దళితుల జీవితం గడిచేందుకు అవసరమైంది ‘ఏదో ఒకటి’ ఇవ్వటమా, లేక తమ కాళ్లపై తాము నిలబడేట్లు చేయటమా అనే చర్చ దశాబ్దాలుగా ఉంది. భూ సంస్కరణలు విఫలమై, నిత్య జీవితాలు గడిచేందుకు తెచ్చిన పథకాలూ నిరుపయోగమైనాక, వారికి స్వావలంబన ప్రధానమనే వాదన మళ్లీ ముందుకువచ్చింది. ఈ సుదీర్ఘ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ‘దళిత బంధు’ను ప్రకటించగా, కొందరు కంప్యూటర్లు ముఖ్యం అంటున్నారు.
లాటిన్ అమెరికా నుంచి మొదలుకొని అనేక దేశాలలో ప్రత్యక్ష నగదు బదిలీ పథకాలను ఐక్యరాజ్యసమితి, దాని అనుబంధ సంస్థలు బలపరచాయి. భారత ప్రభుత్వం సైతం ప్రయోగాత్మకంగా ఆడపిల్లల కోసం కొంతచేసింది. ‘దళితబంధు’ అంత భారీ ఎత్తున, విస్తృతంగా, సమగ్ర దార్శనికతతో మాత్రం ఎక్కడా ఏదీ జరగలేదు.
చర్చలోకి వెళ్లేముందు రెండువైపుల గల వాదనల ను చూద్దాం. పేదలు ఇతరత్రా కూడా ఉన్నా దళితులు తరతరాలుగా భయంకరమైన సామాజిక వివక్షకు సైతం గురవుతున్నారు. ‘దళితబంధు’ పథకం కింద తగు అర్హత గల కుటుంబాలకు పది లక్షల రూపాయల చొప్పున నగదు రూపంలో అందజేసినట్లయితే, వారు తమకు ఆసక్తి, అనుభవం గల వ్యాపారాలు పెట్టుకొని ఆర్థిక స్వావలంబన సాధించవచ్చునని, సామాజిక గౌరవం కూడా పొందవచ్చునని ప్రభుత్వం చెప్తున్నది. అది సాధించటానికి అవసరమైన విధంగా పరిపాలనాపరమైన, సాంకేతికపరమైన చేయూతను ఇచ్చేందుకు ఏర్పా ట్లుచేస్తున్నది. దళితుల పట్ల మొదటినుంచి ఆవేదన గల కేసీఆర్ గత ఏడేండ్ల పథకాలకు తోడుగా ఈ ఆగస్టు 15న మరిన్ని చర్యలు ప్రకటించారు. స్వావలంబన సాధించిన కుటుంబాలు ఇక ఇతరులపై ఆధారపడవలసిన పని ఉండదని, తమ పిల్లల అవసరాలు, చదువుల వంటివి తీర్చుకోగలవని, సగర్వంగా జీవించగలవని ప్రభుత్వం చెప్తున్నది. గ్రామాలలో, పట్టణాలలో, దళితులతో, వారి ప్రతినిధులతో, నిపుణులతో సంప్రదింపులు జరిపిన మీదట, వారి సూచనల మేరకే, దళితులు చేసుకునేందుకు వీలయే రకరకాల చిన్న వృత్తి వ్యాపారాల జాబితాను ప్రకటించింది. అవిగాక ఇంకా ఏవైనా తమకు అనువుగా ఉంటాయని భావిస్తే అది కూడా చేసుకోవచ్చునన్నది.
ఇందులోని సహేతుకత ఎటువంటిదో, ఆ విధంగా కలిగే నికరమైన ప్రయోజనాలు ఏమిటో చెప్పేందుకు ఆర్థిక నిపుణులే అక్కరలేదు. కనీస పరిజ్ఞానం, జీవితానుభవం గలవారు కూడా ఆ విషయం గ్రహించగలరు. కొంత పెట్టుబడితో, అది కూడా అప్పు రూపంలో కాకుండా, వడ్డీల బాధ లేకుండా లభించే సొమ్ముతో, చిన్నచిన్న వ్యాపారాలు పెట్టుకొని ఆర్థికంగా స్థిరపడుతున్నవారు మనచుట్టూ ఎంద రో ఉన్నారు. విస్తరిస్తున్న సమాజంలో, ఆర్థిక కార్యకలాపాలలో, అభివృద్ధి చెందుతున్న పట్టణాలూ గ్రామాలలో అందుకు తగినట్లు అవకాశాలు కూడా పెరుగుతున్నాయి. ఇదంతా ఇంగిత జ్ఞానపు విషయం. మహబూబ్నగర్ జిల్లా మార్లబీడు గ్రామానికి చెందిన పలువురు దళితులు 2016 అక్టోబర్లోనే ఈ రచయితతో మాట్లాడుతూ, మూడెకరాల పథకం కింద పంపిణీకి భూమి లభ్యత లేద ని, ఏదైనా ‘బతుకుదెరువు కోసమే’ గనుక ప్రభుత్వం తమ కు ఆర్థిక సహాయం చేసినట్లయితే చిన్నచిన్న వ్యాపారాలు చేసుకోగలమన్నది స్వయంగా అన్నమాట. ఇది నేను అప్పుడే రిపోర్టింగ్ చేశాను. దళిత బంధుతో స్వావలంబన సాధ్యం గనుక అప్పుడు ఆ కుటుంబాలే తమ పిల్లలకు కంప్యూటర్లు కొనివ్వగలవు. మరెన్నో చేయగలవు.
ఇందుకు భిన్నంగా ‘కంప్యూటర్వాదులు’ చెప్తున్నదేమిటి? దళితబంధు మానివేసి ఆ బడ్జెట్తో స్కూళ్లు పెట్టాలి, కంప్యూటర్లు కొనివ్వాలి, ఆ పిల్లలకు ఉన్నత విద్య చెప్పించాలి, విదేశాలకు పంపాలని. ఒకవేళ వారు దళితబంధు ఇస్తూ నే ఈ పనికూడా చేయాలని ఉంటే అందులో ఒక తర్కం ఉండేది. కావలసింది దళిత కుటుంబాలకు ఆర్థిక స్వావలంబన, వారి పిల్లలకు చదువులు కూడా. కాని వారు రెండింటికి మధ్య పోటీ పెట్టి స్వావలంబనను వ్యతిరేకిస్తూ చదువులు మాత్రమే కావాలంటున్నారు. యథాతథంగా ప్రభుత్వం దళితులతో పాటు ఇతర బలహీనవర్గాల కోసం వారి పిల్లల చదువుల కోసం బాగానే ఖర్చు చేస్తున్నది. మంచి జీతాలు తీసుకుంటున్న ఈ వర్గాల ఉపాధ్యాయులు, ఇతర టీచర్లు తగిన శ్రద్ధతో పాఠాలు చెప్తుండినట్లయితే ఈ వర్గాల పిల్లలు ఎంతో నేర్చుకోగలరు. దానినట్లుంచి ఒకవేళ దళిత బంధు బడ్జెట్ అంతటినీ ఇటు మళ్లిస్తే జరిగేదేమిటి? కుటుంబాలు స్వావలంబన లేక అక్కడే మిగిలిపోతాయి. పిల్లలు చదువుతారు గాని ఉద్యోగాలకు హామీ ఉండదు. అనేకులు నిరుద్యోగులుగా మిగులుతున్నారు. అదిగాక ఈ కాలపు చదువుతున్న పిల్లలు తమ కుటుంబాలను పట్టించుకుంటారనే నమ్మకం ఉండటం లేదు. వారు పట్టణాలు, విదేశాలలో స్థిరపడగా ఇక్కడ పల్లెలలో తిండీ బట్ట కోసం కూలీ పని చేసుకొని అల్లల్లాడుతున్న కుటుంబాలు కుప్పతెప్పలు.
ప్రభుత్వం ఇందుకోసం ఖర్చు చేయాలా? ఎంతమాత్రం కాదు. పైన అనుకున్నట్లు స్వావలంబన, చదువులు రెండూ తప్పనిసరి అవసరాలే. మరేవో ఉద్దేశాలు మనసులో పెట్టుకొని కాకుండా సావధానంగా ఆలోచిస్తే, ప్రభుత్వం రెండూ చేస్తున్నట్లు అర్థమవుతుంది. అయితే, దేశంలోనే గాక విదేశాలలోనూ ఇన్నేళ్ల అనుభవాలను గమనిస్తే వెనుకబడిన వర్గాలకు ఆర్థిక స్వావలంబనను కల్పించటం వల్ల కలిగే ఫలితాలు ఇంకా నికరంగా, దీర్ఘకాలికంగా ఉంటాయని రుజువైంది.
అందుకే లాటిన్ అమెరికా నుంచి మొదలుకొని అనేక దేశాలలో ప్రత్యక్ష నగదు బదిలీ పథకాలను ఐక్యరాజ్యసమితి, దాని అనుబంధ సంస్థలు బలపరచాయి. భారత ప్రభు త్వం సైతం ప్రయోగాత్మకంగా ఆడపిల్లల కోసం కొంతచేసింది. ‘దళితబంధు’ అంత భారీ ఎత్తున, విస్తృతంగా, సమగ్ర దార్శనికతతో మాత్రం ఎక్కడా ఏదీ జరగలేదు. ఆ పేరు ముఖ్యమంత్రి కేసీఆర్కు లభించరాదన్నది ఒక్కటే కంప్యూటర్ వాదుల తపన అయినట్లు కనిపిస్తున్నది.
టంకశాల అశోక్