అఖిల భారత శాసన సభాధ్యక్షుల సమావేశంలో న్యాయవ్యవస్థ పాత్రపై లోక్సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ చర్చను లేవనెత్తారు. దీనిపై దేశ ప్రజలు అప్రమత్తం కావాలి. జాతీయ న్యాయ నియామకాల కమిషన్ (ఎన్జేఏసీ) విషయమై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పార్లమెంటు సార్వభౌమాధికారానికి భంగకరమని, ప్రజాతీర్పును అగౌరవపరిచేదని ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ అభివర్ణించారు.
న్యాయ వ్యవస్థపై పాలకపక్షం చేస్తున్న దాడి ఇప్పుడు బహిరంగమైంది. మనం ఇసుకలో తలదూర్చిన ఉష్ట్రపక్షిలా ఉండలేమని ఆయన అన్నారు. ఇందుకు మద్దతుగా… రాజ్యాంగం నిర్దేశించిన అధికార విభజన సూత్రాన్ని సుప్రీంకోర్టు అనుసరించాలని స్పీకర్ ఓం బిర్లా అన్నారు. శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలతో సామరస్యంగా న్యాయ వ్యవస్థ పనిచేయాలని ఈ ఇద్దరు పెద్ద మనుషులు కోరుతున్నారు.
నీవెంత ఉన్నతస్థానంలో ఉన్నా, రాజ్యాంగం నీకన్నా ఉన్నతమైనది. ఇదీ ప్రజాస్వామ్య సూత్రం. భారతదేశంలో ఇదేవిధంగా ఉంటుంది. రాజ్యాంగం ప్రాథమిక పత్రం, పరమోన్నతమైనది. శాసన, కార్యనిర్వాహక, న్యాయశాఖలను ఏర్పాటుచేయడమే కాదు, వాటి అధికారాలను, పరిమితులను నిర్వచించింది. 1946 డిసెంబర్ 11ననే రాజేంద్ర ప్రసాద్ రాజ్యాంగసభకు ఈ విషయాన్ని గుర్తు చేశారు. మనం ఎంతోకాలంగా స్వాతంత్య్రం కోసం పోరాడుతున్నాం. ఈ రాజ్యాంగసభ ఏర్పాటుకు మూడు కారణాలున్నాయి. మొదటిది, మన దేశభక్తుల త్యాగాలు. రెండవది, బ్రిటిష్ దేశ చరిత్ర, వారి స్వార్థం, వారి ఔదార్యం. మూడవది, ఇప్పటి ప్రపంచ పరిస్థితులు, తీవ్రమైన పరిస్థితు లు, ప్రపంచంలో చెలరేగుతున్న శక్తులు. ఈ పరిస్థితుల సమ్మేళనంలోనే మన రాజ్యాంగ సభ ఉనికిలోకి వచ్చింది.
రాజ్యాంగం ప్రజలకు ప్రాథమిక, ఇతర హక్కులను కల్పించింది. కానీ అంబేద్కర్ చెప్పినట్టు.. ‘తమ హక్కులకు భంగం వాటిల్లినప్పుడు వాటిని కాపాడుకునే మార్గం లేకపోతే, ఆ హక్కులు లేన ట్టే’. ఈ మేరకే 32వ అధికరణం ఏర్పడ్డది. ఇది హక్కుల పరిరక్షణకు సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం కల్పించింది. 13 (2) అధికరణం ప్రత్యేకమైనది. రాజ్యం ఈ భాగం కల్పించిన హక్కులను రద్దు చేయలేదు, బలహీనపరచలేదు. ఇందుకు భిన్నం గా చేసిన ఏ చట్టమైనా చెల్లుబాటు కాదని ఈ అధికరణం స్పష్టం చేసింది.
ఈ అధికరణం రాజ్యాంగసభలో 8వ అధికరణంగా చర్చకు వచ్చింది. 1948 నవంబర్ 25, 26, 29 తేదీలలో చర్చ జరిగింది. 1971లో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు 24వ (రాజ్యాంగ) సవరణ ద్వారా 13వ అధికరణంలో ఉప అధికరణం (4)ను పార్లమెంటు చొప్పించింది. 368 అధికరణం ప్రకారం చేసే సవరణలకు 13 అధికరణం వర్తించదని పేర్కొన్నారు. దీం తో 13వ అధికరణం బలహీనపడింది. ఈ సవరణ తర్వాత కాలంలో తెచ్చింది. పార్లమెంటులో కాంగ్రెస్కు ఉన్న మెజారిటీ వల్ల జరిగింది.
పార్లమెంటుకు రాజ్యాంగాన్ని సవరించే అధికారం ఉన్నప్పటికీ, 368 అధికరణం కింద రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చలేదని కేశవానంద భారతి-కేరళ రాష్ట్రం కేసులో సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ప్రాథమిక హక్కులు, చట్టబద్ధ పాలన, న్యాయసమీక్ష, అధికార విభజన, స్వతంత్ర న్యాయ వ్యవస్థ మొదలైనవి మౌలిక స్వరూపం కిందికి వస్తాయి. జాతీయ న్యాయ నియామకాల కమిషన్ను, తదుపరి సవరణలను రాజ్యాంగ వ్యతిరేకమైనవిగా సుప్రీంకోర్టు ప్రకటించింది. రాజ్యాంగం ప్రకారం సుప్రీంకోర్టు ఏం చేయాలో అదే చేసింది. 141, 144 అధికరణాల ద్వారా రాజ్యాంగ నిర్మాతలు ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పారు. 141 అధికరణం ప్రకారం.. సుప్రీం కోర్టు తీర్పులను దేశంలోని అన్ని న్యాయస్థానాలు గౌరవించవలసిందే. ఇదేవిధంగా పౌర, న్యాయ అధికార వ్యవస్థలన్నీ సుప్రీంకోర్టుకు అనుగుణంగా మసలుకోవాలని 144వ అధికరణం నిర్దేశిస్తున్నది.
రాజ్యాంగాన్ని, దాని మౌలిక స్వరూపాన్ని కాపాడటం న్యాయ వ్యవస్థ ప్రత్యేకించి సుప్రీం కోర్టు కర్తవ్యం. పౌరుల ప్రాథమిక హక్కులను హరించకుండా, బలహీనపరచకుండా పార్లమెం టు చేసే చట్టాలను 13(2) అధికరణం నిరోధిస్తుంది. ఇటువంటి చట్టాలు చెల్లవని రాజ్యాంగ నిర్మాతలు తేల్చివేశారు. రాజ్యాంగాన్ని నిర్వచించే వ్యవస్థ అయిన సుప్రీంకోర్టు ఇటువంటి చట్టాలు చెల్లవని ప్రకటిస్తుంది.
‘కార్యనిర్వాహక, న్యాయశాఖల మధ్య పూర్తి విభజన ఉన్నది. న్యాయవ్యవస్థ తీర్పులను కార్యనిర్వాహకశాఖ ప్రభావితం చేసే అవకాశం లేదు’ అని అంబేద్కర్ అన్నారు. చివరగా అంబేద్కర్ రాజ్యాంగం ఎంత ఉత్తమమైనదో చెప్పలేదు. ‘నా అభిప్రాయం ప్రకారం.. రాజ్యాంగం ఎంత మంచిదైనా, దాంతో పనిచేసేవారు చెడ్డవారైతే అది చెడ్డదే అవుతుంది. వారు మంచివారైతే చెడ్డ రాజ్యాంగమైనా మంచిదవుతుంది. రాజ్యాంగ స్వభావాన్ని బట్టి మంచిదా చెడ్డదా అనేది ఆధారపడి ఉండదు. రాజ్యవిభాగాలైన శాసన, కార్యనిర్వాహక, న్యాయ శాఖలను మాత్రమే రాజ్యాంగం ఏర్పాటుచేయగలదు. ఈ విభాగాలు ఎలా పనిచేస్తాయనేది.. ఆయా వ్యక్తులు, పార్టీలు తమ ఆకాంక్షలు, రాజకీయాలను నెరవేర్చుకోవడానికి వీటిని సాధనాలుగా ఉపయోగించుకునే తీరుపై ఉంటుంది. భారత ప్రజలు, రాజకీయపక్షాలు ఏవిధంగా వ్యవహరించేది ఎవరు చెప్పగలరు?’ అని అంబేద్కర్ అన్నా రు. పరిస్థితులు పక్కమార్గం పట్టే పెద్ద ప్రమాదం పొంచి ఉన్నది. పరిస్థితులు వేగంగా మారుతున్నా యి. మన ప్రజలు కూడా కొత్త సిద్ధాంతాల వైపు పోతున్నారు. వారు ప్రజల చేత విసిగిపోయి ఉన్నా రు. ప్రజల కోసం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. అది ప్రజల కోసం ప్రభుత్వమా లేక ప్రజల చేత ప్రభుత్వమా అనేది వారికి పట్టదు అని కూడా ఆయన 1949 నవంబర్ 25న చర్చ ముగింపులో అన్నారు. ఆ మహానుభావుడు ఊహించిందే జరుగుతున్నదా? ఇప్పుడు జరుగుతున్న చర్చ అధ్యక్ష తరహా పాలన ప్రవేశపెట్టడానికి సంకేతమా?
నేడు ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి, నిరంకుశత్వానికి మధ్య ఊగిసలాడుతున్నది. ఈ పక్కదారి పట్టించే వాదనల ప్రమాదాన్ని భారత ప్రజలు గుర్తించాలి. న్యాయ వృత్తిలో ఉన్నవారు అప్రమత్తమై రాజ్యాంగాన్ని, న్యాయవ్యవస్థను కాపాడుకోవాలి.
దుష్యంత్ దవే