దృశా ద్రాఘీయస్యా దరదళిత నీలోత్పల రుచా
దవీయాంసం దీనం స్నపయ కృపయా మా మపి శివే
అనే నాయం ధన్యో భవతి న చ తే హాని రియతా
వనే వా హర్మ్యే వా సమకర నిపాతో హిమకరః!
(సౌందర్య లహరి-57)
జగద్గురువు ఆదిశంకరాచార్యులు అమ్మవారి నేత్రాలను వర్ణిస్తూ చెప్పిన శ్లోకం ఇది. ‘హే శివే! ఓ అమ్మా! నీ కనులు చాలా దీర్ఘములైనవి. దృష్టి అన్ని దిక్కులకూ వ్యాప్తమైనది. నీ దృష్టికి అందనిది ఈ జగత్తులో లేదు. ‘అణోరణీయాం మహతో మహీయాం’ అంటుంది వేదం. అణువు మొదలుకొని బ్రహ్మాండం వరకు వ్యాపించి ఉన్నది నీవే. అలాంటి సర్వవ్యాపితయైన ఆమె చూపులు అరవిరిసిన నల్ల కలువల ప్రకాశం వంటి కాంతితో ఉన్నాయి. అలాంటి దీర్ఘములు, ప్రకాశవంతాలైన నీ కనుచూపుల కృపావృష్టిలో దీనుడనైన నన్ను క్షణకాలమైనా ‘స్నపయ’- పూర్తిగా తడపవమ్మా. నేను దూరంగా ఉన్నానని అనుకుంటావేమో… అమ్మా! అతి దగ్గరగా ఉన్నదీ, దూరంగా ఉండేదీ నీవే కదమ్మా! భౌతికంగా నీకు నేను దూరంగా ఉన్నా, నీ భావనలలో నీకు దగ్గరగానే ఉన్నాను. నేను దీనుడను- అంటే అహంకారాన్ని పూర్తిగా విడిచిన వాడిని. నాలో భక్తిభావన పెల్లుబుకడం వల్ల దీనత్వమూ, ధైర్యత్వమూ వెలుగుచూశాయి. నిన్ను చేరేందుకు, నీకు దగ్గరయ్యేందుకు ఇంకేం కావాలి తల్లీ! అలా కాదనుకున్నా నీ చూపులు చాలా శక్తిమంతమైనవి, ఎంత దూరమైనా సాగగలిగినవి కదా… అమృతప్రాయమైన నీ చూపులతో నా తాపం చల్లారే వరకు కరుణించు. దానితో నాలో తాపనాశనం, పాపనాశనం జరుగుతుంది’ అని స్తుతించాడు శంకరులు.
‘అమ్మా! నీవా లోకమాతవు. నేనా కర్మ బంధనాలలో చిక్కి ఆ చీకటిలో మగ్గుతున్న వాడిని. శ్రేయస్కరమైన నీ చూపులనే ప్రకాశాన్ని నాపై సారించగలిగితే నా కర్మ బంధనాలు తొలగిపోతాయి. ‘అనేనాయం ధన్యో భవతి’ దానివల్ల నేను ధన్యుడను అవుతాను. ‘నచతే హాని రియతా’ కృపతో నన్ను కరుణించినంత మాత్రాన నీకు వచ్చే నష్టం ఏమీలేదు. ఎలా అంటావేమో..? చంద్రుడు తన వెన్నెలను అడవిలో, మనోహరాలైన భవంతులపై సమానంగానే కురిపిస్తాడు కదా! దానివల్ల అతనికి ఏమైనా ముప్పు కలుగుతుందా? కలగదే! అలా రుషులపై ఎలాగైతే కరుణను కురిపిస్తావో, నాపై కూడా క్షణకాలం కరుణను కురిపిస్తే.. నేను ధన్యుడను అవుతాను. నీకేమీ హాని కలుగదు’ అంటారు శంకరులు.
‘అమ్మా! స్వచ్ఛమైన మనసు గలవారు అందరిపట్ల సమాన దృష్టిని కలిగి ఉంటారు. ఒకరు తనవారని, మరొకరు పరాయివారనే భేద భావన వారికి ఉండదు. నీవు సూర్యచంద్రులు రెండు కన్నులుగా కలిగిన దానవు. అందులో ఒక కన్నయిన చంద్రుడే సమభావనతో ఉన్నప్పుడు, నీకు ఆ సమదృష్టి ఉన్నదని వేరుగా చెప్పాలా? అవసరం లేదుకదా! ఆయనే చేయగా లేనిది నీవెందుకు చేయలేవు?’ అని స్వతంత్రంతో ఒక కుమారునిగా తల్లిని మనందరి పక్షాన శంకరుడు ప్రశ్నిస్తున్నాడు. అమ్మ కరుణా కటాక్షాలను పొందేందుకు తనకుగల అర్హత ఏమిటి? అంటే తాను దీనుడు. తల్లికి దూరంగా ఉన్నాడు. తాను ఆమె కుమారుడు కావడం, ఆమెతో తనకు ఉన్న సాన్నిహిత్యం.. ఆయన అర్హతలివే. భక్తులుగా మనమూ సంతరించుకోవలసిన లక్షణాలివే.
‘హే సర్వమంగళా! నీవు సర్వమయివి. అన్నీ బాగా తెలిసిన దానివి. అనపాయనివి… అంటే అపాయాలను తొలగించే దానివి. నేను భవబంధాలనే అపాయాలతో బాధపడుతున్నాను. నీవు దోషవర్జితవు. నా దోషములను తొలగించి కాపాడవమ్మా. దానితో నీకు ‘దుఃఖహంత్రి’- దుఃఖాలను తొలగించే దానివనే పేరు సార్థకమవుతుంది’ అని ప్రస్తుతించాడు శంకరులు. అలాంటి సాంద్రకరుణామూర్తి, లలితాంబిక మనందరినీ రక్షించుగాక.
– పాలకుర్తి రామమూర్తి