భారత రాజ్యాంగంలో మన దేశ ప్రస్తావన ‘రాష్ర్టాల సమాఖ్య’గా ఉంటుంది. అందుకే మన రాజ్యాంగం సమాఖ్య వ్యవస్థకు పెద్దపీట వేసింది. భారత రాజ్యాంగ వ్యవస్థలో కేంద్ర-రాష్ట్ర సంబంధాలు దేశ పరిపాలనలో నిర్మాణాత్మక, కీలక పాత్రను పోషిస్తున్నాయి. కానీ వాటికి విరుద్ధంగా నేటి కేంద్ర ప్రభుత్వం తాము అధికారంలో లేని రాష్ర్టాలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నది.
తెలంగాణ విషయంలో కూడా కేంద్రం ధోరణి స్పష్టంగా కనిపిస్తున్నది. రాష్ట్ర పునర్విభజన హామీలను నెరవేర్చకపోవటమే కాకుండా రాష్ర్టాభివృద్ధికి అవరోధాలను సృష్టిస్తున్నది. రాష్ట్ర బీజేపీ నాయకత్వాన్ని ప్రభుత్వం మీదకు ఉసిగొల్పుతున్నది. తెలంగాణ వడ్లపై దొంగ సాకులు చెప్తూ రాష్ట్ర ప్రభుత్వంపై నెపం నెడుతున్నది. తెలంగాణ వడ్లను కొనేది లేదని తెగేసి చెప్పి రాష్ట్ర రైతాంగం గుండెల మీద గుదిబండను వేస్తున్నది. ఇతర రాష్ర్టాల్లో మాత్రం వరిని సేకరిస్తూనే తెలంగాణ పట్ల వివక్షను చూపుతూ సమాఖ్య వ్యవస్థకు తూట్లు పొడుస్తున్నది. రాష్ట్ర రైతాంగానికి అన్ని తానై అండగా రాష్ట్ర ప్రభుత్వం ఉంటే… కేంద్ర సర్కార్ మాత్రం తెలంగాణ రైతుల పాలిట శాపం గా మారింది. దేశంలో వరి ధాన్యం నిల్వలు చాలా ఎక్కువగా ఉన్నాయని రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు మరల్చండని కేంద్ర ప్రభుత్వం సూచిస్తుంటే… తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతలు మాత్రం వరిని ఎట్ల వద్దంటరని దగాకోరు మాటలు మాట్లాడుతూ రైతులను రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నారు. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక రకమైన సూచన చేస్తూ… తమ పార్టీ నేతలకు మరోలా ఉసిగొలుపుతూ మోదీ సర్కార్ రెండు నాలుకల ధోరణితో వ్యవహరిస్తోంది.
కేంద్ర ప్రభుత్వం ఫెడరల్ స్ఫూర్తికి గోరీ కడుతున్నదని చెప్పడానికి, రైతుల ఉద్యమంతో రద్దు చేసిన మూడు వ్యవసాయ చట్టాలు అద్దం పడతాయి. వ్యవసాయం రాష్ట్ర జాబితాలోని అంశం అయినప్పటికీ నిబంధన చివరాఖరున ఉన్న వెసులుబాటును ఆసరాగా చేసుకొని ఆర్టికల్-249 ప్రకారం వ్యవసాయరంగంలో అనూహ్యమైన సంస్కరణలను మూడు చట్టాల రూపంలో తెచ్చింది. తద్వారా రైతులకు స్థానిక పరిస్థితులతో సంబంధం లేకుండా దేశం మొత్తానికి వర్తించే విధానాలను నెత్తిన రుద్దడం అన్నమాట. ఈ చట్టాలపై దేశం నలుమూలల నుంచి ప్రజాగ్రహ జ్వాల పెల్లుబుకడంతో ఆ నల్ల చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. ఈ విధంగా సమాఖ్య విధానానికి స్వస్తి పలికే ధోరణిని కేంద్రం అవలంబించడం ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రాణాంతకమే.
కరోనా విపత్కర సమయంలో ఆదాయం కోల్పో యి రాష్ర్టాలు అల్లాడుతున్న సమయంలోనూ కేంద్రం ఇదే వైఖరిని ప్రదర్శించింది. రాష్ర్టాల అవసరాలకు అప్పులు తీసుకోవడానికి ‘ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్’ (ఎఫ్ఆర్బీఎం) నిబంధనలను నిర్దేశిస్తుంది. దీన్ని 5 శాతానికి పెంచమని రాష్ర్టాలు కేంద్రాన్ని అడిగినప్పుడు కేంద్రం ఆర్బీఐ ద్వారా ఎన్నో షరతులు పెట్టింది. తెలంగాణ విషయంలోనూ ఇలాగే వ్యవహరించింది. కేంద్రం వివక్షను విస్మరిస్తూ బీజేపీ నేతలు తెలంగాణ అప్పులు పెరుగుతున్నాయని మాట్లాడుతున్నారు. వాళ్లు అప్పులనే చూస్తున్నారు గానీ, అదేస్థాయిలో రాష్ట్రం అభివృద్ధి జరుగుతున్నదనే విషయాన్ని విస్మరిస్తున్నారు. అప్పులు ఇచ్చే సంస్థలు రాష్ట్ర పరిస్థితిని అంచనా వేసుకొని ఇస్తాయి. తిరిగి కట్టగలరా లేదా అనే విషయాన్ని బేరీజు వేసుకుంటాయి.
‘హెలికాప్టర్ మనీ’ విధానం ద్వారా దేశ ఆర్థికవ్యవస్థకు పునరుజ్జీవం కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం చేసిన సూచనను కూడా కేంద్రం పెడచెవిన పెట్టింది. హెలికాప్టర్ మనీ అంటే ఆర్థికవ్యవస్థ సంక్షోభంలో ఉన్నప్పుడు ప్రజలకు నేరుగా డబ్బులు చేరవేసి వారి కొనుగోలుశక్తిని పెంచడం. ఈ విధానాన్ని 1969లో అమెరికాకు చెందిన ప్రఖ్యాత ఆర్థికవేత్త ప్రెడ్మాస్ ప్రతిపాదించగా 2002లో ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ బెస్ బెర్లాంబే ప్రాచుర్యంలోకి తీసుకువచ్చారు. ఈ విషయాన్ని కనీసం పరిగణనలోకి తీసుకోకుండా రాష్ర్టాల అభిప్రాయాలను తోసిపుచ్చడం ఏ విధానానికి సంకేతం.
జీఎస్టీ విధానాన్ని ప్రవేశపెట్టిన నాడు రాష్ర్టాలకు పన్ను రాబడి తగ్గకుండా చూస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. కానీ, ఆచరణలో ఆ హామీ అమలే కాలేదు. రాష్ర్టాల ప్రయోజనాలకు విరుద్ధంగా సెస్లను విధిస్తున్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్నకాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ, రైతుబంధు లాంటి పథకాలకు సహాయం చేయమని నీతి ఆయోగ్ సిఫారసు చేసినా ఇప్పటివరకు నయా పైసా ఇవ్వకుండా బేఖాతరు చేస్తున్నది.రాజ్యాంగబద్ధమైన గవర్నర్ పదవిని కూడా కేంద్రం దుర్వినియోగపరుస్తున్నది. మొన్నటికి మొన్న మహారాష్ట్రలో రాత్రికి రాత్రే రాష్ట్రపతి పాలన రద్దు చేయించి తెల్లారకముందే సంఖ్యాబలం లేని వారితో గవర్నర్ ప్రమాణం చేయించటం చూశాం. మధ్యప్రదేశ్లో ప్రభుత్వాన్ని పడగొట్టడం, రాజస్థాన్లో ప్రభుత్వానికి అనేక ఇబ్బందులను సృష్టించటం, ఢిల్లీలో ముఖ్యమంత్రికి కనీస అధికారాలు లేకుండా చేయటం వంటివెన్నో కేంద్రం ఏకపక్ష ధోరణికి సంకేతాలు. ప్రజల ద్వారా ఎన్నుకోబడిన రాష్ట్ర ప్రభుత్వాలకు స్వేచ్ఛ లేకుండా చేయడమే లక్ష్యంగా గవర్నర్ల వ్యవస్థ ఉన్నదా.. అన్నంత అధ్వాన్నంగా ఫెడరల్ వ్యవస్థను మార్చింది కేంద్రం. సమాఖ్య స్ఫూర్తికి సమాధి కడుతున్న కేంద్రాన్ని రాష్ర్టాలు నిలదీయకుంటే దేశ సమాఖ్య వ్యవస్థకు తీరని నష్టమే. కేంద్ర-రాష్ర్టాల సంబంధాలు సహకారపూరితంగా ఉంటేనే సమాఖ్య వ్యవస్థ విరాజిల్లుతుంది. దేశం వృద్ధిలో మరింత పురోగమిస్తుంది.
కరోనా విపత్కర సమయంలో ఆదాయం కోల్పోయి రాష్ర్టాలు అల్లాడుతున్న సమయంలోనూ కేంద్రం వివక్షపూరిత వైఖరిని ప్రదర్శించింది.రాష్ర్టాల అవసరాలకు అప్పులు తీసుకోవడానికి ‘ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్’ (ఎఫ్ఆర్బీఎం) నిబంధనలను నిర్దేశిస్తుంది. దీనిని 5 శాతానికి పెంచమని రాష్ర్టాలు కేంద్రాన్ని అడిగినప్పుడు కేంద్రం ఆర్బీఐ ద్వారా ఎన్నో షరతులు పెట్టింది.తెలంగాణ విషయంలోనూ ఇలాగే వ్యవహరించింది.
-పిన్నింటి విజయ్కుమార్, 90520 39109