ఋషుల ప్రార్థనను మన్నించి వేటకు వచ్చిన దుష్యంతుడు కణ్వుని ఆశ్రమానికి రావడం, శకుంతల తన స్నేహితురాళ్లు అనసూయ, ప్రియంవదలతో కలిసి పూలచెట్లకు నీళ్లు పోయడం, దుష్యంతుడు చెట్టుచాటున ఉండి చూడటం.. వారి మాటలు వినడం, అంగుళీయక వృత్తాంతం.. మొదలైన వాటిని పినవీరన కాళిదాసు నాటకం నుంచి తీసుకున్నాడు. నాటకంలో వలెనే కావ్యంలో విదూషక పాత్రను ప్రవేశపెట్టాడు.
ఆ తర్వాత కుమారుడికి జన్మనిచ్చిన శకుంతల, అతడిని తీసుకొని దుష్యంతుని సభకు వెళ్లడం, ఆకాశవాణి మాటలు.. మొదలైన వాటిని పినవీరన మహాభారత కథను అనుసరించి రచించాడు. ఈ విధంగా నాటకాన్ని తీసుకొని కావ్యంగా రాయడంతో కావ్యంలో సన్నివేశాల కల్పనలు వచ్చి చేరాయి. కథనంలో నాటకీయత ప్రవేశించింది. దీంతో తర్వాత వచ్చిన ప్రబంధ కవులు పెద్దన, తిమ్మన, రామరాజ భూషణుడు మొదలైన వాళ్లు తమ ప్రబంధాలలో నాటకీయతను ఒక ప్రబంధ లక్షణంగా ప్రవేశపెట్టారు. వేట, నగర, స్త్రీ సౌందర్యాది ప్రబంధ వర్ణనలను పినవీరన రసవంతంగా చేశాడు. సన్నివేశాలను, సంభాషణలను చక్కగా కూర్చాడు. ఇవన్నీ కూడా తర్వాత వచ్చిన ప్రబంధ కవులకు నాటకీయతను సాధించటంలో తోడ్పడ్డాయి.
పినవీరన చివరి రచన ‘జైమినీ భారతం’. సంస్కృతంలో వ్యాసుడు భారతాన్ని రచించి తన నలుగురు శిష్యులకు చెప్పి ప్రచారం చేయమన్నాడు. వాటిలో వైశంపాయనుడు అనే శిష్యుడు ప్రచారం చేసిన భారతమే ఎక్కువ ప్రసిద్ధి కెక్కింది, మిగిలి ఉంది.
జైమినీ అనే శిష్యుడు ప్రచారం చేసిన మహాభారతంలో ఒక్క అశ్వమేధ పర్వమే దొరుకుతున్నది. దానినే ‘జైమినీ భారతం’ అంటారు. మిగిలిన ఇద్దరు శిష్యులు చెప్పిన భారతాలు దొరకడం లేదు. పినవీరన అనువదించిన ‘జైమినీ భారతం’లో ఎనిమిది ఆశ్వాసాలు ఉన్నాయి. దీనిలో భీమార్జునులు యజ్ఞం చేసి వదిలిపెట్టిన అశ్వాన్ని రక్షిస్తూ దిగ్విజయ యాత్ర చేయడం వంటి వృత్తాంతాలు ఉన్నాయి. శ్రీకృష్ణుని మహిమ గొప్పగా చెప్పబడింది. ప్రధాన కథతో పాటు ఈ జైమినీ భారతంలో ‘కుశలవోపాఖ్యానం’, ‘చంద్రహాస కథ’, ‘ప్రమీలార్జునీయం’, ‘బబ్రువాహన వృత్తాంతం’ మొదలైన రమ్యమైన కథలు ఉన్నాయి. పినవీరన శైలి ప్రౌఢంగా ఉంది. ఈ కావ్యాన్ని పినవీరన విజయనగర రాజైన సాళువ నరసింహరాయలకు (క్రీ.శ. 1485-1493) అంకితంగా ఇచ్చాడు. పినవీరన నల్లగొండ జిల్లాలోని పిల్లలమర్రిలో జన్మించాడు. ఆయన అన్న పెదవీరన సాళువ నరసింహారాయల వద్ద ఉద్యోగి. అందుకేనేమో పినవీరన తన కావ్యాన్ని ఆ రాజుకు అంకితంగా ఇచ్చాడు.
గౌరన ఏ రాజులను ఆశ్రయించలేదు. ఇతడు శివభక్తుడు. తాను శ్రీశైల భ్రమరాంబ అనుగ్రహం వల్ల కవిత్వం చెప్పానని అన్నాడు. తన కావ్యాలను శ్రీశైల మల్లికార్జునునికి అంకితంగా ఇచ్చాడు. గౌరన పెదతండ్రి పోతన రాచకొండ రాజు మాదానాయకుని దగ్గర మహామంత్రి. దీన్నిబట్టి గౌరన రాచకొండ ప్రాంతం వాడు అని తెలుస్తుంది. అతని కాలం క్రీ.శ. 1380- 1450. గౌరన ‘నవనాథ చరిత్ర’, ‘హరిశ్చంద్రోపాఖ్యానం’ అనే కావ్యాలను రచించాడు. ‘నవనాథ చరిత్ర’ను ఇంతకు పూర్వమే ‘శ్రీగిరి’ అనే కవి ‘చంపూకావ్యం’గా రచించాడు. దాన్ని అనుసరిస్తూ గౌరన తన కావ్యాన్ని ‘ద్విపద’లో రచించాడు. శ్రీగిరి కావ్యం మాత్రం ఇప్పుడు దొరకడం లేదు. ‘నవనాథ చరిత్ర’ తొమ్మిది నాథుల చరిత్రను చెప్తున్నది. ‘నాథులు’ అంటే చాలా మంది శైవగురువులని అనుకున్నారు. ఆ విధంగానే విమర్శ వ్యాసాలు రచించారు.
కాని ఎనిమిదవ శతాబ్దంలో శ్రీపర్వత ప్రాంతంలో అంటే శ్రీశైల పర్వత ప్రాంతంలో ‘నాథ సంప్రదాయం’ అన్నదొకటి ఆరంభమైంది. శ్రీశైల ప్రాంతానికి ఒకప్పుడు శ్రీపర్వతం అనే పేరు ప్రసిద్ధంగా ఉండేది. శ్రీపర్వత ప్రాంతంలో బౌద్ధ సంప్రదాయంలో యోగాతో కూడిన ఒక బౌద్ధ సిద్ధ సంప్రదాయం ఏర్పడింది. దీని నుంచే ‘నాథ సంప్రదాయం’ ఏర్పడింది.
బౌద్ధ సిద్ద సంప్రదాయంలో ఈశ్వర తత్వం అనేది ఏమీ లేదు. కాని నాథ సంప్రదాయం శివుడిని ఆది దేవునిగా భావిస్తుంది. ఈ నాథ సంప్రదాయంలో మొట్టమొదటి నాథుడు అంటే గురువు మత్య్సేంద్రనాథుడు. అతని శిష్యుడు గోరఖనాథుడు ఈ సంప్రదాయాన్ని వ్యాపింపజేశాడు. క్రీ.శ. 8-14వ శతాబ్దంలో నాథ సంప్రదాయం నేపాల్ నుంచి కన్యాకుమారి వరకు, సింధు నుంచి అస్సాం వరకు భారతదేశం అంతటా సామాన్య జనుల్లో వ్యాపించి ఉండేది. ఈ సంప్రదాయాన్ని వ్యాపింపజేసిన 9మంది గురువులు ‘నవనాథులు’ అనే పేరుతో ప్రసిద్ధమైనారు.
ముదిగంటి ,సుజాతారెడ్డి
99634 31606