రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు ఛాన్స్లర్ హోదాలో నిర్వర్తించాల్సిన బాధ్యతలను తాను ఇకమీదట చేపట్టబోనని కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ వ్యాఖ్యానించటం వివాదానికి తెరలేపింది. ఈ వ్యాఖ్య గవర్నర్కు, కేరళ రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య విభేదాలనే గాక, దేశంలో ఈ రెండు రాజ్యాంగ వ్యవస్థల మధ్య పెరుగుతున్న అంతరాన్ని చూపుతున్నది. పశ్చిమబెంగాల్లో ముఖ్యమంత్రి మమత బెనర్జీ, గవర్నర్ జగ్దీప్ ధన్కర్ పరస్పరం వాగ్బాణాలు విసురుకోవటం తరచూ చూస్తున్నదే. ఒకటి రెండు రాష్ర్టాలను మినహాయిస్తే, బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న దాదాపుగా అన్ని చోట్లా ఇటువంటి వివాదాలు రగులుతున్నాయి. మధ్యప్రదేశ్, కర్ణాటక, రాజస్థాన్, మహారాష్ట్రల్లో గవర్నర్లు తమ రాజ్యాంగ విధులను పక్కనబెట్టి బీజేపీకి అనుకూలంగా వ్యవహరించటం ఇటీవలి చరిత్రే.
ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలకు గవర్నర్లు ఆటంకాలు సృష్టించటం మనదేశానికి కొత్త కాదు. గవర్నర్కు, ముఖ్యమంత్రికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే ఉదంతాలు అనేకం ఉన్నాయి. దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ తిరుగులేని ఆధిపత్యాన్ని వహించినప్పుడు ముఖ్యంగా ఇందిరాగాంధీ హయాంలో గవర్నర్ వ్యవస్థ దుర్వినియోగం పరాకాష్ఠకు చేరుకుంది. 1971 నుండి 19 90 వరకూ 63 సార్లు వివిధ రాష్ర్టాల్లో రాష్ట్రపతి పాలన విధించారు. 90వ దశకం నుండి ఈ తరహా కేంద్ర ఆధిపత్య రాజకీయాలు కాస్త సద్దుమణిగాయి. సమాఖ్య వ్యవస్థ కుదురుకుంటున్నదనే ఆశ కలిగింది. కానీ 2014లో మోదీ సర్కార్ వచ్చినప్పటి నుంచీ పూర్వ పరిస్థితులు పునరావృతమవుతున్నాయి. గోవా, మణిపూర్ తదితర రాష్ర్టాల్లో అధిక స్థానాలను గెల్చుకున్నప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్కు అవకాశం ఇవ్వకపోవటం, ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వానికి లెఫ్టినెంట్ గవర్నర్ అడుగడుగునా అడ్డంకులు సృష్టించటం ఇందుకు ఉదాహరణలు.
గవర్నర్ వ్యవస్థను సంస్కరించడానికి, సమాఖ్య వ్యవస్థను బలోపేతం చేయడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి. పలు కమిటీలు ఏర్పాటయ్యాయి, సిఫారసులు ఇచ్చాయి. కానీ ఫలితం మాత్రం లేదు. 1983లో ఏర్పాటైన సర్కారియా కమిషన్కు అప్పట్లో బీజేపీ చేసిన విజ్ఞప్తులను చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. రాష్ట్ర అసెంబ్లీ సిఫారసు చేసిన పేర్ల జాబితా నుండి గవర్నర్ను కేంద్రం ఎంపిక చేయాలని, గవర్నర్ల నియామకంపై కేంద్రం పెత్తనం లేకుండా, కేంద్రం-రాష్ర్టాలతో కూడిన ఉమ్మడి మండలి నిర్ణయించాలని నాడు బీజేపీ ఆదర్శాలను వల్లించింది. కానీ తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఆదర్శాలకు తిలోదకాలు ఇచ్చింది. జాతీయపార్టీలు కేంద్రంలో అధికారంలో ఉంటే దేశంలో సమాఖ్యవ్యవస్థ పరిఢవిల్లటం సాధ్యం కాదని ఈ అనుభవాలు చెబుతున్నాయి.