ఆసియా దేశాల్లో నేటికీ బౌద్ధం ప్రధాన మతంగా కొనసాగటాన్ని చూపుతూ ‘లైట్ ఆఫ్ ఆసియా’ (బుద్ధుడు) ఆవిర్భవించింది మా వద్దే అని గర్వంగా చెప్పుకొంటాం. బౌద్ధం ప్రాచీన భారతదేశంపై చూపించిన ప్రభావం అపారం. భారత ఉపఖండంలో భాగమైన ప్రాచీన తెలంగాణలో కూడా బౌద్ధం ఒక ప్రధాన మతంగా ఉండేది. అస్సక మహాజనపదంగా రూపొంది, శాతవాహన, ఇక్ష్వాకు, వాకాటక, విష్ణుకుండి రాజ్యాలు ఏలుతున్న కాలంలో బౌద్ధ మతం ప్రజాజీవనంతో పెనవేసుకుపోయి ఉందనడానికి తెలంగాణలోని గ్రామాల అట్టడుగు పొరల్లో ఉన్న ఆధారాలు సాక్ష్యంగా ఉన్నాయి. వెతికే ఓపిక ఉండాలి కానీ ఈ నేల అట్టడుగు పొరలో మనకు దొరికేది బౌద్ధ జీవన ఆనవాళ్లే.
తెలంగాణ చరిత్రలో క్రీస్తు పూర్వం 6 లేదా 5వ శతాబ్దం నుంచి క్రీస్తు శకం 6వ శతాబ్దం వరకు, సుమారు 1200 ఏళ్ళు బౌద్ధం వర్ధిల్లింది. అందుకే శాతవాహనుల నుంచి బాదామి చాళుక్యుల వరకు తెలంగాణ చరిత్ర రచనలో బౌద్ధం ప్రస్తావన లేకుండా రాయలేము. ఇప్పటికీ మన గ్రామాల పేర్లలో ’ధర్మ’ అని ఉంటే అక్కడి చరిత్రలో బౌద్ధ వారసత్వం ఉందనే అనుకోవాలి. ధర్మారం, ధర్మపురి, దమ్మపేట ఇలాంటి పేర్లున్న గ్రామాలు తెలంగాణలో ఎన్నో ఉన్నాయి.
తెలంగాణకు మగధకు పోలిక
క్రీస్తుపూర్వం 1500లో రుగ్వేదకాలంతో మొదలుపెట్టి సప్త సింధు ప్రాంతం నుంచి ఒక 500 ఏళ్ళ లోపే గంగ-యమునా ఎగువ ప్రాంతానికి చేరుకుని వైదిక సంస్కృతి విస్తరించటం మొదలయ్యింది. క్రీస్తు పూర్వం 700 నుంచి మధ్య గంగా ప్రాంతంలో జైన, బౌద్ధ, ఆజీవక సిద్ధాంతాలు, మతాలతోపాటు చార్వాకం (లోకాయత) వంటి భౌతికవాద తత్వశాస్త్రం ఎదుగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో వచ్చిన జైన, బౌద్ధాలు తెలంగాణ (నాటి అస్సక మహా జనపదం)లో శ్రమణుల ద్వారా వ్యాపించాయి. శ్రమణులు లేదా పరివ్రాజకులు అంటే సంచారులుగా ఉంటూ సిద్ధాంతాల్ని ప్రచారం చేసే వాళ్లు. మనకు దొరుకుతున్న పురావస్తు ఆధారాలను బట్టి క్రీ.పూ.2వ శతాబ్దం నుంచి క్రీ.శ. 6వ శతాబ్దం వరకు బౌద్ధం ఇక్కడ విలసిల్లిందని తెలుస్తున్నది. తర్వాత బౌద్ధానికి ఆదరణ తగ్గుతున్న క్రమం, దాని స్థానంలో జైనం కాకతీయుల కాలం వరకు వర్ధిల్లడం చూస్తాం.
తెలంగాణలో బౌద్ధం విస్తరించడానికి కారణాలు వెతకాలంటే.. బౌద్ధం పుట్టి, పెరిగిన మగధ మహాజనపదానికి మనకు ఉన్న పోలికలు, చారిత్రక సందర్భం అర్థం చేసుకోవాలి. క్రీ.పూ.6వశతాబ్దపు మగధలాగే అస్సక మహాజనపదం (తెలంగాణ)లో కూడా వైదిక సంస్కృతి బలపడలేదు. మగధ, మధ్య గంగా ప్రాంతాల్లో, పెరుగుతున్న వైదిక సంస్కృతికి, దానికి ప్రత్యామ్నాయంగా వస్తున్న జైన, బౌద్ధ, ఆజీవక, చార్వాక సిద్ధాంతాలతో జరిగిన సంఘర్షణ స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ దక్కనులో వైదిక సంస్కృతి ప్రభావం లేదు కానీ మత రూపం తీసుకోని స్థానిక మతవిశ్వాసాలు ఉన్నాయి. మగధలోనూ, అస్సకలోనూ వైదికేతర తెగలు, అనార్య తెగలు అప్పుడప్పుడే ఆదివాసీ లక్షణాల నుంచి గ్రామీణ సంస్కృతికి మారుతున్న సమాజం ఉంది. అందుకే ఇక్కడ బౌద్ధం సులభంగా ప్రజలకు దగ్గరయింది. ఇక రెండో కారణం.. మగధలాగే అస్సక కూడాఎదుగుతున్న మహా జనపదం. మగధ మహా జనపదం గంగాతీర మైదానాల్లో విస్తరిస్తూ రాజ్యంగా, సామ్రాజ్యంగా ఎదుగుతున్న కాలం అది. భారత ఉపఖండంలో ఉన్న 16 మహా జనపదాల్లో వింధ్యకు కింద ఏర్పడిన ఒకే ఒక్క మహా జనపదం గోదావరీ పరివాహక ప్రాంతంలోని అస్సక. మగధ, అస్సక రెండింటిలో జరుగుతున్న మార్పులు- అంటే వ్యవసాయ విస్తరణ, వర్తక వాణిజ్యాల అభివృద్ధి, పట్టణీకరణ, ఆదివాసీ సమూహాలు గ్రామీణ సమూహాలుగా మార్పు చెందటం, ఉత్పత్తి శక్తులైన ప్రజలు, వనరులను పూర్తిగా అభివృద్ధి చేయడానికి బౌద్ధం తోడ్పడింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఎదిగే సమాజానికి కావాల్సిన కలుపుకుపోయేతనాన్ని (inclusiveness ను) బౌద్ధం చూపింది. అందుకే జైనం కంటే బౌద్ధం అస్సకకు చేరువైంది.
బావరి కథ
కొత్త ఆలోచల్ని వెతుక్కుంటూ వెళ్లిన కొంతమంది బుద్ధుడి సిద్ధాంతాన్ని తెలంగాణ నేలకు తెచ్చిన కథ ఇది. బౌద్ధం తెలంగాణకు బుద్ధుడి జీవితకాలంలోనే వచ్చిందని చెప్పడానికి ఆధారం తొలినాళ్ల బౌద్ధసాహిత్యంలో భాగమైన సుత్త నిపాత లోని పారాయణవగ్గ అనే అధ్యాయం. ఈ కథ క్రీస్తు పూర్వం 6 వ శతాబ్దపు చరిత్రను, భౌగోళిక స్వరూపాన్ని చెపుతుంది.
సో అస్సకస్స విషయే మూలకస్స సమాసనే
వాసి గోదావరికులే ఉంఛేన చ ఫలేన చ
‘ముళక (మహారాష్ట్రలోని ఎగువ గోదావరి ప్రాంతం) పక్కనున్న అస్సక (తెలంగాణలో ప్రవహిస్తున్న మధ్య గోదావరి ప్రాంతం) ప్రాంతంలో గోదావరి నది పాయల మధ్య’ కోసల ప్రాంతం నుంచి వచ్చిన బావరి అనే ఒక బ్రాహ్మణుడు అక్కడే ఫలాల్ని ఏరుకుని తింటూ జీవించేవాడు. అక్కడికి వచ్చిన మరో బ్రాహ్మణుడు బావరిని 500 నాణేలు ఇవ్వమని అడిగి, ఇవ్వకపోతే మరణిస్తావని శపిస్తాడు. దుఃఖంలో ఉన్న బావరికి భోతి అనే ఒక స్త్రీ దేవత.. జ్ఞానోదయమైన ఒక మహా పురుషుడు నీకు మార్గం చూపుతాడని చెపుతుంది. ఆ జ్ఞానిని వెతకడం కోసం తన 16 మంది శిష్యుల్ని పంపుతాడు బావరి. వీరు బుద్ధుడిని కలవడం కోసం, ముళకలోని పటిత్తాన్ (మహారాష్ట్రలోని పైఠాన్), మధ్యప్రదేశ్లోని మహిస్సతి (మాహిష్మతి), ఉజ్జేని (ఉజ్జయిని), గోనాద్ధ, విదిష, ఉత్తరప్రదేశ్లోని కోశాంబి, సాకేత (నేటి అయోధ్య), సావత్తి (శ్రావస్తి), సేతయేవ, కపిలవస్తు (నేపాల్లో దిగువ ప్రాంతం), కుసినార (కుశీనగర్), పావ (పావపురి), వేసాలి (వైశాలి), మగధంపురం (పాట్నా)- అన్నిటినీ తిరిగి చివరకు రాజగృహ (బీహార్లోని రాజ్గిర్)లో తథాగతుడిని కలుసుకున్నారు. బహుశా తెలంగాణ చరిత్రలోనే రికార్డయిన మొదటి తీర్థయాత్రగా దీనిని చెప్పుకోవచ్చు. బుద్ధుడిని కలిసి తమ సందేహాలను నివృత్తి చేసుకున్న ఈ 16 మందిలో 15 మంది అక్కడే ఉండిపోగా అందరి కంటే వయోవృద్ధుడైన పింగియ మాత్రం బావరికి బుద్ధ సందేశాన్ని వినిపించడానికి తిరిగి వస్తాడు.
‘నా పెదవులు ఇప్పుడు కొత్త మార్గాన్ని ప్రకటిస్తాయి. చీకటిని పారద్రోలి, ఈ విశ్వాన్ని అర్థం చేసుకున్న, పునర్జన్మ లేని బుద్ధుడిని సేవిస్తాను’ అని బావరితో పింగియ చెప్పడంతో తెలంగాణాలో బౌద్ధం మొదలైంది. ఇప్పటి వరకు మనకు దొరికిన ఆధారాల్లో, వింధ్యకు ఇవతల దక్షిణాన బుద్ధుడి జీవితకాలంలోనే బౌద్ధం ప్రారంభమైనదనటానికి మొదటి ఆధారం ఇదే. అంటే క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలోనే తెలంగాణలో బౌద్ధం ప్రభావం మొదలైందని, ఆ గౌరవం తెలంగాణలోని గోదావరీ పరీవాహక ప్రాంతానికి దక్కిందని చెప్పొచ్చు. బుద్ధుడు తన జీవిత కాలంలో ప్రధానంగా గంగా-యమున ప్రాంతాల్లో (నేటి బీహార్, ఉత్తర్ప్రదేశ్లలో) తిరుగుతూ బౌద్ధ ధర్మాన్ని ప్రచారం చేశారు.
బావరి కథకు సంబంధించిన భౌతిక, పురావస్తు ఆధారాలు ఇప్పటి వరకు దొరుకకపోయినా సుత్తనిపాతలోని భౌగోళిక అంశాల్ని ప్రామాణికంగా తీసుకోవచ్చు.
భోతి అనే స్త్రీ దేవత బుద్ధుడి గురించి చెప్పడం వంటి ఊహలను మినహాయిస్తే బావరి కథ తెలంగాణలో బౌద్ధం తొలి అడుగుల్ని గుర్తించటంలో ఉపయోగపడుతుంది. సాహిత్య ఆధారమైన బావరి కథకు పురావస్తు ఆధారం వెతకగలిగితే ఇక్కడ బౌద్ధానికి సంబంధించిన సాధికార చరిత్రను రాయగలుగుతాం. ఈ వెతుకులాట గోదావరి పాయల్లో ఇప్పటి వరకు ఎలా సాగింది?, ఏ ఆధారం దొరికింది? వంటి వివరాల్ని వచ్చే వారం చెప్పుకొందాం.
– డా. ఎం.ఏ. శ్రీనివాసన్
81069 35000