manasa puja | ఓ గ్రామంలో ప్రముఖ జ్యోతిష్యుడు ఉండేవాడు. అతని దగ్గరికి ఓ రోజు సాయంత్రం సమీప గ్రామానికి చెందిన రైతు తన జాతకచక్రం తీసుకొని వచ్చాడు. ‘అయ్యా! నా రాశిఫలాలు, గ్రహబలాలు చూసి, భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పండి’ అని ఆసక్తిగా అడిగాడు. అతని జాతకచక్రం చూశాక ఆ సిద్ధాంతి ముఖ కవళికలు మారిపోయాయి. ఆ జాతకం దినఫలాల ప్రకారం రైతు ఆ రాత్రి ఎనిమిది గంటలకు ప్రమాదవశాత్తూ చనిపోవాల్సి ఉంది. ఆ భయంకరమైన నిజాన్ని అతనితో చెప్పలేక జ్యోతిష్యుడు ఆ రైతుతో ‘ఇవ్వాళ నేను కొంచెం వేరే పనిలో ఉన్నాను. రేపు పొద్దునే రా! చెబుతాను’ అంటాడు. రైతు వెళ్లిపోగానే ఆ సిద్ధాంతి భార్యతో ఉదాసీనంగా ‘అయ్యో! నువ్వు ఈ రోజే చనిపోతావు! అని ఆ అమాయక రైతుకు ఎలా చెప్పేది? అందుకే రేపు రమ్మని వెనక్కి పంపించేశాను. ఎలాగూ రేపటికి ఆయన ఈ లోకంలో ఉండడు కదా!’ అని నిట్టూర్చాడు.
రైతు స్వగ్రామానికి వెళ్లే మార్గం మధ్యలో అడవిగుండా సాగిపోతుంది. అలా అతను అడవిలో వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా ఆకాశంలో మేఘాలు కమ్ముకున్నాయి. దట్టమైన చీకటి ఆవరించింది. ఉరుములు, మెరుపులతో వాన చినుకులు మొదలయ్యాయి. గాలివాన కాస్త కుండపోతగా మారిపోయింది. ఎక్కడ తలదాచుకోవాలో తెలియక ఆ రైతు ఓ పాడుబడిన శివాలయంలోకి వెళ్లాడు. కొన్ని క్షణాల తర్వాత తుండుగుడ్డతో తల తుడుచుకుంటూ ఆ కోవెల పరిసరాలను పరిశీలించాడు. నేలంతా చెట్లూచేమలు పెరిగి, సాలీడులు గూళ్లు కట్టి జీర్ణావస్థలో ఉన్న ఆ గుడి కూలిపోవటానికి సిద్ధంగా ఉందనిపించింది. ఆ మహాదేవుడి ఆలయాన్ని చూసి రైతు మనసు చివుక్కుమంది.
ముక్కంటి మందిరం పునరుద్ధరణపై రైతు మనసులోనే పరిపరి విధాలా ఆలోచించసాగాడు. ‘అయ్యో! నాకే సమృద్ధిగా ధనముంటే ఈ ఆలయాన్ని ఇలా ఉండనిచ్చే వాడినా? దేవళం రూపురేఖలే మార్చేసి, పూర్వ వైభవం తీసుకువచ్చేవాణ్ని. గోపురాన్ని అందంగా తీర్చిదిద్దేవాడిని. ప్రాకారాలకు, ప్రాంగణానికి సున్నం వేయించి ఆకర్షణీయంగా మార్చేవాడిని. గోపురంపై కలశాన్ని ప్రతిష్ఠించేవాణ్ని. ఆలయ సంప్రోక్షణ, కుంభాభిషేకం తదితర ఉత్సవాలన్నీ ఘనంగా నిర్వహించేవాణ్ని. స్వామి సమారాధనలకు ఎలాంటి ఆటంకమూ కలగకుండా మూలనిధిని సమకూర్చేవాడిని. భక్తులకు సకల ఏర్పాట్లు చేసేవాడిని’ అనుకుంటూ పైకప్పును చూశాడు. అక్కడ పగిలిన రాళ్ల మధ్య ఓ నల్లటి తాచు కంటపడింది. ఒక్కసారిగా ఆ హాలికుడు భయంతో బయటికి వచ్చేశాడు. ఇంతలో వాననీటికి తడిసిన పైకప్పు కూలిపోయింది. సరిగ్గా అప్పుడు సమయం రాత్రి ఎనిమిది గంటలవుతున్నది. ఆ విధంగా రైతుకు రెండు విధాలుగా ప్రాణాపాయం తప్పినట్లయింది.
వర్షం తగ్గాక రైతు ఇల్లు చేరుకొన్నాడు. మరుసటి రోజు తిరిగి ఆ సిద్ధాంతి దగ్గరికి వెళ్లాడు. రైతును చూడగానే జ్యోతిష్యుడు ఆశ్చర్యచకితుడయ్యాడు. తన జ్యోతిష్యం లెక్క తప్పిందా! అన్న అనుమానంతో మరోసారి పరిశీలించాడు. రైతు మరణం అనివార్యమని స్పష్టమైంది. కానీ, ఏదైనా శివాలయ నిర్మాణ పుణ్యం తోడైతే తప్ప, ఆయన ఆ హఠాన్మరణం నుంచి తప్పించుకోలేడని నిర్ధారణ అయింది. అదే సందేహాన్ని ఆ హాలికుడి ముందు వెలిబుచ్చాడు. అప్పుడు రైతు ముందురోజు జరిగిన విషయమంతా సిద్ధాంతికి వివరించాడు. ఆ మందిరం విషయంలో తాను పడిన వేదన అంతా పూసగుచ్చినట్లు చెప్పాడు. అసలు విషయం జ్యోతిష్యుడికి అర్థమైంది. ఆ రైతు మనసులో ఆలయం గురించి చేసిన మంచి తలంపే ‘మానసపూజ’గా ఆ పుణ్యఫలాన్ని ప్రసాదించిందని గుర్తించాడు.
శైవ సాధువులైన అరవైమూడు మంది నయనార్లలో ఒకరైన పుసలార్ నాయనార్ జీవితచరిత్రలో తటస్థపడే ఈ రైతు ఉదంతం హిందూధర్మంలో ప్రస్తావించే ‘మానస పూజ’ విశిష్టతకు తార్కాణం.
…?మనోజ్ఞ