సిటీబ్యూరో,మే 20(నమస్తే తెలంగాణ):మల్టీ లెవల్ మార్కెటింగ్ సంస్థ ఈబిజ్.కామ్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మరోమారు షాకిచ్చింది. తాజాగా కంపెనీకి సంబంధించిన రూ.31.63 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది. మల్టీ లెవల్ మార్కెటింగ్కు పాల్పడి దేశవ్యాప్తంగా 12 లక్షల మందిని మోసం చేసి రూ. 1046 కోట్లు కొల్లగొట్టిన కేసులో ఈడీ తాజాగా ఈ ఆస్తులను జప్తు చేసింది. సంస్థపై సైబరాబాద్ పోలీసులు కేసును నమోదు చేసిన విషయం తెలిసిందే. దీని పై ఈడీ కూడా దర్యాప్తును ప్రారంభించింది. ఈడీ దర్యాప్తులో దాదాపు ఈ కంపెనీ ఎండీ పవన్ మలహాన్, అతని కుమారుడు హితిక్ మలహాన్లతో పాటు కంపెనీకి సంబంధించిన దాదాపు 124 బ్యాంక్ ఖాతాల్లోని నగదు, ఇతర ఆస్తులకు సంబంధించి మొత్తం రూ.277.97 కోట్ల విలువైన ఆస్తులను మొదటి దశలో ఈడీ జప్తు చేసిన విషయం తెలిసిందే. తాజాగా రెండో సారి రంగారెడ్డి జిల్లా కోర్టు అనుమతితో రూ.31.63 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది.