2050 నాటికి దేశ జనాభా 170 కోట్లకు చేరుకుంటుందనే అంచనాలున్నాయి. ప్రస్తుతం మన దేశం 129 కోట్లతో ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన రెండో దేశంగా ఉన్నది. 132 కోట్ల జనాభాతో చైనా మొదటి స్థానంలో ఉన్నది. 2050 నాటికి భారత్ జనాభాలో తొలిస్థానంలోకి చేరుకుంటుందని విశ్లేషకులు అంటున్నారు. ఈ విధంగా జనాభా పెరిగిపోతున్నా… దానికి అనుగుణంగా వసతులు, వనరుల కల్పనను, ఆహార భద్రతను ప్రభుత్వాలు పట్టించుకోకపోవటం విషాదం.
జనాభా పరంగా చూస్తే భారత్ మొదటి స్థానంలో ఉన్నదనీ, 128 కోట్ల జనాభాతో చైనానే రెండో స్థానంలో ఉన్నదన్న వాదన కూడా ఉన్నది. ఏదేమైనా అదనంగా పెరిగే 41 కోట్ల మందికి ఆహారం, ఇతర వసతులు కల్పించడం ఎట్లాగన్నది ఇప్పుడున్న ప్రధాన సమస్య. ఈ అంశంపై ఇప్పటినుంచే దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నది. మరో 40 కోట్ల మందికి ఆహారాన్ని అందించాలంటే దేశంలో తృణధాన్యాల ఉత్పత్తి 4.6 శాతం పెరగాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ప్రస్తుతం ఉత్పత్తి అవుతున్న తృణధాన్యాలు రెట్టింపు కావాలి. రోజురోజుకూ సాగు భూములు తగ్గిపోతున్న తరుణంలో అధిగ దిగుబడి ఒక్కటే దీనికి పరిష్కారం.
భారత్ వ్యవసాయాధారిత దేశం. గ్రామీణ ప్రాంతా ల్లో 58 శాతం జనాభా వ్యవసాయ రంగం, దాని అను బంధ రంగాలపైనే ఆధారపడి జీవిస్తున్నారు. జీడీపీలో వ్యవసాయ ఉత్పత్తులే 18 శాతం ఆక్రమిస్తున్నాయి. 2010-11 జనాభా లెక్కల ప్రకారం దేశంలో 11.89 కోట్ల మంది రైతులున్నారు. ఇది కార్మికుల్లో 24.6 శాతం. దేశవ్యాప్తంగా కార్మికులు 4.81 కోట్ల మంది ఉన్నారు. దీనికి 1.44 కోట్ల మంది వ్యవసాయ కార్మికులు అదనం. విచిత్రమేమంటే సగం జనాభాకు ఉపాధి కల్పిస్తున్న వ్యవసాయ రంగానికి పాలకులు తగిన ప్రాధాన్యం ఇవ్వటం లేదు.
2000-01 జనగణన ప్రకారం దేశంలో 5.81 కోట్ల ఎకరాల భూమి మాత్రమే సాగవుతున్నది. దేశంలో సాగు కు యోగ్యమైన భూమి 16 కోట్ల ఎకరాలున్నది. అంటే ఇంకా మూడింతలు వ్యవసాయాన్ని పెంచవచ్చన్న మాట. ఇప్పటికీ 62 శాతం భూమి భూగర్భ జలాలపైనే ఆధారపడి సాగవుతున్నది. కనుక భూగర్భ జల వనరులను పెంచుకోవాల్సిన అవసరం ఉన్నది. చిన్న రిజర్వాయర్లు, చెరువులపై ఆధారపడి ఎక్కువ భాగం సాగు చేస్తున్నారు. జల వనరులు లేక చాలా భూములు నిరుపయోగంగా ఉన్నాయి. మరోవైపు శరవేగంగా జనాభా పెరుగుతుంటే పంటలు సాగుచేసే భూ విస్తీర్ణం తగ్గుతున్నది. 1960 నుంచి ఏటా సగటు సాగు విస్తీర్ణం తగ్గిపోతున్నది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఉత్పత్తి కూడా పెరగాల్సిన అవసరం ఉన్నది. మాంసం, కోడిగుడ్లు నాలుగు రెట్లు ఉత్పత్తి చేయాల్సి ఉండగా, పాల ఉత్పత్తులు ఐదు రెట్లు పెరగాలి. మాంసం, పాల ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్లతోపాటు పలు సమస్యలు పెనవేసుకున్నాయి. ఆధునిక డెయిరీ, పాడి పశువులకు భారీస్థాయిలో తృణ ధాన్యాలు, నూనెగింజలు దాణాగా పెట్టాల్సిన పరిస్థితి ఉన్నది. మనుషులు తినటానికే లేకపోతే పశువుల దాణా సంగతి ఎవరు పట్టించుకోవాలి.
రసాయన ఎరువులను వాడటంతోపాటు సాంకేతి కతను వినియోగిస్తే పంట దిగుబడి పెంచవచ్చు. 2025 నాటికి తృణధాన్యాలు 260 మిలియన్ టన్నులు ఉత్ప త్తి చేయవచ్చు. ఒకటి, రెండు ఎకరాలున్న చిన్న కమతాల రైతులు దిగుబడి పెంచేందుకు ఆధునిక వ్యవసా యం చేయలేరు. సహకార వ్యవసాయం అన్నది మన దేశంలో లేదు. ఈ పరిస్థితుల్లో కేంద్రం సమగ్ర వ్యవసాయ విధానాన్ని రూపొందించాలి. దిగుబడిని పెంచేందుకు దారులు అన్వేషించాలి.
– దండంరాజు రాంచందర్ రావు
98495 92958