గద్దర్ అనే ఒక మహత్తర విప్లవ సాంస్కృతిక శక్తి వారసత్వం గజిబిజిగా మారుతున్నది. ఆయన తన ఆటపాటలతో అణగారిన ప్రజలతో పాటు సాధారణ సమాజంపై సైతం కొన్ని దశాబ్దాల పాటు వేసిన అనితరమైన ముద్ర వారసత్వం ఎవరిది అంటే వెంటనే జవాబు చెప్పుకోలేని పరిస్థితి మనకు ఇప్పుడు ఎదురవుతున్నది. గద్దర్ తన చివరి దశలో కొన్ని తడబాట్లు పడినా, ఆ వారసత్వం ఆయన అచంచలమైన పీడిత ప్రజల పక్షపాతాన్ని, గుండెలలో నిలుపుకొన్న సమాజానిదా? లేక, తన పేరు ప్రతిష్టలను రకరకాలుగా ఉపయోగించుకుని లాభపడజూస్తున్న శక్తులదా అనే ప్రశ్న ముందుకు వస్తున్నది.
నిరుడు ఆగస్టులో గద్దర్ మరణించినప్పటి నుంచి గత ఆరు నెలలుగా జరుగుతున్నదేమిటో చూస్తూనే ఉన్నాం. ఒకవైపు గ్రామాల్లో, పట్టణాల్లో జనసామాన్యం ఇప్పటికీ ఆయన పాటలు వింటున్నారు. వీడియోలు చూస్తున్నారు. వాటిలో లీనమవుతున్నారు. ఆయన గురించి మాట్లాడుకుంటున్నారు. వారి బాధలు, గాథలతో సంబంధం గల సాంస్కృతిక ప్రపంచంలో గద్దర్కు తప్ప మరొకరికి స్థానం లేదు. తను జీవించి ఉండగాలేదు, తన మరణం తర్వాత నేటికీ లేదు. కొద్దిమంది ఆ కాలంలో ఉండినవారు క్రమంగా చెల్లాచెదురయ్యారు, లేదా లోకం నుంచి నిష్క్రమించారు. ఇంకా ఒకరిద్దరు మిగిలి ఉన్నా వారిది గానీ, వీరిది గానీ గద్దర్ అంతటి స్థాయి కాదు. ముద్ర అంటూ, వారసత్వం అంటూ మిగల్చగల స్థాయికి చేరినది గద్దర్ మాత్రమే. జన సామాన్యపు ఇండ్ల నుంచి తన గేయాలు, ఆవేశపు వ్యాఖ్యానాలు, ప్రశ్నలు నేటికీ వినవస్తుండటమే అందుకు తిరుగులేని రుజువు. అందువల్లనే గద్దర్ అనే విప్లవ సాంస్కృతిక శక్తి గుర్తింపు తెలుగు సీమలకు పరిమితం కాక, జాతీయం, అంతర్జాతీయం అయింది.
ఒకవైపు కనిపిస్తున్న పరిస్థితి ఇది కాగా, మరొకవైపు గద్దర్ మరణించిన తొలి రోజుల నుంచే ఇందుకు భిన్నమైన, ఇంకా చెప్పాలంటే విరుద్ధమైన పరిస్థితులను మనం చూస్తున్నాం. తనకు గల అపారమైన జనాదరణను పలు విధాలుగా ఉపయోగించుకుని లాభపడజూస్తున్నవారు అనేకులు. ఆయన విప్లవకారుడు అయినందున, దళితుడు అయినందున, లేదా తమ కుటుంబ సభ్యుడు కావడం వల్ల వేర్వేరు వారు, వేర్వేరు రూపాల్లో గద్దర్ ప్రజాదరణను ఒక మారకపు సరుకుగా మార్చుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. అట్లా ఎవరేమి చేశారు, ఇప్పటికీ ఏమి చేస్తున్నారనేది అందరూ చూస్తున్నదే అయినందున, ఆశ్చర్యంతో, బాధతో ముక్కున వేలు వేసుకుంటున్నదే అయినందున, ఇక్కడ ఏకరువు పెట్టాల్సిన అవసరం లేదు. వారి ఈ ప్రయత్నాలు గత ఆరు మాసాలుగా సాగుతున్నవే అయినందున, ఇక ముందు కూడా కొనసాగగలవని చెప్పుకోవచ్చు. గద్దర్ ప్రతిష్టకు మారకపు విలువ ఇంకా ఉందని వారు భావించినంత కాలం ఆ పని చేస్తూనే ఉంటారు.
ఇందులో మరొక సూక్ష్మమైన రహస్యం ఉంది. ఒక వస్తువుకు యథాతథంగా మారకపు విలువ ఉండటం వేరు, అది ఎవరికైనా మారకపు విలువగా ఉపయోగపడటం వేరు. ఈ సూత్రాన్ని అర్థమయ్యేట్టు చెప్పాలంటే, గద్దర్కు ప్రజాదరణ ఉండటం వాస్తవం. అది తన ఆశయాల కోసం అయితే మారకం కావటం సహజం, వాంఛనీయం. అందుకు భిన్నంగా ఆ ప్రజాదరణ విలువ ఓట్లు అనుకుందాం. ఏవైనా పార్టీలు గానీ, లేదా ఆయన సన్నిహితులు గానీ ఆ ప్రజాదరణను తాము గౌరవిస్తున్నామని చెప్పుకొంటూ, ప్రజలంతా తమకు ఓట్లు వేయాలని కోరితే అది జరగకపోవచ్చు. వారితో ఆ ప్రజలు, ‘గద్దర్ అంటే మాకు ప్రేమ ఉన్నమాట నిజం. మీకు కూడా ప్రేమ ఉన్నదని మీరు చెప్తే సంతోషిస్తాం. కానీ, ఆయనపై మాకున్న ప్రేమతో మీకు ఓట్లు వేయాలంటే ఒప్పుకోము’ అని అనవచ్చు. అప్పుడు ప్రజాదరణకు ఓట్ల రూపంలో మారకపు విలువ లభించదు.
ఈ పరిస్థితి ఎందువల్ల? ఇందుకు చాలా కారణాలు ఉన్నాయి. గద్దర్ పట్ల ప్రజల ప్రేమకు ఒక సందర్భం ఉంది. అది విప్లవోద్యమాల సందర్భం. విప్లవ సాంస్కృతిక సందర్భం. ప్రజల ప్రేమకు ఆ పరిధిలో మాత్రమే సందర్భం, సంబంధం ఉంటాయి. గద్దర్ ఆశయాల కోసం మారకపు విలువ ఉంటుంది. ఆ పరిధిని దాటితే ప్రజల ప్రేమకు ఎన్నికల మారకపు విలువ ఉండదు. తమ ప్రేమకు ఆ పద్ధతిలో విలువ కట్టడం ప్రజలకు మనస్కరించదు. ఇది ఇప్పటికే రుజువైంది కూడా.
తను జీవించి ఉన్నప్పుడు పెట్టిన తెలంగాణ ప్రజా ఫ్రంట్ పార్టీ ఎన్నికల్లో పోటీ అయితే చేయలేదు గానీ, అసలు ఆ పార్టీ ఏర్పాటు పట్లనే ప్రజల్లో సానుకూల అభిప్రాయం ఏర్పడలేదు. ఇక ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఆయన కుమార్తె పరిస్థితి ఏమైందో చూశాం. కనుక, గద్దర్ పట్ల ప్రజల అవగాహన, దృక్కోణం ఏమిటో వారాయనను ఏ పరిధికి లోబడి చూస్తారో అర్థం చేసుకోవచ్చు. ఆ పరిధిని దాటితే తనను మారకపు వస్తువుగా చూసేందుకు, మార్చేందుకు వారు ఇష్టపడరు. గద్దర్ విషయంలోనే కాదు, అటువంటి ఒక ప్రత్యేకమైన గుర్తింపు గల ఏ వ్యక్తి విషయంలోనైనా ఆ పరిధిని దాటితే ఇదే జరుగుతుంది. ఉదాహరణకు గాంధీజీ, అంబేద్కర్ వంటి వారు స్టాక్ ఎక్స్చేంజ్ వ్యాపారులుగా మారితే వారి షేర్లను ప్రజలు విరగబడి కొంటారనే హామీ ఏదైనా ఉంటుందా?
దీనికి సంబంధించే అర్థం చేసుకోవాల్సిన విషయం మరొకటి ఉంది. గద్దర్ ఆలోచనా ధోరణితో గతంలో ఎన్నడూ సంబంధం లేనివారు, లేదా ఆ ధోరణిని తీవ్రంగా వ్యతిరేకించినవారు, విప్లవోద్యమాలను, దళితులను అణచివేసిన, హతమార్చినవారు ఇప్పుడు అకస్మాత్తుగా ఆయన ఆశయాల కోసం తాము పాటు పడగలమని చెప్తే ప్రజలు నమ్మగలరా? తమను తాము మారకపు వస్తువుగా మార్చుకునేందుకు సిద్ధపడతారా? గద్దర్ను వ్యక్తిగా గౌరవించినట్టు, లేదా తన ఆలోచనలను మన్నిస్తున్నట్టు ఏవైనా కొన్ని చర్యలు తీసుకున్నట్టయితే అంత మేరకు ప్రజలు తప్పక హర్షిస్తారు. కానీ, అందువల్ల వారి దృష్టి మౌలికంగా ఏమీ మారదు. మారటం లేదు కూడా అని ఈ ఆరు నెలల కాలంలో నేలకు చెవి ఒగ్గి విన్నవారికి అర్థమవుతున్న విషయమే.
ఈ విధమైన పరిస్థితులన్నింటినీ గమనించినప్పుడు, గద్దర్ వారసత్వం ఎవరిది అవుతుందో ఎవరికి వారు గ్రహించవచ్చు. అది ఆయన అనేక దశాబ్దాల పాటు తనను తాను కరిగించుకొని అంకితమై పాటుబడిన పీడిత సమాజానిది మాత్రమే. విద్య వలెనే అది తడవనిది, కాలనిది, క్షీణించనిది. గద్దర్ తన జీవితకాలంలోనే చివరి దశలో కొన్ని తడబాట్లకు గురైన మాట నిజం. అయితే ఆయన విప్లవ సాంస్కృతిక మార్గావరోహణలో ఏ విధంగానైతే తన సమాకాలీన సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితుల నుంచి రూపుదిద్దుకొని ‘చైల్డ్ ఆఫ్ హిజ్ టైమ్స్’ అయ్యారో, ఆ తడబాట్ల కాలంలో కూడా అదే పరిస్థితుల నుంచి ‘చైల్డ్ ఆఫ్ హిజ్ టైమ్స్’ అయ్యారు. ఈ రెండు దశల్లో విప్లవ రాజకీయాల పరిస్థితులు కూడా మొదట ఉత్తేజకరంగా, చివరి దశలో నిరుత్సాహకరంగా మారటం తెలిసిందే. ఆ ప్రభావాలు ఆయనపై సహజంగానే ఉన్నందున తనను నిందించలేం. అంతిమ విశ్లేషణలో గద్దర్ వారసత్వం ఆయన ప్రేమించిన, తనను ప్రేమించిన పీడిత సమాజానిది మాత్రమే తప్ప, ఆయనను మార్పిడి విలువగా చూసేవారిది కాబోదు.
ఇదే సందర్భంలో చెప్పుకోవాల్సిన విషయం ఒకటున్నది. అధికారం కోసం గద్దర్కు వలెనే ఇంద్రవెల్లిని కూడా మారకపు విలువగా ఉపయోగించుకునే ప్రయత్నాలను మనం చూస్తున్నాం. అధికారాన్ని, సంపదలను కోరుకునేవారు, వాటిని తమచేత చిక్కించుకొని ప్రజలను పీడించేవారు ఎక్కడైనా, ఎప్పుడైనా అనుసరించే పద్ధతులే ఇవి. పీడించేది వారే, పీడితుల ఉద్యమాలను, గద్దర్ వంటి పీడితుల స్వరాలను అణచివేసేది వారే. తిరిగి అవసరాన్ని బట్టి పీడితులను మభ్యపెడుతూ గద్దర్ వంటివారి వారసత్వాన్ని, ఇంద్రవెల్లి వంటి స్మృతులను మారకపు విలువగా వాడుకొనజూసేదీ వారే. అయితే సమాజంలో గానీ, చరిత్రలో గానీ ఇటువంటి స్మృతులు, వారసత్వాలు నేల కింది పొరల్లోకి చేరి శాశ్వతంగా నిక్షిప్తమై ఉంటాయి. నేలకు పైపైన ఎవరైనా తమ విన్యాసాల ద్వారా ఆ వారసత్వాలను అధికార ప్రయోజనాల కోసం ఉపయోగించుకొనజూస్తే, అవి తాత్కాలిక విన్యాసాలుగా మాత్రమే మిగులుతాయి.
– టంకశాల అశోక్