పూర్వం ఒక సాధువు కాలినడకన దేశసంచారం చేయసాగాడు. ఒంటరిగా వెళ్తూ దారిలో తారసపడిన గ్రామాల్లో ఒకట్రెండు రోజులు ఉండేవాడు. గ్రామస్తుల ఆతిథ్యం స్వీకరించి, వారికి నాలుగు మంచిమాటలు చెబుతుండేవాడు. అలా ఒక గ్రామం నుంచి మరొక ఊరికి వెళ్తున్న సాధువుకు ఒకచోట రెండు దారులు ఎదురయ్యాయి. ఏ దారిన వెళ్తే తాను అనుకున్న గ్రామానికి చేరవచ్చో ఆయనకు తెలియలేదు. ఎవరినైనా అడిగి తెలుసుకుందాం అనుకున్నా.. ఆ ప్రాంతంలో జన సంచారమే లేదు. చాలాసేపు అక్కడే ఉండిపోయాడు. ఇంతలో దూరంగా చెరువు దగ్గర ఓ వ్యక్తి కనిపించాడు. సాధువు బిగ్గరగా ‘నాయనా! ఫలానా గ్రామానికి ఏ దారిన వెళ్లాలి?’ అని అడిగాడు. చెరువు దగ్గర ఉన్న వ్యక్తి ఆ మాటలు వినిపించనట్టుగా ఏదో ధ్యాసలో ఉన్నాడు. మరో రెండుసార్లు బిగ్గరగా పిలిచినా ఫలితం లేకపోయింది. ఇక లాభం లేదనుకొని సాధువు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్లి భుజం తట్టాడు. కాషాయ దుస్తుల్లో ఉన్న సాధువును చూసి ఆ వ్యక్తి నమస్కరించాడు.
‘నాయనా! అప్పటి నుంచి మూడుసార్లు పిలిచానే, సమాధానం చెప్పకపోతివి. నా మాటలు వినపడలేదా’ అని అడిగాడు సాధువు. ‘స్వామీ! మీరు పిలిచారా, నాకు వినపడలేదు’ అన్నాడు. ‘అంత బిగ్గర పిలిచినా వినపడలేదా?’ అని మళ్లీ ప్రశ్నించాడు సాధువు. దానికి ఆ వ్యక్తి ‘స్వామీ! నాకు వినికిడి లోపం లేదు. చెరువులో గాలం వేసి గట్టున కూర్చున్నాను. చేప ఎప్పుడు చిక్కుతుందా అని గాలం వంకే చూస్తూ ఉన్నాను. మీ మాటలు నా చెవినపడలేదు. మన్నించండి..’ అని బదులిచ్చాడు. ఆ జాలరి మాటలకు సాధువు అచ్చెరువొందాడు. ‘నిజమైన ఏకాగ్రత అంటే ఇది కదా!’ అనుకున్నాడు సాధువు. తర్వాత జాలరి సాయంతో తను వెళ్లవలసిన ఊరికి దారితీశాడు. మహాభారతంలో అర్జునుడు విద్యాభ్యాసంలో చూపించిన ఏకాగ్రత అనన్య సామాన్యమైనది. ఆ అర్జునుడే కురుక్షేత్ర సంగ్రామ సమయంలో శ్రీకృష్ణ భగవానుడు ఉపదేశించిన భగవద్గీతను ఏకాగ్రచిత్తంతో విని, కర్తవ్యాన్ని నిష్ఠగా నిర్వర్తించి విజయుడిగా నిలిచాడు.
చాలామంది కర్తవ్య నిర్వహణలో చక్కటి ఏకాగ్రత కనబరుస్తారు. అదే ఆధ్యాత్మిక సాధనకు వచ్చేసరికి మనుసు చంచలం అవుతున్నది, దృష్టి నిలబడటం లేదు అని సాకులు వెతుక్కుంటారు. విధి నిర్వహణలో చూపించే ఏకాగ్రత, దైవాన్ని దర్శించడంలోనూ చూపగలిగితే మోక్షసాధన అసాధ్యం కాదు.
– టి.వి.ఫణీంద్రకుమార్