తెలంగాణ చరిత్రలో 17 సెప్టెంబర్ 1948 ఒక మైలురాయి. కానీ ఆ రోజేం జరిగింది? దాని తర్వాత పరిణామాలేమిటి? వీటిని సమగ్రంగా చర్చిస్తేనే ఆ రోజును ఎలా జరుపుకోవాలో ప్రజలకే అర్థం అవుతుంది. కానీ చరిత్ర సమగ్రంగా తెలియని బీజేపీ కేవలం రాజకీయ లబ్ధి కోసమే దీనిని విమోచనా దినంగా పేర్కొంటున్నది. నిజానికి, సెప్టెంబర్ 17.. రాచరికం నుంచి ప్రజాస్వామ్యంలోకి తెలంగాణ అడుగిడిన రోజు. అంతే. ఆంధ్ర వలస పాలన నుంచి బయటపడిన జూన్ 2 నిజంగా తెలంగాణ విమోచన దినం.
ఆంధ్రా వలస పాలన నుంచి విముక్తి పొందిన దినమే అసలైన విముక్తి దినం. తెలంగాణ ఏడిన తర్వాత కూడా ఉద్యమకారుల అభిప్రాయం ఇలానే ఉంది. 60 ఏండ్ల సుధీర్ఘ పోరాటం అనంతరం తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన జూన్ 2 మాత్రమే తెలంగాణకు అసలైన విముక్తి దినం. అయితే తెలంగాణ ప్రభుత్వం స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా 17 సెప్టెంబర్ను జాతీయ సమైక్యతా దినంగా జరపడం సమంజసమే. 8 ఏండ్లుగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తోంది. చరిత్ర మిగిల్చిన గాయాలను మాన్పుకుంటూ, మత సామరస్యతను కాపాడుకుంటూ ముందుకు సాగుతోంది. ఈ దశలో విద్రోహ శక్తులు మతాల మధ్య వైషమ్యాలు పెంచి పోషించడానికి కుట్రలు పన్నుతున్నాయి. తెలంగాణ ప్రజలు ఈ కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలి.
17సెప్టెంబరును ఎలా చూడాలన్న అంశంపై తెలంగాణ సమాజంలో ఉద్యమ కాలం నుంచే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. తెలంగాణ హిస్టరీ సొసైటీ ఈ భిన్న దృక్కోణాలని క్రోడీకరించి 2009లో ‘17 సెప్టెంబర్ – భిన్న దృక్కోణాలు’ అనే పుస్తకాన్ని వెలువరించింది. స్వతంత్ర సంస్థానంగా ఉన్న హైదరాబాద్ రాజ్యం ఆ రోజు భారత యూనియన్లో కలిసింది. విమోచన, విముక్తి లాంటి వ్యక్తీకరణలు 17 సెప్టెంబరుకు ఆపాదించడం సరైంది కాదనేది చాలా మంది చరిత్రకారులు, మేధావుల అభిప్రాయం. ఉద్యమ సమయంలో బీజేపీ నిర్వహించిన ఒక రౌండ్ టేబుల్ సమావేశంలో మెజారిటీ సభ్యులు 17 సెప్టెంబరును విలీన దినంగానే పరిగణించాలని అభిప్రాయాలు వ్యక్తం చేశారు.
సమకాలీన చరిత్రకారులు కానీ, భారత ప్రభుత్వం కానీ, భారత సైన్యం కానీ 17 సెప్టెంబర్ ఘటనను విమోచనగా, విముక్తిగా పేర్కొనలేదు. పోలీస్ యాక్షన్గా పిలువబడిన సైనిక చర్య లక్ష్యం హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్లో కలుపుకోవడం, హైదరాబాద్ రాజ్యంలో బలపడుతున్న కమ్యూనిస్టులని, సంస్థానంలో అరాచకాలకు పాల్పడిన రజాకార్లను అణచివేయడం. 17 సెప్టెంబర్ 1948 అనంతర పరిణామాలను విశ్లేషిస్తేనే మనకు నాటి ఘటన విముక్తా? మరొకటా? అన్నది అర్థమవుతుంది.
1. 1952లో ప్రజాప్రభుత్వం ఏర్పడే వరకు నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ను భారత ప్రభు త్వం రాజ్ ప్రముఖ్గా నియమించింది. ఆయన సంతకాలతోనే ఉత్తర్వులు జారీ అయ్యేవి.
2. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఫలితంగా మూడు వేల గ్రామాల్లో రైతు కూలీల అధీనంలోకి వచ్చిన 10 లక్షల ఎకరాల భూమి తిరిగి భూస్వాముల పరమైంది. పోరాటం ఫలాలను సైనిక చర్య ఇలా నాశనం చేసింది.
3. హైదరాబాద్ రాజ్యం భారత యూనియన్లో కలిసిన తర్వాత కూడా తెలంగాణ ప్రజలను పీడించుకు తిన్న భూస్వామ్య విధానం కొనసాగింది. 1970-80 దశకాల్లో వెల్లువెత్తిన భూస్వామ్య వ్యతిరేక రైతాంగ ఉద్యమాల తర్వాతనే భూస్వామ్య పీడన బలహీనపడింది.
4. సాయుధ రైతాంగ పోరాటానికి నాయకత్వం వహించిన కమ్యూనిస్టులు, పోరాటంలో పాల్గొన్న వేలాది మంది రైతు కూలీలు భారత సైన్యం ఊచకోతకు గురయ్యారు.
5. హైదరాబాద్ రాజ్యంలో ముఖ్యంగా మరాట్వాడాలో వేలాది మంది అమాయక ముస్లింలను రజాకార్ల ఏరివేత పేరున సైన్యం ఊచకోత కోసింది. నాటి ప్రధాని నెహ్రూ నియమించిన పండిత్ సుందర్ లాల్ కమిటీ నిజ నిర్ధారణ నివేదిక ఇందుకు సాక్ష్యంగా ఉంది.
6. సైనిక చర్య అనంతరం 1948 నుంచి 1952 దాకా హైదారాబాద్ రాజ్యంలో వెల్లోడి అనే సివిల్ అధికారి ప్రధాని హోదాలో ఉన్నారు. ఆ నాలుగేండ్లు కేంద్రప్రభుత్వ పాలన కొనసాగింది. 1952లో హైదారాబాద్ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా ప్రజా ప్రభుత్వం ఏర్పాటైంది.
7. 1956లో ఫజల్ అలీ కమీషన్ సిఫారసులకు విరుద్ధంగా తెలంగాణ, ఆంధ్ర రాష్ర్టాలను కలిపి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేయడంతో తెలంగాణ తిరిగి పరాధీనమైంది.
8. 17 సెప్టెంబర్ కలయిక తెలంగాణలో ఆంధ్ర వల స పాలనకు పునాది రాయి వేసిందని, తెలంగాణ ప్రజల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యి లో పడినట్టయ్యిందని చాలా మంది ఉద్యమకారులు భావించారు. ఈ వలస పాలన నుండి బయట పడటానికి తెలంగాణకు 60 ఏండ్లు పట్టింది.
1927లో బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన భారత చట్టబద్ధ కమిషన్ (ఇదే సైమన్ కమిషన్ ) భాషా ప్రాతిపదికన రాష్ర్టాల పునర్ వ్యవస్థీకరణ జరగాలని సూచించినప్పటి నుంచి ఆంధ్ర రాష్ట్రం కోసం ఉద్యమం ఊపందుకున్నది. స్వాతంత్య్రానంతరం ఏర్పాటు చేసిన ధర్ కమీషన్, జేవీపీ కమిటీలు కూడా ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు సిఫారసు చేశాయి. అయితే మద్రాసు నగరం ఎవరికి చెందాలన్న అంశంపై వివాదం చెలరేగడంతో ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు వాయిదా పడింది. 1952 లో పొట్టి శ్రీరాములు ఆమరణ దీక్ష, మరణం కారణంగా 1953, అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఆవిర్భవించింది. కొత్త రాష్ర్టానికి రాజధాని, వనరులు, నిధుల సమస్య తలెత్తుందని గ్రహించిన ఆంధ్రా రాజకీయ నాయకులు తెలంగాణను కలుపుకొని విశాలాంధ్రను ఏర్పాటు చేస్తే ఈ సమస్యలన్నీ తీరుతాయని, ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుకు ముందే విశాలాంధ్ర భావనకు బీజం వేశారు. దీనికి సైద్ధాంతిక భూమిక కల్పించినది పుచ్చలపల్లి సుందరయ్య. తెలంగాణ మేధావి వర్గం మెదళ్ల లోనికి విశాలాంధ్ర భావనను ఎక్కించారు. దాశరథి, కాళోజీ, దేవులపల్లి రామానుజరావు వంటి సాహితీవేత్తలు విశాలాంధ్ర భావనకు లొంగిపోయారు. (1969 నాటికి కాళోజీ, దాశరథి తమ తప్పు తెలుసుకొని తిరిగి తెలంగాణవాదులుగా మారారు). 1949లో ఏర్పాటైన విశాలాంధ్ర మహాసభ అటు ఆంధ్ర, ఇటు తెలంగాణలో విశాలాంధ్ర ప్రచారాన్ని ఉధృతం చేసింది. 1953లో ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ తమ తాత్కాలిక రాజధాని కర్నూలు, శాశ్వత రాజధాని హైదరాబాద్ అని తీర్మానించింది. మొదటి నుంచి ఆంధ్రానాయకుల చూపు హైదరాబాద్పైనా, తెలంగాణ వనరుల పైనా ఉన్నదని స్పష్టమవుతోంది.
1952లో వరంగల్లో ప్రారంభమైన గైర్ ముల్కీ గో బ్యాక్ ఉద్యమం అన్ని జిల్లాలకూ పాకింది. నాటి సీఎం బూర్గుల వ్యక్తిగతంగా విశాలాంధ్ర భావనకు వ్యతిరేకమే అయినా ప్రభుత్వం వందలాది మంది విద్యార్థులను అరెస్ట్ చేసింది. ఉద్యమం సందర్భంగా విద్యార్థులపై జరిపిన కాల్పుల్లో 13 మంది మరణించినట్లు చరిత్ర చెబుతున్నది. 1953లో నెహ్రూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాష్ర్టాల పునర్ వ్యవస్థీకరణ సంఘానికి (ఫజల్ అలీ కమిషన్) తెలంగాణ వాదులు విశాలాంధ్ర ఏర్పాటుని వ్యతిరేకిస్తూ వందలాది విజ్ఞాపన పత్రాలు సమర్పించారు. విశాలాంధ్ర ఏర్పాటైతే తెలంగాణ అన్ని రంగాల్లో దోపిడీకి గురవుతుందని, నిధులు, నీళ్లు, నియమాకాల విషయంలో నష్టం జరుగుతుందని విన్నవించినారు (ఈ భయాందోళనలు అన్నీ నిజమేనని 60 ఏండ్ల సమైక్య రాష్ట్ర చరిత్ర రుజువు చేసింది). ఫజల్ అలీ కమిషన్ ఆంధ్ర, తెలంగాణ ప్రత్యేక రాష్ర్టాలుగా కొనసాగాలని సిఫారసు చేసింది. కమిషన్ సిఫారసుతో బెంబేలెత్తిన ఆంధ్ర నాయకత్వం ఢిల్లీకి పరుగులు తీసి ప్రధాని నెహ్రూ, హోంమంత్రి గోవింద్ వల్లభ్ పంత్ తదితర జాతీయ నాయకులతో తమకున్న పరిచయాల సాయంతో వారిని విశాలాంధ్రకు అనుకూలంగా మార్చుకోగలిగినారు. విశాలాంధ్ర భావన వెనుక ఉన్న దోపిడి గురించి తెలిసిన నెహ్రూ కూడా ఆంధ్ర నాయకుల ఒత్తిడికి తలొగ్గి ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల విలీనాన్ని ప్రకటించారు. పెద్ద మనుషుల ఒప్పందం పేరుతో తెలంగాణకు రక్షణల హామీ పత్రం రాసిచ్చారు. అయితే దాని అమలు నీటి మీద రాతగా మారింది. 60 ఏండ్ల సమైక్య రాష్ట్ర చరిత్రలో వివిధ చట్ట బద్ద సంస్థలు, రాజ్యాంగ బద్ధ ఉత్తర్వులు, కమిషన్లు, శాసనసభా కమిటీలు ఏవీ కూడా తెలంగాణకు ప్రయోజనాలు చేకూర్చలేకపోయాయి. తెలంగాణ వలస దోపిడీకి కేంద్రంగా మారింది. సాంస్కృతిక అణచివేతకు గురైంది.
ఇదంతా జరగడానికి 17 సెప్టెంబరు 1948 న పునాదిరాయి పడిందని మెజారిటీ తెలంగాణ ఉద్యమకారులు భావించారు. విద్రోహ రాజకీయాలు విజయం సాధించడానికి నేపథ్యంగా మారిన 17 సెప్టెంబరు విమోచన దినం ఎట్లవుతుంది? అని ప్రశ్నించినారు. తెలంగాణలో రాచరిక పాలనని అంతం చేసి ప్రజా ప్రభుత్వం ఏర్పాటు కావడానికి దోహదం చేసినందున తెలంగాణ చరిత్రలో ఆ రోజు ఒక మైలు రాయి మాత్రమే. అదొక సాధారణ దినంగా గడచిపోవాలి తప్ప ఉత్సవాలు దేనికి? అని ప్రశ్నించారు. 17 సెప్టెంబరును అధికారికంగా తెలంగాణ విమోచన దినంగా జరపాలనే డిమాండ్కు స్వ రాష్ట్రంలో ప్రాసంగికత లేదు. ఆంధ్రా వలస పాలన నుంచి విముక్తి పొందిన దినమే అసలైన విముక్తి దినం.
-శ్రీదేశ్