‘జన్మమృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనమ్’ అన్నాడు గీతాచార్యుడు (భగవద్గీత 13-9). జననం, మరణం, వృద్ధాప్యం, రోగాలు, దుఃఖం ప్రతి మనిషికీ అనివార్యాలు. వీటిగురించి తెలుసుకొని, జాగ్రత్తపడటమే జ్ఞానమని శ్రీకృష్ణ భగవానుడి ప్రవచనం. ఇందులో వ్యాధి గురించి తెలుసుకుందాం. భవరోగం విషయంలో మరింత జాగ్రత్తపడదాం.
జీవితంలో మనిషిని ఎన్నో రోగాలు పలకరిస్తూ ఉంటాయి. ఆ రోగాల నుంచి ఉపశమనం కలిగించడానికి ఎన్నో మందులు అందుబాటులో ఉన్నాయి. ఆ ఔషధాలను సూచించడానికి వైద్యులూ ఉన్నారు. ఇవి శరీరం ఉన్నంతవరకూ కొనసాగుతూనే ఉంటాయి. ఏ రోగం ఎప్పుడొస్తుందో తెలియదు. అదొక భయం- ఎన్ని రోగాలు తొలగించుకున్నా మళ్లీ మళ్లీ వస్తూనే ఉంటాయి. ఆ వ్యాధిని జయించలేనినాడు మరణించాల్సి వస్తుంది. అయినా ఈ చక్రం ఆగుతుందా? కొన్నాళ్లకు మరో శరీరం వచ్చేస్తుంది. అంటే మరో జన్మ పొందుతాం. మళ్లీ రోగాలు, మందులు అన్నీ మామూలే! వీటికి అంతెక్కడ? పునరపి జననం- పునరపి మరణం. ఎంత కష్టపడి అయినా వీటికి అడ్డుకట్ట వేయాల్సిందే! అప్పుడుగానీ నిజమైన శాంతి, సుఖం కలగవని తెలుసుకున్నారు విజ్ఞులు. జీవించినంతకాలం.. కలిగేదంతా తొలగించుకోవాలి. భవరోగాన్ని శమింపజేసే వైద్యుడైన పరమాత్ముని ఆశ్రయించాలన్నారు మహాత్ములు.
అసలు భవమంటే ఏమిటి? పుట్టుక-పుట్టడమే ఒకపెద్ద రోగం. ఇక పుట్టిన తర్వాత వచ్చేదంతా రోగం కాక మరేమిటి? మరణం అంటే విముక్తి! అయినా అది తాత్కాలికమే! మరణంతో కష్టాలన్నీ తీరిపోతాయనుకోవడం భ్రమ. మళ్లీ జన్మ వచ్చేస్తుంది కదా! కాబట్టి, జన్మే ఒక రోగం. అక్కడినుంచే అన్ని బాధలూ మొదలవుతాయి. కాబట్టి తొలగించుకోవలసింది జనన మరణ చక్రాన్నే! మరణం తర్వాత మళ్లీ పుట్టకుండా చూసుకోవాలి. అదే శాశ్వతమైన విముక్తి.
చావుపుట్టుకల మధ్య జీవితంలో ‘నేను, నాది’ మొదలైన అనేక కల్పనలు కలుగుతుంటాయి. అహంకార, మమకారాలు జీవుడిని పట్టిపీడిస్తుంటాయి. వీటిలోనే జగత్ క్రీడాకలాపమంతా జరుగుతున్నది. ఈ గందరగోళంలో పడిపోయినవాడే జీవుడు. ఎందుకు పుడుతున్నాడో తెలియదు. ఎందుకు చనిపోతున్నాడో తెలియదు. ఈ తెలియనితనమే భవరోగం. తెలుసుకోవడం మొదలైనప్పటి నుంచీ రోగవిముక్తి ప్రారంభమవుతుంది. తెలుసుకోకపోతే పుట్టుక- చావు మధ్యలో జన్మజన్మలూ కొట్టుమిట్టాడాల్సి వస్తుంది. ఇలా ఎంతకాలం? అంటారా! ఈ రహస్యం తెలుసుకొని, పరమాత్మను ఆశ్రయించడం మొదలయ్యేంతవరకు.
మనకొక రోగం వచ్చినప్పుడు తగిన వైద్యుని కోసం ఎంతో ఆరాటపడతాం. సరైన వైద్యుడు ఎక్కడున్నాడు అని వాకబు చేసి మరీ ఎంత శ్రమ అయినా అతణ్ని సంప్రదిస్తాం. ఎంత కష్టమైనా డబ్బు సమకూర్చుకొని వచ్చిన వ్యాధిని జయించడానికి ప్రయత్నలోపం లేకుండా శ్రమిస్తాం. అలాగే భవరోగాన్ని తొలగించుకోవడానికీ అంతే ప్రయత్నించాలి. ఈ సంసార జలధి నుంచి ఆవల పడవేసే మహాత్ములు ఎక్కడున్నారో వెతికి కనుక్కోవాలి. వారిని చేరుకోవాలి. మనల్ని చేరదీయమని వేడుకోవాలి. వారితో సంభాషించాలి. జీవిత పరమార్థాన్ని తెలుసుకోవాలి. వారు చెప్పిన విషయాలను అవగాహన చేసుకోవాలి. వాటిని మనస్ఫూర్తిగా విచారించాలి. అహంకార, మమకారాలను వదిలిపెట్టాలి. ఇలా కొంతకాలమైనా సాధన చేయకుండా.. కండ్లు మూసుకొని కూర్చుంటే, కాలం గడిచిపోతుంది. మామూలు రోగం లాగానే భవరోగమూ క్రమంగా వర్ధిల్లుతూ విషమిస్తుంది. కాబట్టి ఈ వలయం నుంచి బయటపడటానికి, భవరోగం నయం చేసుకోవడానికి ఏమరుపాటు లేకుండా జాగ్రత్తగా ఉండాలి. సద్గురువు మార్గదర్శకత్వంలో మనల్ని మనం పునీతులను చేసుకోవాలి.
– డా॥ వెలుదండ సత్యనారాయణ
94411 62863