జనగామ జిల్లాలోని మారుమూల పల్లెటూరు అప్పిరెడ్డిపల్లిలో పుట్టిపెరిగిన నాకు కులవృత్తి చిందు యక్షగానమే సర్వస్వం. ‘సమ్మయ్య నువ్వు పద్మశ్రీ అవార్డుకు ఎంపికయ్యావు’ అని చెప్తే మొదట నమ్మలే. అయోధ్య రామాలయంలో బాల రాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా యక్షగానంలో రామాయణాన్ని ప్రదర్శించాం. ఆ శ్రీరాముడే మెచ్చి ఇచ్చిన కానుకే ఈ పద్మశ్రీ పురస్కారం.
– గడ్డం సమ్మయ్య (యక్షగానం)
మా తాతల కాలం నుంచి అందరం బుర్రకళనే నమ్ముకున్నాం. బలగం సినిమాలోని ‘అయ్యో శివుడా! వెనుకట దానికి సరిపోయే..’ పాటతో గుర్తింపు వచ్చింది. ప్రాచీన కళను నేర్చుకునేందుకు నేటితరం ఆసక్తి చూపడం లేదు. పద్మశ్రీ అవార్డు రావడం సంతోషంగా ఉంది. ఇలాంటి అవార్డులతో అంతరించిపోతున్న కళకు పూర్వ వైభవం వచ్చినట్టయింది.
– దాసరి కొండప్ప (బుర్రకళ)
పద్మశ్రీకి ఎంపికవడం నా జీవితంలో అపూర్వ ఘట్టం. మారుమూల పల్లెలో నేను చేస్తున్న సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఈ అవార్డుతో నా బాధ్యత మరింత పెరిగింది. నేటి యువత సాహిత్యంపై అభిరుచి పెంచుకొని, సమాజాన్ని చైతన్యపరిచే రచనలు చేయాలి. నా జన్మభూమికి అవార్డును అంకితమిస్తున్నా. ప్రధాని మోదీకి కృతజ్ఞతలు.
– కూరెళ్ల విఠలాచార్య (సాహిత్యం)
లంబాడీ సాహిత్యంలో నా సేవలను గుర్తించిన కేంద్రానికి కృతజ్ఞతలు. తండా నుంచి మొదలైన సాహిత్య ప్రయాణం ఢిల్లీ వరకు చేరడం, లంబాడీ తండాల మట్టి పరిమళాలకు దక్కిన అతిపెద్ద విజయం. లంబాడీ భాషలో రచించిన భగవద్గీతను ప్రచురించేందుకు చాలా కష్టపడ్డా. పద్మశ్రీ అవార్డుతో లంబాడీల సాహిత్యం కొత్త మలుపు తిరిగింది.
– కేతావత్ సోమ్లాల్ (లంబాడీ సాహిత్యం)
నా బాల్యమంతా ఆకలి మంటల మధ్యనే గడిచింది. గంజి తిని పెరిగాను. నాకొచ్చిన ప్రతీ అవకాశాన్ని దేవుడిచ్చిన కార్యంగా భావించాను. శిల్పకళలో ఎప్పుడూ వినూత్నంగా ఆలోచించేవాణ్ని. పద్మశ్రీ వరించడం చాలా సంతోషంగా ఉంది. ప్రతీ పనిని సవాల్గా స్వీకరించి, అద్భుత ఫలితాలు రావాలనే ఆకాంక్షతో పనిచేయడమే నాకు గుర్తింపును తీసుకొచ్చింది.
– ఆనందాచారి వేలు (శిల్పకళ)