శుకముని అవనీపతి పరీక్షిత్తుతో.. రాజా! విశ్వరూపాన్ని ధరించిన వామనుడు ఒక పాదంతో భూమిని కొలిచాడు. మేను- దేహంతో మిన్నుని, బాహువులతో అన్ని దిక్కులను ఆక్రమించాడు. రెండోపాదం సత్యలోకం చేరిపోయింది. ఆ బృహద్రూపం పట్టకపోవడం వలన బ్రహ్మాండానికి గండిపడి పెటపెటలాడుతూ బద్దలైపోసాగింది. ఒంటివాడైన వామనుడు తప్ప మరెవరూ కంటికి కనిపించకుండా పోయారు. రాజా! ఆ విరాడ్రూపంలో ఒక పాదం కింద ఉన్న పృథివీ మండలం పద్మానికి అంటుకొన్న చిన్న పంకపు (బురద) ముద్దలాగా విరాజిల్లింది. మరోపాదం మీద ఉన్న మిన్ను (ఆకాశం) ఆ పద్మం మీద వాలి ఉన్న తుమ్మెద వలె విలసిల్లింది. త్రివిక్రమ దేవుని కాలిగోళ్ల కాంతికి సత్యలోకంలోని బ్రహ్మ తేజస్సు దివాకరుని ముందు దివిటీ వలె వెలవెలపోయింది. సర్వసంసార బంధాలూ సమసిపోగా సత్యలోకంలో నిత్యనివాసం చేస్తున్న ప్రజాపతులు, సనందాది యోగీంద్రులు, మూర్తిమంతాలై మారుమోగుతున్న వేదవేదాంగ పురాణ ఇతిహాసాలు, శాస్ర్తాలు- అందరూ ఆర్తిని బాసి పెన్నిధియైన ఆ పాదాన్ని దర్శించి ఆ సన్నిధిలో పరామోదం పొంది భక్తితో నమస్కరించారు. పద్మనాభుని నాభి పద్మాన్ని గాంచి ‘ఆహా! నా జన్మస్థానం ఇదేకదా!’ అని స్మరించుకొంటూ విరించి- బ్రహ్మ బ్రహ్మానందం అనుభవించాడు. తన కమండల జలంతో కమలాపతి పద కమలాన్ని ప్రక్షాళన చేశాడు. ఆ నీర(జల) ధారలే నారాయణుని అపార కీర్తిప్రభలతో నిండి వినువీధిలో పండువెన్నెల ప్రవాహంలా ‘దేవ నది’ (గంగ)గా పారాయి. అంబువుల (నీటి) నుంచి అంబుజాలు (పద్మాలు) పుట్టడం ప్రకృతిలో సహజంబు. కాని, కంజదళాక్షుని (విష్ణువు) విషయంలో ఇది విరుద్ధంబు. ఆయన పాదాంబుజం నుంచి పతిత పావని గంగ ప్రభవించింది కదా! ఇదేమి విచిత్రంబు!
శుక ఉవాచ… రాజా! లోకపాలురు సర్వలోకనాథుని ధూపదీపాలతో సేవించారు. శంఖాలు పూరించి జయజయ ధ్వానాలు గావించారు. భల్లూకరాజు జాంబవంతుడు ఎల్ల దిక్కులలో భేరీ మ్రోగిస్తూ సాంబప్రియుని- విష్ణుదేవుని విజయాన్ని భారీగా చాటుతూ ఉల్లసిల్లాడు. బలితో సహా ఆ సభాస్థలిలోని పలువురు వనమాలికి అంజలి ఘటించి నతులు గావించి స్తుతి చేశారు. విష్ణుమూర్తి మెల్లగా వెనుకటి వామన రూపం వహించాడు. వామనుని మోసాన్ని గ్రహించిన దానవులు ‘ఈ పొట్టివానిని, అమర పక్షపాతిని మరో కనికట్టు చేసి పారిపోకుండా పట్టి చంపెయ్యాలి’- అంటూ తర్జన, గర్జనలు చేస్తూ ఆయుధాలు పట్టి చుట్టుముట్టారు. ఇది చూసి విష్ణు సేవకులు నంద, సునంద, జయ, జయంతాదులు కూడా వారిని తుద ముట్టించడానికి గదా ఖడ్గాది అస్ర్తాలతో యుద్ధానికి సన్నద్ధమయ్యారు. గురుదేవుని- శుక్రుని శాపం తలచుకొని హృదయం బరువెక్కగా బలి ‘ఈ సమయం మనకు సమరానికి సానుకూలం కాదు. మనకు వెరచి పలుమారులు తోకముడిచి పారిపోయిన అమరులు ఇప్పడు మనలను ఎదిరించ బూనడం మదినెంచగా- విచారించగా ఇది కేవలం విధి నిర్ణయం’ అంటూ దానవవీరులను వారించాడు. వారు రసాతలానికి వెళ్లిపోయారు.
పిమ్మట యాగంలో చివరిరోజున విష్ణువు అభిమతం అవగతం చేసుకొని వైనతేయుడు- గరుత్మంతుడు వైరోచని- బలిని వరుణ పాశాలతో బంధించాడు. చేతులు, కాళ్లూ కట్టివేయగా బలి చక్రవర్తి ‘శ్రీహరి కృపగాక యేమి సేయుదు’- ఆహా! ఇది మాధవుని దయ. నేను ఏమీ చేయలేను’ అని మౌనం వహించాడు. అన్ని దిక్కులా ఒక్కుమ్మడిగా హాహాకారాలు చెలరేగాయి. రాజా! సంపద నశించినా బలిలో దైన్యమూ, కంపమూ కలుగలేదు సరికదా వెనుకటి కంటే పెంపు (గౌరవం), తెంపు (తెగింపు), తెలివి, ధైర్యమూ, సొంపూ ఇంపుగా ఇనుమడించాయి.
లీలా వామనుడు బలితో ఈలాగున పలికాడు… ‘నీ సొమ్ము సకలంబు నేడు రెండడుగులు, గడమ పాదము నకుఁగలదె భూమి?’- దానవా! నీ నిండు సంపద అంతా ఈ నాడు నాకు రెండడుగులే అయింది. ఇక మూడో అడుగుకు చోటు ఎక్కడుందో చూపు. బలీ! మూడు లోకాలకూ జోడు(సరి) లేని ఏలికనని నీకు అహంకారం. నేను నీ ముందే కదా నా పాదంతో కొలుచుకున్నాను! ఇస్తానన్న అర్థం ఇవ్వనివాడు నరకానికి పోవడం యథార్థం’.
రాజా! మాయా వటువు పలుకులు విషపు ములుకుల వలె మనస్సును గాయపరచినా దిగులుపడకుండా పులకిత కాయు(దేహు)డై బలి ఇలా అన్నాడు.. ‘మహాత్మా! నా నాలుక బొంకజాలదు. నాకు జంకుగొంకులు లేవు. స్వామీ! నా ఇహపరాలు రెండూ మీకు సమర్పించాను. కాని, నా ‘అహం’ మాత్రం ఇంకా నా వద్దనే ఉంది. అది కూడా అర్పిస్తే కానీ నా దానం సంపన్నం కాదు. నా సమర్పణ సంపూర్ణం కాదు- పూర్ణాహుతి కాదు. సర్వేశ్వరా! ఈ శరీరం మిగిలింది. ఇదీ ఇల-మట్టిదే కాన మీ తృతీయ పాదం శాశ్వతంగా, సూక్ష్మమైన నేల (భూ) తలపులకు- భౌతిక వాసనలకు నిలయమైన నా తలపై పెట్టండి.’ బలి సమర్పించాల్సిన మూడవ అడుగు అహంకారమే. ఇదే అహంభావ సమర్పణ. ఆత్మబలి- తనదే కాక తన్ను కూడా ఇచ్చుకోవడం! ఆత్మనివేదనం! ఇదే బలిదానం! (బలి స్వగతం.. స్వామీ! మీరు వామనులుగా మూడడుగులు వలచి- కోరి అవామనులై త్రివిక్రమ రూపంలో ముజ్జగాలు కొలిచారు. నాకు ముందు చూపిన పాదం వేరు. ఇప్పటి ఈ త్రివిక్రమ పాదం వేరు కదా? ఇది సక్రమమే అంటారా? ఇందులో నా అక్రమం- మోసం ఏమైనా ఉందా స్వామీ?) బలి ఇంకా ఇలా పలికాడు…
మ॥ ‘చెలియే మృత్యువు? చుట్టమే యముఁడు? సంసేవార్థులే కింకరుల్?
శిలలం జేసెనె బ్రహ్మ దన్ను? దృఢమే జీవంబు? నో చెల్లరే!
చలితం బౌట యెరుంగ కీ కపట సంసారంబు నిక్కంబుగాఁ
దలఁచున్ మూఢుఁడు సత్యదాన కరుణాధర్మాది నిర్ముక్తుడై’
.. అయ్యో! చావు ఎవరికీ ఆప్తమిత్రం- చెలికాడు కాదు. అంతకుడు- యముడు దగ్గరి చుట్టమూ కాదు. సేవకులు బుద్ధిమంతులైన సేవాపరాయణులు కాదు. ప్రాణమూ శాశ్వతం కాదు. ఈ శరీరాన్ని బ్రహ్మ శిలల- రాళ్లతో మలచలేదు. అయినా మూర్ఖుడు ఈ మాయా సంసారాన్ని సత్యమని భావిస్తూ నిత్యమైన సత్యదాన దయా ధర్మాలను వదిలివేస్తున్నాడు.
సీ॥ ‘చుట్టాలు దొంగలు; సుతులు రుణస్థులు;
కాంతలు సంసార కారణములు;
ధనము లస్థిరములు; దనువతి చంచల;
గార్యార్థులన్యులు గడచుఁ గాల
మాయువు సత్వర మైశ్వర్య మతిశీఘ్రమని
కాదె తమ తండ్రి నతకరించి
మా తాత సాధుసమ్మతుఁడు ప్రహ్లాదుండు
నీ పాద కమలంబు నియతిఁ జేసె’
తే॥ ‘భద్రుఁడతనికి మృతిలేని బ్రదుకు గలిగె
వైరులై కాని తొల్లి మావారు గాన
రర్థివై వచ్చి నీవు నన్నడుగుటెల్లఁ
బద్మలోచన! మా పుణ్యఫలము గాదె?
పురాణ పురుషా! మా తాత ప్రహ్లాదుడు- ‘చుట్టాలు దొంగలు. తనయులు రుణగ్రస్తులు- అప్పుల వాళ్లు. కాంతలు భ్రాంతి కలిగించి, సంసారంలో పడవేసి కంసారి- కృష్ణునికి దూరం చేసేవారు. ధనములు నిలకడ లేనివి. దేహం నిధన- మృత్యురూపం. ఇతరులు స్వార్థపరులు. కాలం నిలవదు. ఆయువు చిరాయువు కాదు- చిటికెలో చెల్లిపోయేది. ఐశ్వర్యం కూడా నశ్వరం- నశించి పోతుంది’ అని భావించిన కతన తన జనకుని విడనాడి మనసున నీ పాదాలను నిలిపాడు. భాగ్యశాలి అయిన అతనికి మృతిలేని మనుగడ- జీవన్ముక్తి ప్రాప్తించింది. పురుషోత్తమా! మా పూర్వ పురుషులు అందరూ నీకు పగవారుగా మారితే తప్ప నిన్ను ప్రేమతో కనలేక
పోయారు. పద్మలోచనా! నీవు ఛద్మ(మారు) వేషంలో- బిచ్చగాడుగా వచ్చి నన్ను ‘దేహి’ అని అర్థించడం మా పూర్వపుణ్య ఫలం కాకపోతే మరేమిటి?
(సశేషం)