కురుక్షేత్ర సంగ్రామం పూర్తయింది. అంపశయ్యపై ఉన్నాడు భీష్ముడు. ఉత్తరాయణం కోసం ఎదురు చూస్తున్నాడు. ఆధ్యాత్మిక, ధార్మిక విషయాలను బోధిస్తూ అంతిమ క్షణాలను ఆనందంగా అనుభవిస్తున్నాడు. ధర్మరాజు సహా పాండవులు, ఇతర యోగులు రోజూ భీష్ముడి దగ్గరికి వెళ్లేవారు. ఆయన వారికి ధర్మబోధ చేస్తుండేవాడు. ఒకరోజు పంచపాండవులు, ద్రౌపది, ఇతరులు భీష్ముడి దగ్గరికి వెళ్లారు. వారిని ఉద్దేశించి ధార్మిక విషయాలను వివరించసాగాడు. భీష్ముడి ఉపదేశాలను అందరూ దీక్షగా వింటున్నారు. అక్కడ వాతావరణం గంభీరంగా ఉంది. పరమాత్ముడి లీలలు, ఆధ్యాత్మిక సాధన, ధర్మాచరణ ఇలా ఎన్నో విషయాలను తదేక నిష్ఠతో అనేక ఆఖ్యానాలను, ఉపమానాలను చెప్తూ వివరిస్తున్నాడు భీష్ముడు. నిగూఢమైన పరమార్థ తత్వాన్ని విశదీకరిస్తున్నాడు.
భీష్ముడి ఉపదేశాన్ని అందరూ శ్రద్ధగా వింటున్నారు. ఎవరైనా ఏదైనా సందేహాలు అడిగితే, వాటికి సహేతుకమైన వివరణ ఇస్తున్నాడు భీష్ముడు. అయితే, బోధ మధ్యలో ఉన్నట్టుండి ద్రౌపది ఫక్కున నవ్వింది. ఎవరికీ కారణం అంతుచిక్కలేదు. పాండవులంతా ద్రౌపది వంక ‘ఎందుకు నవ్వావు?’ అన్నట్టుగా చూశారు. చుట్టూ ఉన్న యోగులు ద్రౌపదిని కోపంగా చూశారు. భీష్ముడు తన బోధను నిలిపివేసి ద్రౌపదిని నవ్విన కారణం చెప్పమని అడిగాడు. అప్పుడు ద్రౌపది ‘మహాత్మా! ఈ రోజు తమరు అఖండమైన బోధామృతాన్ని మాకు ప్రసాదిస్తున్నారు. మా జన్మలు పావనమయ్యాయి. కానీ, ఆ రోజు నిండు సభలో దుశ్శాసనుడు నన్ను తీవ్రంగా అవమానించాడు. ఆ సమయంలో మీరు అక్కడే ఉండి కూడా, ఒక్క ధర్మోపదేశం అయినా చేయలేదు ఎందుకు? ఆ రాక్షస కృత్యం నుంచి అతనిని ఎందుకు నివారించలేదు? ఇప్పుడు ఇన్ని ధర్మోపదేశాలు చేస్తున్న మీరు, ప్రమాదకరమైన ఆ సమయంలో మాత్రం మౌనం దాల్చడం గుర్తుకువచ్చి నవ్వు వచ్చింది. ఈ ధర్మోపదేశం నాడు ఎందుకు చేయలేదు?’ అని ప్రశ్నించింది.
ద్రౌపది హేతుపూర్వకమైన మాటలు విని భీష్ముడు చిన్నగా నిట్టూర్చాడు. ‘అవును తల్లీ! నీవు అడిగిన ప్రశ్న యుక్తియుక్తంగా ఉంది. కానీ, దుర్యోధనుడి పాపపు కూడు తినడం వల్ల నా రక్తం అప్పుడు మలినమై ఉంది. అందుకే నాడు నాకు ధర్మం స్ఫురించలేదు. ఇప్పుడు అర్జునుడి బాణ పరంపరతో నా మలిన రక్తం అంతా ప్రవాహమై కొట్టుకుపోయి, శుద్ధ రక్తం మిగలడంతో ధర్మం చక్కగా గోచరిస్తున్నది. అందుకే ఇప్పుడు ధర్మోపదేశం చేయగలుగుతున్నాను’ అన్నాడు భీష్ముడు. అర్థ గాంభీర్యంతో ఉన్న భీష్ముడి మాటలకు అక్కడ ఉన్నవారంతా సంతోషించారు. ఆధ్యాత్మిక అనుభవానికి ఆహారశుద్ధి ఎంతటి ప్రాముఖ్యాన్ని కలిగి ఉందో తెలుసుకొని వారంతా సంతోషించారు.
ఆహారం విషయంలో ముముక్షువులు నాలుగు విధాలైన జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. సాత్త్వికాహారం, మితాహారం, దైవార్పిత ఆహారం, న్యాయార్జితమైన ఆహారం. ఈ నాలుగు లక్షణాలున్న ఆహారాన్ని మాత్రమే గ్రహించాలి. అన్యాయంగా ఆర్జించిన ధనంతో గానీ, అధర్మ మార్గంలో సేకరించిన విత్తంతో గానీ ఏర్పడిన ఆహారం తీసుకుంటే మనసు మలినత్వాన్ని పొందుతుంది. అలాంటి ఆహారం తీసుకున్న సాధకుడి ధ్యానంలో ఆటంకాలు ఏర్పడతాయి. అంతేకాదు, ఆ వ్యక్తి మనసులో ధర్మం ఏమాత్రం స్ఫురించదు. కాబట్టి తినే ఆహారం విషయంలో పైన తెలిపిన నాలుగు నియమాలు ఉండేలా జాగ్రత్తపడాలి. ఆహారం శుద్ధంగా ఉన్నప్పుడే మనసు కూడా శుద్ధంగా ఉంటుంది. మనం తీసుకునే ఆహారాన్ని బట్టి మనసు ప్రవర్తిస్తుంటుంది. కాబట్టి మనసు సాత్తికంగా ఉండాలంటే, తినే ఆహారం కూడా సాత్తికంగానే ఉండాలి. ధర్మబద్ధమైన ఆహారంతోనే ధార్మిక ప్రవర్తన అలవడుతుంది.
(సౌజన్యం: పరమార్థ కథలు)