న అభివృద్ధి విధానం.
మండుటెండల్లో తడలు గొడుతున్న చెరువులు.. ఊటలు జాలువారుతున్న వాగులు.. కనుచూపు మేర తలలూపుతున్న పచ్చని పైర్లు.. ధాన్యపు రాశులు.. సొంత ఊళ్లకు చేరుతున్న వలస జీవులు.. ప్రగతి వికాసం పొందుతున్న పల్లెలు.. పెరుగుతున్న జీవన ప్రమాణాలు. నాటి, నేటి తెలంగాణలో స్పష్టమైన మార్పులకు సజీవ సాక్ష్యాలు. అభివృద్ధి సూచికలు.. వరిస్తున్న అవార్డులే అందుకు తార్కాణాలు.
77 ఏండ్ల స్వతంత్ర పాలనలో భారతావని స్వయం సమృద్ధి దశ నుంచి నానాటికీ పరాధీనతలోకి జారిపోతుండగా, 9 ఏండ్ల స్వరాష్ట్రం తెలంగాణ పరాధీనత నుంచి స్వయం సమృద్ధి దిశగా ఎదుగుతుండటం గమనార్హం. మరి ఎందుకీ వ్యత్యాసం? ఎక్కడుంది లోపం? ఎవరిదీ పాపం? తెలంగాణ పాలనా విధానాల్లో ఉన్నదేమిటి? భారత ఏలికల్లో లోపించిందేమిటి? అనుసరిస్తున్న అభివృద్ధి విధానాల్లో, అమలు చేస్తున్న వ్యూహాల్లో ఎందుకింత వైరుధ్యం? ఇదీ నేడు సగటు భారతీయ పౌరుడి ఆవేదన, ఆలోచన, ఆక్రోశం. వీటి గురించి ఇప్పుడు తప్పక చర్చించుకోవాలి. అంతేకాదు అందుకు కారణాలు కూడా సుస్పష్టం. ఢిల్లీ ఏలికలది గాలివాటు గమనం! ఇప్పటికీ దేశంలో పేదరికాన్ని అంచనా వేయడానికి సహేతుకమైన ఒక కొలమానం లేదనే సంగతి భారత పాలకుల తీరుతెన్నులకు అద్దం పడుతున్నది. ఓట్ల రాజకీయం, సీట్ల పంపకాలు, కూటములు, ఓటములు, గెలుపులు తప్ప మరేదీ పట్టని వైనం. ఒక నిర్దిష్టమైన అభివృద్ధి విధానం, దేశ ప్రగతిపై పట్టింపులేనితనం. పార్టీలు వేరైనా.. జెండాలు వేరైనా అనుసరిస్తున్న పాలనా విధానాలు ఒక్కటే. దేశ భౌగోళిక, సామాజిక, ఆర్థిక పరిస్థితులకు అనుగుణమైన, ప్రయోజనకరమైన, ప్రగతి కారకమైన విధానాలను విస్మరించడమే ప్రస్తుత దుస్థితికి కారణం. ప్రగతికి ఊతమిచ్చే మౌలిక వసతుల కల్పనను పూర్తిగా పక్కన పెట్టడం, కార్పొరేట్ అనుకూల విధానాలను అమలు చేస్తుండటం, ప్రైవేటీకరణ పంథాలో పయనించడం, ఆధునిక పోటీ ప్రపంచానికి అనుగుణమైన సంస్కరణలను చేపట్టకపోవడమే దేశ ప్రగతి కుంగుబాటుకు కారణమనేది సత్యం.
మరి తెలంగాణ చేసిందేమిటి? తెలంగాణే కాదు ఏ రాష్ట్రమైనా, దేశమైనా, ఏ రంగమైనా ఎదగాలంటే మొదట ఆ రాష్ట్రంలో ఉత్పత్తి పెరగాలి. ఉత్పత్తి అనేదే సమస్త రంగాల అభివృద్ధికి, అవకాశాలకు పునాది. మరి ఉత్పత్తికి ప్రధానమైంది జలవనరులు. దీన్ని అర్థం చేసుకుని అమలు చేస్తే చాలు అభివృద్ధి సాగిపోతుంటుంది. ఒకనాడు ఆ నీటి వనరులు లేకపోవడం వల్లే తెలంగాణ వాకిలి పొక్కిలైంది. ఇది తెలంగాణకు స్వానుభవ పాఠం.
అందుకే తెలంగాణ తన భౌగోళిక, సామాజిక, సాంస్కృతిక జీవన విధానానికి అనుగుణమైన అభివృద్ధి విధానాన్ని ఎంచుకున్నది. విభిన్న ఆలోచనలతో, పోటీ ప్రపంచానికి అవసరమైన సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నది. వ్యవసాయిక రాష్ర్టాన్ని ఆ రంగం ద్వారానే అభివృద్ధి చేసే విధానాలను అమలు చేస్తున్నది. అందుకు అవసరమైన మౌలిక రంగాల్లో ఈ 9 ఏండ్ల కాలంలో భారీగా పెట్టుబడులు పెట్టింది, పెడుతూనే ఉంది. ప్రాజెక్టులకు తొలి ప్రాధాన్యం ఇస్తూ నీటి వనరులను ఒడిసిపడుతున్నది. ఫలితంగానే రాష్ట్రంలో ఉత్పత్తి పెరిగింది. తద్వారా ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయి. ఆదాయాలు పెరిగి ప్రజల కొనుగోలు శక్తి పెరిగింది.
అంతిమంగా అది రాష్ట్ర పురోగమనానికి బాటలు వేస్తున్నది. పారిశ్రామిక రంగం విస్తరణకూ దోహదపడుతున్నది. సమస్త రంగాలు పునర్వికాసం పొందుతుండటం గమనార్హం. అంతేకాదు తెలంగాణ జాతిలో నిద్రాణమై ఉన్న శక్తులన్నింటినీ చైతన్యీకరించింది. కిందిస్థాయి ప్రజల ఆకాంక్షలకు అనుగుణమైన పథకాలను, అభివృద్ధి విధానాలను అమలు చేస్తున్నది. సంపద పెంచుతూ, సబ్బండ వర్గాలకు సమంగా పంచుతూ, అభివృద్ధిలో భాగస్వాములను చేస్తూ ముందుకు సాగుతూ సత్ఫలితాలను సాధిస్తున్నది. ప్రత్యామ్నాయ రాజకీయ, సామాజిక, ఆర్థిక ఎజెండాను రూపొందించుకోవడమేగాక, సమర్థవంతమైన పాలనను అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్నది. యావత్ భారతావని దృష్టిని ఆకర్షించడమేకాదు దేశ భవిష్యత్తుపై ఆశలు రేపుతున్నది. నవభారతావనికి తెలంగాణ దారిదీపమై నిలిచిందనడంలో ఎలాంటి సందేహం లేదు. తెలంగాణ అభివృద్ధి విధానమే దేశానికి అనివార్యం. అదే భారత పురోగమనానికి అనుసరణీయ మార్గం.
తెలంగాణే కాదు ఏ రాష్ట్రమైనా, దేశమైనా, ఏ రంగమైనా ఎదగాలంటే మొదట ఆ రాష్ట్రంలో ఉత్పత్తి పెరగాలి. ఉత్పత్తి అనేదే సమస్త రంగాల అభివృద్ధికి, అవకాశాలకు పునాది. మరి ఉత్పత్తికి ప్రధానమైంది జలవనరులు. దీనిని అర్థం చేసుకుని అమలు చేస్తే చాలు అభివృద్ధి సాగిపోతుంటుంది. ఒకనాడు ఆ నీటి వనరులు లేకపోవడం వల్లే తెలంగాణ వాకిలి పొక్కిలైంది. ఇది తెలంగాణకు స్వానుభవ పాఠం.