అంటూ మంచివారికి, చెడ్డవారికి మధ్య తేడాను చెప్పిందీ సుభాషితం. ఒకరు మంచో చెడో మందికి చూపేవి మూడు… అతడి మది, మాట, మార్గం! మదికి, మాటకు, మార్గానికి మధ్య సామ్యముంటే మంచి, లేకుంటే చెడు. మదినెట్లాగూ చదవలేం. ఇక వినిపించేది మాట. కనిపించేది చేత. కొన్నేండ్లుగా దేశంలో జరుగుతున్నది చూస్తుంటే మాటకు, చేతకు మధ్య సాపత్యం కాదు, వైరుధ్యం కనిపిస్తున్నది. మాటలు కోటలు దాటుతుంటే, కాళ్లు తంగేళ్లు కూడా దాటడం లేదు. అనాలోచిత ప్రణాళిక, ఆర్భాటపు ప్రకటన, అమలు కాని ఆచరణ అనే ‘తా బట్టిన కుందేటికి మూడే కాళ్ల’ ధోరణి ఫలితమిది.
స్వచ్ఛ భారత్ అని నినదించినం. ఇటున్న చెత్తను అటు, అటున్న చెత్తను ఇటూ ఊడ్చి ఫొటోలు దిగినం. ఆ ప్రకటనల కోసం కోట్లు ఖర్చు పెట్టినం. కానీ అటూ ఇటూ ఊడ్చిన చెత్తను ఎటు పంపాలో, ఏం చేయాలో చెప్పలేదు. సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు కట్టలేదు. నమామి గంగే అని నమస్కరించినం. వందల కోట్లు పోసినట్టు చెప్పినం. కానీ గంగలోకి పొంగే మురుగునీటిని ఎటు మళ్లించాల్నో మరిచినం. మేకిన్ ఇండియా అని గ్రాఫిక్లతో గర్జించినం. కానీ పరిశ్రమ రావడానికి కనీస అవసరాలైన కరెంటు, నీళ్లు, మౌలిక సదుపాయాల కల్పనను విస్మరించినం. చివరికి ఫ్యాక్టరీ ఎందుకు పెట్టడం లేదని పారిశ్రామికుల్ని బెదిరించినం. హర్ ఘర్ జల్ అని హోరెత్తినం. కానీ నల్లాలోకి నీళ్లెక్కడి నుంచి తేవాలో తెరిపి చూపలేదు. బోర్లు వేసి తోడుతుంటే గుజరాత్లోనే భూగర్భం వట్టిబోయి అసలుకే మోసం వస్తున్నదట! హర్ ఖేత్కో పానీ అన్నం. కానీ ఒక్క ప్రాజెక్టూ కట్టలేకపోయినం. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో! నినాదాల ప్రతిధ్వనికి, ప్రత్యక్షమయ్యే నిజానికి మధ్య ఎక్కడైనా పొంతన ఉందా? మనకు మనమే ఆలోచించుకోవాలి.
మూడు నెలల కిందటి ముచ్చట ఒకటి చూద్దాం. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను నిషేధిస్తూ చట్టం తెచ్చినం. దాన్ని అమలు చేయగలుగుతమా? చేయగలిగినమా? అందుకు అవసరమైన ముందస్తు ఏర్పాట్లు చేసుకున్నమా? క్యారీ బ్యాగులు, ఐస్క్రీం పుల్లల సంగతి వదిలేద్దాం! మనం తినే చాక్లెట్కు, వేసుకునే మందు గోలీకి, అమ్ముతున్న నీళ్ల బాటిల్కి, ఛత్రీకి, థర్మాకోల్కి, సిమెంటు, బియ్యం బ్యాగులకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కాకుండా మనం ఏం ప్రత్యామ్నాయం చూపించినం? ఈ చట్టం వచ్చిన తర్వాతే కదా… పంద్రాగస్టు రోజున, వజ్రోత్సవ సంబురాల్లో ఢిల్లీలో ప్లాస్టిక్ జెండాలు అమ్మకాలు విపరీతంగా సాగాయి. అది సింగిల్ యూజ్ ప్లాస్టికే కదా! ఇది మనం చేసుకున్న చట్టాన్ని మనకై మనమే ఎర్రకోట సాక్షిగా ఉల్లంఘించినట్టు కాదా! సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మంచిదనో, అది ఉండాలనో కాదు నా వాదన. నిషేధ నిర్ణయానికి ముందు, ప్లాస్టిక్ అంత చీప్లో పేదవాడికి ప్రత్యామ్నాయ వస్తువును మనం సిద్ధంగా ఉంచినమా, సమాజాన్ని సన్నద్ధ పరిచినమా? సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పరిశ్రమలు మూతపడితే ఉద్యోగాలు కోల్పోయే కార్మికులకు, నిషేధం వల్ల భారాన్ని ఎదుర్కొనే ప్రజలకు మనం చూపించిన పరిష్కారం ఏమిటి? మనకు మనమే ఆలోచించుకోవాలి.
మాటకు చేతకు మధ్యే కాదు, మదికి మాటకు మధ్య కూడా తేడా కనిపిస్తున్నది. మనం గాంధీజీని పొగుడుతున్నం. గాంధీ దృష్టిలో మతంలో అనైతికతకు చోటు లేదు. మనం అనైతికతనే మతంగా చేసుకుంటున్నం. గాంధీ పరమత సహనంతో ఈశ్వర్ అల్లా తేరే నామ్ అన్నడు. మనం పరమత అ-సహనం అంటున్నం. గాంధీ ఖాదీ వడుకుమన్నడు. మనం జెండా నుంచే ఖాదీని తుడిచిపెడుతున్నం. గాంధీ విదేశీ వస్తు బహిష్కరణ అన్నడు. మనం మనకున్న బొగ్గును కూడా కాదని ఆస్ట్రేలియా నుంచి దిగుమతి చేసుకుంటున్నం. గాంధీ గ్రామాన్ని గౌరవించుమన్నడు. మనం పట్నాన్ని ప్రియురాలిగా చూసుకుంటున్నం. గాంధీ నిరాడంబరం అన్నడు. మనం ఆర్భాటం చేస్తున్నం. గాంధీ పబ్లిక్ సెక్టార్ మంచిదన్నడు. మనం ప్రైవేటే గ్రేటంటున్నం. గాంధీ కుటీర పరిశ్రమల్ని ప్రోత్సహించుమన్నడు. మనం మూయిస్తున్నం. గాంధీ ఒక చెంప మీద కొడితే మరో చెంప చూపించమన్నడు. మరి మనం ఏ రాజ్యాంగంలో లేని, చట్టబద్ధం కాని బుల్డోజర్ను ఎందుకు పంపుతున్నం? న్యాయ వ్యవస్థ ఇవ్వాల్సిన తీర్పును కూడా మన చేతుల్లోకే ఎందుకు తీసుకుంటున్నం? నా జీవన విధానమే హిందూ మతానికి నేను చేయగలిగిన వ్యాఖ్యానం అని గాంధీ అన్నడు. మనం ఏ జీవన విధానం అనుసరిస్తున్నం? గాంధీ ద్వేషాన్ని ద్వేషిస్తే, మనం గాంధీనే ద్వేషిస్తున్నం. మనకు మనమే ఆలోచించుకోవాలి.
ఇప్పుడు కనిపిస్తున్న రాజకీయం ద్వంద్వ ప్రమాణ సమాసం. ఆకట్టుకునే మాటకు, ఆచరించని బాటకు మధ్య కుదిర్చే విరుద్ధ సంధి. ఉలికిపడే మనిషికి, ఉద్వేగంలో ఉన్న మనసుకు చేసే పొసగని పెళ్లి. అందమైన అబద్ధానికి, క్రూరమైన సిద్ధాంతానికి కలిపిన పొత్తు. ఎన్నికలు జరిగే కర్ణాటకలో మసీదుల్లో మైకులు తీసేయాలనే ఉద్యమం నడిపేదీ వారే. కల్లోల కశ్మీరంలో అదే మైకులోంచి ఆజాన్ వస్తుంటే ప్రసంగం ఆపి గౌరవించినట్టు ప్రచార కథనాలు వండేదీ వారే. మేమేదైనా మాట్లాడగలం. మాట్లాడిన తర్వాత దానికో సిద్ధాంతాన్ని సిద్ధం చేయగలమనే గడుసుదనమే దీనికి కారణం. రాష్ర్టాలపై కేంద్రం ఆంక్షలు పెడుతుంది. అదే ఆంక్షను తాను గౌరవించదు.. ఎఫ్ఆర్బీఎం సాక్ష్యం! రాష్ర్టాలు అప్పులు చేయవద్దంటుంది కేంద్రం. తాను భారీగా చేస్తుంది. ‘అప్పు’డెప్పుడో యూపీఏ చేసిన బాకీలకు బదులు కడుతున్నామనేది పిల్లికి ఎలుక చెప్పే సాక్ష్యం! ఇవి మాత్రమే కావు; గవర్నర్ వ్యవస్థ గురించి, రూపాయి అవస్థ గురించి, వంటగ్యాస్ మంట గురించి, వంట దినుసుల ధరల గురించి, సమాఖ్య తత్వం గురించి, పన్నుల పంపకం గురించి, రాష్ర్టాల హక్కుల గురించి, దర్యాప్తు సంస్థల దుర్వినియోగం గురించి, 8 ఏండ్ల కిందట ఏమన్నారు? ఇప్పుడేమంటున్నరు? ఇప్పుడు సెల్ఫోనే ఈవీఎం. హిప్నాటిజమే మ్యానిఫెస్టో. పథకాలు సాధించిన ఫలితాలు కాదు; ఇప్పుడు స్లోగన్లు, సోషల్ మీడియాలే ఎన్నికల ప్రణాళికలు. మనకు మనమే ఆలోచించుకోవాలి.
ఇప్పుడు వైఫల్యానికి రంగులద్ది విజయంగా భ్రమింప జేయడమే ప్రభుత్వం. విభేదాలను వింగడించి మది కెక్కించడమే విజయ వ్యూహం. అంత్యప్రాసల హోరులో ప్రాసంగికతను మరిపింపజేయడమే ఎత్తుగడ. పథకాల పేరుతో ఫలితాలను మాయజేయడమే పరిపాలన. ఏ పార్టీకి, వర్గానికి, మతానికి చెందని కీర్తి శేషులైన జాతి గౌరవ ప్రతీకలు కూడా ఇప్పుడు రాజకీయ వస్తువులే. అది మహాత్ముడు కావచ్చు, నేతాజీ కావచ్చు, సర్దార్ కావచ్చు, బాబా సాహెబ్ కావచ్చు, జెండా కావచ్చు, చిరుతలు కావచ్చు, గోమాత కావచ్చు. శంకరాచార్యుడు కావచ్చు, రామానుజుడు కావచ్చు, చివరాఖరికి రాముడైనా కావచ్చు.. సుదర్శన చక్రం ధరించే దేవుడైనా కావచ్చు .. ఈ రాజకీయ చక్ర వ్యూహం నుంచి తప్పించుకోలేడు. హిమాలయ గుహలో తపస్సయినా, కేదార్లో ఆది శంకరుడి సమాధి సందర్శనమైనా, కాశీ ఘాట్లో గంగా తర్పణమైనా, విశ్వనాథుని గుడిలో అభిషేకమైనా, ఎక్కడైనా ఒకే ఒక్కడు ఎందుకుంటాడు? ఆ ఒక్కడినే చూపేలా అనేక కెమెరాలు ఎందుకు ఫోకస్ అవుతాయన్నది చొప్పదంటు ప్రశ్న. 250 కోట్లతో కట్టిన ఘాట్ 250 వేల సార్లు ప్రసారమవడం, 2000 కోట్లతో, వందల ఏండ్లలోనే ఎన్నడూ లేనట్టు కట్టిన యాదాద్రి గుడిని ప్రచారం కోసం వాడుకోకపోవడం..ఈ రెంటిలో ఏది నిజమైన భక్తి? మనకు మనమే ఆలోచించుకోవాలి.
ఎనిమిదేండ్లలో చేసిన అభివృద్ధి మీద నమ్మకం ఉంటే దాన్నే చూపి ఓట్లు అడగొచ్చు. అది లేనప్పుడే భయపెట్టి గెలవాలనేమనే ఆలోచన వస్తుంది. దర్యాప్తు సంస్థల విచ్చలవిడి వాడకమే, పరిపాలన వైఫల్యానికి ప్రత్యక్ష సూచిక. ఎమర్జెన్సీ టైంలో జరిగింది అదే. అప్పుడొక ఇద్దరు. ఇప్పుడొక ఇద్దరు. కనీసం అప్పుడు అత్యయిక స్థితి అని దానికో రాజ్యాంగబద్ధ పేరుపెట్టే ప్రయత్నం జరిగింది. ఇప్పుడదీ లేదు. పరిస్థితి బాగాలేదని ఆరెస్సెసే ఒకటికి రెండు సార్లు బహిరంగంగా ఆక్రోశిస్తున్నదంటే లోగుట్టు అర్థం కావడం లేదూ! అనువుగాని సమయంలో ఆరాటం ఎందుకని మూగనోము పట్టిన బీజేపీ కురువృద్ధులకు మాట్లాడే అవకాశం ఇస్తే ఇంకెన్ని లీలలు తెలుస్తాయో! ఇదేమీ వాజ్పేయి, అద్వానీల సత్తెకాలం కాదని తెలుసుకోవాలి. ఒక అబద్ధాన్ని క్షణాల్లో కోట్ల సార్లు పునరుత్పత్తి చేసే టెక్నాలజీ యుగమిది. మనకు మనమే ఆలోచించుకోవాలి.
ఏమో… రేపటి కాలానికి దేశంలో రాష్ర్టాలైనా ఉంటయో, ఏకాండ భారతదేశమంటరో! ప్రాంతీయ పార్టీలుంటయో, రెండు జాతీయ పార్టీల విధానమే వస్తదో! తక్కువ సీట్లున్న పార్టీలు ఎక్కువ కాలం అక్కర్లేదంటరో! కాలాన్ని శాసించే దేవుళ్లే చిక్కుల్లో చిక్కుకుని, అద్దాల తెరపై ఆడించినట్టు ఆడుతున్న రోజులివి. మానవమాత్రులం మన మేం ఊహించగలం! అందుకే మన జాగ్రత్తలో మనం ఉండడం మంచిది. అందుకే మనకూ ఓ జాతీయ పార్టీ ఉంటే మంచిది. పర్యవసానం ఎలా ఉన్నా యుద్ధం చేయాల్సిందే అని చెప్పలేదా భగవద్గీత! కత్తి ఎత్తడానికే భయపడితే విజయం గురించిన విమర్శ ఎట్ల్ల? తొలి అడుగుకే వెనుకాడితే గమ్యం కనిపించేదెట్ల? తెలంగాణ వస్తదని అనుకున్నమా? రాలేదా! 24 గంటల విద్యుత్తును ఊహించినమా? వెలగలేదా! వ్యవసాయం బాగుపడుతదని కలగన్నమా? నిజం కాలేదా! మన భూముల ధరలు పెరుగుతయని భ్రమించినమా? భరించలేనంత పెరగలేదా! మనకు మనమే ఆలోచించుకోవాలి.
కాకతీయ కాళేశ్వరమైంది. బీడు పొలమైంది. గోదావరి భగీరథ అయింది. దాహం నల్లాలో నీైళ్లెంది. హరితహారం నుంచి ఊర్లో నర్సరీగా మొలిచింది. రైతుకు వ్యవ‘సాయం’ దిగుబడుల ఫలసాయమైంది. తన ప్రజలపై ఉన్న అపారమైన ప్రేమ ఆసరా పింఛనైంది. సంస్కరణ సరిపోయింది. తెలంగాణలో ఆలోచన అమలైంది. ప్రణాళిక ఫలించింది. ఫలితం ప్రదర్శితమైంది.
తెలంగాణ తల్లి బంగారు చీర కట్టుకుంటుందని, పచ్చల పేరు వేసుకుంటుందని ఎప్పుడైన అనుకున్నమా? గట్టిగా ఒక పట్టుపడితే భరతమాతకు వేయలేమా!