ఓవైపు భారత ఆర్థికవ్యవస్థ అభివృద్ధి బాటలో ఉంటే, మరోవైపు దేశంలో అంతులేని నిరుద్యోగం ఉన్నది. ఏమిటీ ఆంతర్యం? దీనిని పరిశీలిద్దాం. ఏ దేశమైనా అభివృద్ధి చెందుతున్నదంటే ఆ దేశ శ్రామికశక్తి వ్యవసాయరంగం నుంచి పారిశ్రామిక, సేవారంగాల్లోకి వెళ్తుంది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందుతూ, తలసరి ఆదాయాన్ని పెంచుకుంటుంది. కానీ, దీనికి విరుద్ధంగా భారతదేశంలో ప్రస్తుతం పారిశ్రామిక రంగాల నుంచి శ్రామికశక్తి వ్యవసాయరంగం వైపు పయనిస్తున్నది. ఇదో విచిత్రమైన పరిణామం.
సీఎంఈ, సీఈడీఏ నివేదికల ప్రకారం… 2016-17 నుంచి 2021-22 మధ్యకాలంలో తయారీ రంగంలో శ్రామికుల సంఖ్య 5.2 కోట్ల నుంచి 2.7 కోట్ల మందికి తగ్గిపోయింది. అంటే దాదాపు 50 శాతం తగ్గుదల. టెక్స్టైల్స్, నిర్మాణం, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి రంగాల్లో ఉపాధి క్షీణత ఎక్కువగా కనిపిస్తున్నది. 2016-17 నుంచి 2021-22 మధ్య కాలంలో ఒక్క టెక్స్టైల్స్ రంగంలోనే శ్రామికుల సంఖ్య 1.2 కోట్ల నుంచి 55 లక్షలకు పడిపో యింది. గమ్మతైన విషయం ఏమంటే లేబర్ ఇంటెన్సివ్ సెక్టార్ నుంచి క్యాపిటల్ ఇంటెన్సివ్ వైపు భారత ఆర్థికవ్యవస్థ పయనిస్తున్నది. ఇది ప్రమాదకరమైన పరిస్థితి. నూతన మెషినరీ, టెక్నాలజీల ద్వారా వస్తు ఉత్పత్తి జరుగుతున్నది. పెద్ద పెద్ద పెట్టుబడిదారుల చేతిలో బడా పారిశ్రామిక సంస్థలు ఉండటం కారణంగా శ్రామిక జనాభాకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకపోయినా, వృద్ధిబాటలో ఆర్థికవ్యవస్థ పరుగులు పెడుతుంది. దీంతో శ్రామిక జనాభా వ్యవసాయరంగం వైపు తిరిగి వెళ్తున్నారు.
దేశంలో నిరుద్యోగం ఆకాశాన్ని తాకుతున్నది. 2018లో ఉత్తరప్రదేశ్లో ఐదవ తరగతి అర్హత కలిగిన 62 టెలిఫోన్ మెసెంజర్ పోస్టులకు 92 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన నిరుద్యోగులు కూడా ఉన్నారు. అలాగే రేల్వే గ్యాంగ్మెన్, పోర్టర్ వంటి 67 వేల పోస్టులకు 1.9 కోట్ల మంది దరఖాస్తు చేసుకున్నారు. కొన్ని హోటల్స్లో 4వ తరగతి అర్హత కలిగిన వెయిటర్ వంటి పోస్టుకు కూడా డిగ్రీ చదివిన వారు వేల సంఖ్యలో దరఖాస్తు చేసుకోవడం విస్మయం కలిగిస్తున్నది. దీన్నిబట్టే నిరుద్యోగం ఎంత తీవ్రంగా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. గత యూపీఏ ప్రభుత్వం నుంచి నేటి ఎన్డీయే ప్రభుత్వం వరకూ నిరుద్యోగాన్ని పెంచే విధానాలే తప్ప తగ్గించే విధానాలను తీసుకురావటం లేదు. మేక్ ఇన్ ఇండియా, పీఎల్ఐ వంటి పథకాలు ఎన్ని వచ్చినా దేశంలో శ్రామిక జనాభాకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించటం లేదు. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని ఉచితాలు, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న క్రమంలో కొంతమేరకు ఉపశమనం కలుగుతున్నది. కానీ, ఇది తాత్కాలికమే. పలు రాష్ర్టాల్లో దేశ సగటు కంటే మూడు రెట్లు అధికంగా నిరుద్యోగం నమోదవుతు న్నది. ఏటా 1.2 కోట్ల మంది శ్రామిక జనాభాలో కొత్తగా చేరుతున్నారు. వీరిలో 55 లక్షల మందికి మాత్రమే ఉపాధి అవకాశాలు దొరుకుతున్నాయి. 2021-22లో ఉద్యోగం కోసం వెతుకుతున్న వారు సుమారు కోటి మంది ఉండగా, కేవలం పది లక్షల మందికి మాత్రమే ఉపాధి లభించిందని గణాంకాలు వెల్లడించాయి.
ఇలాంటి పరిస్థితుల్లో నిరుద్యోగ నిర్మూలన కోసం ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా విద్యావ్యవస్థలో ఒకేషనల్ కోర్సులను అభివృద్ధి పరచాలి. నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట వేయాలి. భారీ పెట్టుబడి, మెషినరీ, టెక్నాలజీ ద్వారా ఉత్పత్తి చేసే రంగాలకు ప్రాధాన్యం తగ్గించి, లేబర్ ఇంటెన్సివ్ సెక్టార్లకు ప్రాధాన్యం పెంచాలి. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా విద్యా విధానాన్ని, సబ్జెక్టులను ప్రవేశపెట్టాలి. ఖాళీ పోస్టులను భర్తీచేయాలి. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కు ప్రాధాన్యం ఇవ్వాలి. నూతన టెక్నాలజీని అభివృద్ధి పరచాలి. ప్రభుత్వ విధానాలను సమీక్ష చేసుకొని, శ్రామిక శక్తి ద్వారా ఉత్పత్తిరంగాల్లో వస్తూత్పత్తికి ప్రాధాన్యం పెంచాలి.
ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో స్థాపించే పరిశ్రమలు యువ జనాభాకు, శ్రామిక శక్తికి పెద్దపీట వేసేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. తద్వారా నిర్మాణాత్మక రీతిలో, శాశ్వత ప్రాతిపదికన ఆర్థిక అభివృద్ధి సాధించవచ్చు. కేవలం సేవారంగం, రియల్ ఎస్టేట్ ద్వారా వచ్చే ఆదాయం, అభివృద్ధి తాత్కాలికమే అని గుర్తించాలి. ప్రజల జీవితాల్లో నిజమైన అభివృద్ధి అంటే వారి తలసరి ఆదాయం పెరగటమే. జీవన ప్రమాణాలు మెరుగుపడాలి.
ద్రవ్యోల్బణం తగ్గాలి. ధరలు అందుబాటులో ఉండాలి. ప్రభుత్వాలు పెట్టుబడిదారులకు అండ గా కాకుండా, పేద, మధ్యతరగతి ప్రజల జీవితాలు మెరుగుపడే విధానాలకు అనుగుణంగా పథకాలను ప్రవేశపెట్టాలి.
ఐ.ప్రసాదరావు