ఊరి సర్పంచ్ నుంచి దేశ ప్రధాని దాకా, ఏ ప్రజా ప్రతినిధికైనా ఉండవలసిన లక్షణాలలో మొదటిది ప్రజల బాగోగులను చూడడమే. ఇప్పటి వరకూ పాలించిన ముఖ్యమంత్రులకు, ఇప్పడున్న ముఖ్యమంత్రికి జమీన్, ఆస్మాన్ ఫరక్ కొట్టొచ్చినట్టు కనపడుతున్నది. భిన్నంగా ఆలోచించడం, ఏకాగ్రత, అకుంఠిత దీక్ష, పరిపాలనా దక్షత, నవీన విధానాల రూపకల్పనా శక్తి, ప్రజల జీవితాల్లో సుఖ సంతోషాలు ఉండాలని ఆలోచించే తత్వం, శ్రద్ధగా పని చేసే సామర్థ్యం, వినే ఓర్పు, ఏ సమస్యకైనా ఓ పరిష్కారం ఉంటుందనే సానుకూల ధోరణి. ఈ లక్షణాలన్నీ ఒంట బట్టించుకున్న ప్రజా ప్రతినిధి మన ముఖ్యమంత్రి.
భిన్నంగా ఆలోచించడం : ప్రజల ప్రశాంతమైన జీవితానికి నీళ్ల ప్రాధాన్యం ఎవరికీ తెలియంది కాదు. కాకపోతే, దానిపై దృష్టి పెట్టి నీటి వనరులు పుష్కలంగా లభ్యమయ్యేట్టు ఏర్పాటు చేసే ఆలోచన అందరికి రాదు. తెలంగాణ అభివృద్ధికి మొదటిమెట్టు జలం. అది ఉంటే అనూహ్యమైన అభివృద్ధి జరుగుతుందని మన ముఖ్యమంత్రి నిరూపించారు. గోదావరి నీళ్లను తెలంగాణలోని కోటి ఎకరాలకు పారించాలన్న ఉద్దేశంతో మెదడుకు సాన బెట్టి, వ్యూహాత్మకంగా ‘ఔట్ ఆఫ్ బాక్స్’ ఆలోచనతో రూపుదిద్దుకున్నదే కాళేశ్వరం ప్రాజెక్ట్. నీటి పారుదలశాఖలోని పెద్ద పెద్ద ఇంజినీర్లకే ఊహకందని ప్రాజెక్ట్. గోదావరి కంటే, ప్రాణహితలో నీటి లభ్యత ఎక్కువుంటుందన్న నిర్ణయానికి రావడం, కిందికి పారే నీళ్లను అవసరమైనంత పైకి ఎత్తిపోసి, లక్షల ఎకరాలకు నీటిని పారించవచ్చని ఆలోచించడం ఆయన దూరదృష్టికి నిదర్శనం.
వేలాది చెరువులకు మరమ్మతులు చేపట్టి, పూడికలు తీసి, ఆ మట్టినే పొలాల్లో వినియోగించి, ఉత్పాదకతను పెంచడం గొప్ప ఆలోచన.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని ఏ ప్రాంతమైనా, దాని భౌగోళిక, నైసర్గిక స్వరూపం, బలం, బలహీనత, అవకాశాలు తదితర విశ్లేషణ సంపూర్ణంగా చేసిన వ్యక్తి కేసీఆర్. తను ఏది పరిశీలించినా, క్షుణ్ణంగా, లోతుగా అధ్యయనం చేయటం ఆయన లక్షణమని చాలామంది ప్రత్యర్థి రాజకీయ నాయకులు కూడా ఒప్పుకుంటారు.
మెదక్, కరీంనగర్, నంద్యాల, శ్రీకాకుళం, ఒంగోలు ఇట్ల ఏ ప్రాంతంలో ఏ సమస్యలున్నయో అక్కడి స్థానిక నాయకులకన్నా కేసీఆర్కే ఎక్కువ తెలుసంటారు. ఈ విధంగా వ్యవసాయ రంగానికి సమృద్ధిగా నీళ్లందించాలన్న తపనతో వివిధ ప్రాజెక్టులను ఆవిష్కరించిన నాయకుడు అతను. నీళ్ల సమృద్ధి, 24 గంటల ఉచిత కరెంటు అందుబాటులో ఉండడం వల్ల రైతులు సంతోషంగా పంటలు విరివిగా పండించుకోవడం సాధ్యమైంది.
2014-15 లో ధాన్యం దిగుబడి 68 లక్షల టన్నులయితే, 2022-23 నాటికీ 2.49 కోట్ల టన్నులకు చేరిందంటే, నీటి పారుదల నిర్వహణ ఎంతటి ప్రభావాన్ని చూపిస్తుందో అర్థ మవుతున్నది. ఒకప్పుడు ఎండిపోయి, బీడు బడ్డ తెలంగాణ భూమి ఇప్పుడు సస్య శ్యామలంగా మారి దేశానికి అన్నం పెట్టే ‘అన్నపూర్ణ’ గా భాసిల్లుతున్నది.
2014లో 1.31 కోట్ల ఎకరాల సాగు భూ మి ఉండగా 2022లో అది 2.31 కోట్ల ఎకరాలకు పెరిగింది. గడచిన 9 ఏండ్లలో 176 శాతం పెరిగినట్టు. మిషన్ భగీరథ ద్వారా తెలంగాణలో ఉన్న 54,98,219 ఇండ్లకు, స్వచ్ఛమైన నీరు అందించడం ఒక ఘనమైన కార్యక్రమం. ఎవరైనా ఒక పని చేస్తామని చెప్పి ఓట్లడుగుతారు. కానీ ఒక పని మేము చేయకుంటే ఓటు వెయ్యకండి అని చెప్పడం ఒక్క ధైర్యశాలికే చెల్లు. ఇదేం చిన్న దిల్లగి ముచ్చట కాదు.
హరిత హారం ద్వారా 273 కోట్ల మొక్కలు నాటడంతో ఎటు చూసినా పచ్చని, ఆహ్లాదకర వాతావరణమే. ఆకు పచ్చని చీర కట్టిన తెలంగాణను పుడమి తల్లి దీవిస్తున్నట్టుగా అనిపిస్తున్నది. ఫలితంగా అడవి విస్తీర్ణం కూడా పెరిగింది. నీళ్లు పుష్కలంగా లభ్యమౌతున్నందున, చేపల ఉత్పత్తి 3 రెట్లు, రొయ్యల ఉత్పత్తి అనూహ్యంగా 7,8 టన్నుల నుంచి ఏకంగా 11,12 వేల టన్నులకు పెరిగాయి.
ఏ దేశానికైనా జీడీపీ , ఏ రాష్ర్టానికైనా జీఎస్డీపీ ఆర్థ్ధిక పుష్టి (ఎకనామిక్ హెల్త్) ఏ విధంగా ఉందో తెలియ చేస్తుంది. 2014లో తెలంగాణ జీఎస్డీపీ రూ. 5 లక్షల కోట్లు ఉండగా అదీ 2023 నాటికి రూ. 13.27 లక్షల కోట్లకు పెరిగింది. అదే కాలంలో దేశం జీడీపీ రెండింతలు కూడా పెరగలేదు. ఒక ప్రదేశంలోని వ్యక్తి సగటు ఆదాయం ఆ ప్రాంతంలోని వ్యక్తుల జీవన ప్రమాణాన్ని ప్రతిబింబిస్తుంది.తెలంగాణలో 2014 లో తలసరి ఆదాయం రూ.1.21 లక్షలుంటే అది 2023 కల్లా అంటే 9 ఏండ్లలోనే రూ. 3.17 లక్షలైంది. రెండున్నర రెట్ల కంటే ఎక్కువన్నమాట.
నీతిఆయోగ్ ప్రకారం 2015-16, 2019-21 మధ్యలో తెలంగాణలో పేదరికం 7.3శాతం క్షీణించినట్టు పేర్కొన్నది. ముఖ్యంగా గ్రామీణ ప్రజల జీవన ప్రమాణం 12శాతం పెరిగిందని కూడా తెలిపారు.ఈ ప్రభుత్వం సంక్షేమానికి పెట్టిన ఖర్చు సద్వినియోగమై, ప్రజల జీవన ప్రమాణాన్నే పెంచిందని తెలియడం చాలా సంతోషాన్నిస్తున్నది.
ఈ విధంగా అనతి కాలంలోనే ప్రతి రంగంలో గుణాత్మకమైన మార్పు మన కండ్ల ముందే జరగడం, సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటూ ఆ దిశగానే రాష్ర్టాన్ని నడిపించడం ఒక్క మన ముఖ్యమంత్రి కేసీఆర్కే సాధ్యం. ఇకముందు కూడా తెలంగాణ ఇతోధిక అభివృద్ధి గావించేట్టు మనం కేసీఆర్కు బలంగా నిలుద్దాం.