శరజ్జ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూట మకుటాం
వరత్రాసత్రాణ స్ఫటిక ఘుటికా పుస్తక కరామ్
సకృన్నత్వా న త్వా కథమివ సతాం సన్నిదధతే
మధుక్షీర ద్రాక్షా మధురిమ ధురీణాః ఫణితయః!
(సౌందర్యలహరి-15)
అమ్మా! నీవు శరత్కాలంలోని వెన్నెల్లా స్వచ్ఛమైన, తెల్లని శరీరం కలిగినదానివి. తలపై లేలేత చంద్రవంకతో కూడిన కేశకలాపమే కిరీటంగా ధరించావు. నాలుగు చేతులతో వరదాన ముద్ర (వరాలిచ్చే ముద్ర), త్రాసత్రాణ ముద్ర (అభయముద్ర), ఘుటిక (స్ఫటికాల జపమాల), పుస్తకాన్ని ధరించావు. అలాంటి నిన్ను ఒక్కసారి స్మరించి, మొక్కే బుద్ధిమంతులకు తేనె, పాలు, ద్రాక్ష మొదలైన తీపి పదార్థాల్లా మధురమైన వాక్కును నిరర్గళంగా మాట్లాడే నేర్పు రాకుండా ఎలా ఉంటుంది? అంటే తప్పకవస్తుంది.
ఆ జగన్మాతను సరస్వతీదేవి రూపంలో ధ్యానిస్తున్న శ్లోకం ఇది. సరస్వతి బుద్ధికి ప్రతీక. ‘మహాబుద్ధిః’ అంటుంది లలితా సహస్ర నామం. బుద్ధిమంతుల్లో ‘తెలివి’ రూపంలో ప్రకాశించే చిద్రూపిణి లలితా పరమేశ్వరి. వాక్కు, బుద్ధి, జ్ఞానం సరస్వతీ మాత ఆరాధనతో కలుగుతాయి. ఈ శ్లోకంతో పాటు తర్వాతి రెండు శ్లోకాలను ధ్యానిస్తే మంచి కవిత్వం, మాట్లాడటంలో నైపుణ్యం, విద్వత్తు లభిస్తాయని చెప్తారు. లలితా సహస్ర నామాల్లో ‘శరచ్చంద్ర నిభానన’ అని ఉంది. శరత్కాల చంద్రుడిలా చల్లగా వెలుగుతూ సంతసించే తల్లి లలితాదేవి. ఆమె శారద. అంటే స్వచ్ఛమైనది, తెల్లనిది. తెలుపు స్వచ్ఛతకు, స్పష్టతకు సంకేతం. ‘సరస్వతి పరిణత శరచ్చంద్ర వదన’ శరత్కాలంలో పూజలు అందుకొనే లలితాంబిక సరస్వతి రూపంలో ప్రతిభను, మేధను, ధారణను, స్ఫురణను ప్రసాదిస్తుంది.
నిజానికి స్ఫురణే దైవం. ఈ ప్రతిభ ఆరు విధాలుగా వ్యక్తమవుతుంది. వాక్యపదీయం గ్రంథం ప్రకారం స్వభావం, ఆచరణ, అభ్యాసం, యోగం, అదృష్టం, విశిష్టంగా పెద్దలను సేవించడం ఈ ఆరింటిని ఆచరించడం ద్వారా ప్రతిభ వ్యక్తమవుతుంది. ఉత్తమ ఆలోచనలు బుద్ధి ప్రచోదన వల్ల కలుగుతాయి. ‘పురుషస్య వాగ్రసః’ అంటుంది ఛాందోగ్య ఉపనిషత్తు. సమాజంలో గౌరవం పొందాలంటే వాక్కు స్వచ్ఛంగా ఉండాలి. ఆమె జటాజూటంలో చంద్రుడు ఉన్నాడు, చంద్రుడు సౌమ్యుడు, అంటే వాక్కు సౌమ్యంగా ఉండాలి. జటాజూటం చక్కగా బంధించి ఉంటుంది. దానర్థం చెప్పే కవిత్వం పటుత్వంతో ఉండాలి. మేధ వల్ల పదునైన ఆలోచనలు, ధారణ వల్ల చదివింది, విన్నది జ్ఞాపకం పెట్టుకోవడం, స్ఫురణ వల్ల సమయానికి ఆ జ్ఞానాన్ని వినియోగించుకునే తెలివి కలుగుతాయి. అమ్మను సరస్వతిగా (జ్ఞాన ప్రవాహంగా), వాగ్వాదినిగా (సుభాషితాలైన, దివ్యమైన వాక్కులను ప్రసాదించే ఈశ్వరిగా), వాగధీశ్వరిగా (వాక్కుకు అధిదేవిగా) ఉపాసించడం వల్ల ఆమె విచక్షణాశీలాన్ని ప్రసాదించి బుద్ధిని ప్రకాశింపజేస్తుంది.
ఆ తల్లికి ఒక్కసారి నమస్కరిస్తే మధుక్షీర ద్రాక్షా మధురిమతో కూడిన భాషను అనుగ్రహిస్తుంది. ‘ఒక్కసారి నమస్కరిస్తేనే ఇస్తుందా?’ అంటే అవును అనే సమాధానం. కాకపోతే ఆ ఒక్కసారి ఒక్కటి చేసి నమస్కరించాలి. దేనిని ఒక్కటి చేయాలంటే త్రికరణాలను (మనస్సు, వాక్కు, చేసే పనులు) ఒక్కటి చేయాలి. దేనిని ఆలోచిస్తామో దానినే చెప్పాలి, ఏది చెప్తామో దానినే చేయాలి, ఏది చేయగలమో దాన్నే ఆలోచించాలి. అప్పుడు వచ్చే వాక్కు మధువులా తీయగా ఉంటుంది. పాలలాగా సాత్వికంగా, సత్వభరితంగా ఉంటుంది. ద్రాక్షాపాకంలాగా సులువుగా అర్థం చేసుకునేందుకు సహకరిస్తుంది. సరస్వతిగా భావన చేసినప్పుడు ఆ తల్లి, ఉన్నతమైన మనో భూమికలోంచి ఆనందమయమైన జీవిత యజ్ఞ నిర్వహణకు అవసరమైన విద్యను ప్రసాదిస్తుంది. మనోశక్తిని జాగృతం చేస్తుంది. అన్ని విద్యలకు, సకల శాస్ర్తాలకు, జ్ఞానానికి అధిదేవత అయిన సారస్వత రూపిణి లలితాంబిక మనందరి అజ్ఞానం తొలగించి రక్షించుగాక.
– పాలకుర్తి రామమూర్తి