Sri Rama Navami | ఊరంతా పందిళ్లు.. వాడంతా సందళ్లు.. రామయ్య జట్టుకట్టే వాళ్లు కొందరు.. సీతమ్మ మాయమ్మ అనేవాళ్లు ఇంకొందరు.. లోకానికి పెద్దలైన దేవుళ్ల పెండ్లికి పిల్లాజెల్లా అందరూ పెద్దలే! కల్యాణం సీతారాములది.. కోలాహలం అందరిదీ! వందే సీతారామం.. వందే లోకాభిరామం.. ముప్పైమూడు కోట్ల మంది దేవతలు ఉన్న హైందవ ధర్మంలో మరే ఇతర దేవతల కల్యాణానికి దక్కని వైభవం, మహత్తు కేవలం సీతారామ కల్యాణానికే మాత్రమే దక్కాయి. ఈ లోకోత్తర కల్యాణాన్ని మాత్రమే ‘సీతారామ శాంతి కల్యాణం’ అని పిలుస్తారు. వైదిక క్రతువుల్లో కూడా ‘శ్రీసీతారామ శాంతికల్యాణ మహోత్సవం గత్వా…’ అని సంకల్పం మొదలు మాంగల్యధారణ, ఆర్ద్రాక్షతారోపణ వరకు చెబుతారు. దీని ద్వారా సీతారామ కల్యాణం లోకకల్యాణ హేతువని అర్థమవుతున్నది.
భార్యాభర్తలు అంటే సీతారాముల్లా ఒకరికొకరుగా ఉండాలనడం, నవదంపతుల్ని సీతారాముల్లాగా ఉండమని ఆశీర్వదించడం, ఉత్తమసాధ్విని సీతమ్మ తల్లిగా పిలవడం, గౌరవ మర్యాదలు తెలిసిన వ్యక్తిని మా మంచి రామయ్య అనడం, శ్రీరామనవమి రోజున సీతాకల్యాణం జరిగిన తర్వాతనే తమ బిడ్డల వివాహ సుముహూర్తాలు నిశ్చయించుకునే ఆచారం పాటించడం, సీతారామ కల్యాణ అక్షతలను తమ బిడ్డల వివాహ తలంబ్రాలలో కలిపితే నవదంపతులు చల్లగా ఉంటారనే విశ్వాసం కలిగి ఉండటం.. ఇలా ఎన్నో సంప్రదాయాలు, ఆచారాలు, విశ్వాసాలు.. సీతారామ కల్యాణానికి మాత్రమే చెందిన ప్రత్యేకతలు.
సీతారాములిద్దరూ సాధారణ స్త్రీపురుషులు కాదు. వారిద్దరూ యజ్ఞఫలితంగా ఆవిర్భవించిన పుణ్యమూర్తులు. తమ వంశం తరించడానికి పుత్రసంతానం కోసం దశరథ మహారాజు చేసిన యాగఫలితంగా శ్రీరామచంద్రమూర్తి జన్మిస్తే, యజ్ఞ నిర్వహణలో భాగంగా యాగశాల కోసం భూమిని దున్నుతున్న జనక మహారాజుకు నాగేటి చాలు ద్వారా లభించిన యజ్ఞప్రసాదం సీతాదేవి. ‘యజ్ఞాః లోక కల్యాణ హేతవః’ – యజ్ఞాలు లోక కల్యాణానికి కారకాలుగా నిలుస్తాయి. అటువంటి యజ్ఞ ఫలితంగా జన్మించిన సీతారాములు ఒకటైన కల్యాణ మహోత్సవం లోకకల్యాణ యజ్ఞానికి హేతువుగా నిలిచింది.
విశ్వామిత్రుడి యాగ సంరక్షణ కోసం బయలుదేరిన రామలక్ష్మణులు, యాగం పూర్తికాగానే ఆ బ్రహ్మర్షి వెంట మిథిలా నగరంలోని జనక మహారాజు ఆస్థానానికి చేరుకుంటారు. విశ్వామిత్రుడు చెప్పిన మీదట జనక మహారాజు శివధనుస్సును రామలక్ష్మణులకు చూపించటానికి సిద్ధపడి, ఆ ధనస్సును తీసుకురావల్సిందిగా తన మంత్రులను ఆదేశిస్తాడు.
నృణాం శతాని పంచాశత్
వ్యాయతానాం మహాత్మనామ్
మంజూషామ్ అష్టచక్రానాం
తాం సమూహస్తే కథంచన॥
బలిష్ఠులు, దీర్ఘకాయులు అయిన ఐదువేల మంది పురుషులు, ఎనిమిది చక్రాలున్న శకటం మీద అమర్చి ఉన్న శివధనుస్సును అతికష్టంతో తోసుకుంటూ తీసుకువస్తారు. నాగ, కిన్నర, కింపురుష, యక్ష, రాక్షసులు సహా సమస్త దేవతా గణాలకు ఈ ధనుస్సును ఎక్కుపెట్టడం సాధ్యం కాలేదని జనకుడు విశ్వామిత్రుడితో చెబుతాడు. వెంటనే విశ్వామిత్రుడు ‘వత్స రామ ధనుః పశ్య’ – ‘నాయనా రామా! ఈ ధనుస్సును చూడు’ అంటాడు. వ్యవహార భాషలో చెప్పాలంటే ‘ఈ ధనుస్సు సంగతి చూడు’ అని అర్థం.
మహర్షి వాక్యంలోని అంతరార్థం గ్రహించిన రాముడు ‘లీలయా స ధనుర్మధ్యే జగ్రాహ వచనాన్మునేః’- ఆ ధనుస్సు మధ్యభాగాన్ని చేతితో పట్టుకుని, ఎంతో అలవోకగా ఎక్కుపెడతాడు. కేవలం రాముడి కరస్పర్శతోనే ధనుస్సు వంగుతుంది. ఎడమ చేతితో ధనుస్సును పట్టుకుని, కుడి చేతితో ఆ వింటి నారిని పైకొనకు బంధించి, ఆకర్ణాంతం అల్లెత్రాటిని లాగుతాడు. మరుక్షణంలో ఫెళఫెళమంటూ లోకభీకరమైన శబ్దం చేస్తూ, శివధనుస్సు రెండుగా విరిగిపోతుంది. సీతారామ కల్యాణానికి ఇదే శ్రీకారం.
మహోజ్జ్వలమైన ఈ ఘట్టాన్ని ఆధ్యాత్మికంగా పరికించి చూస్తే, సమున్నతమైన ఆత్మబోధ మనకు అందుతుంది. శాస్త్ర పరిభాషలో ధనుస్సు అంటే ఓంకారం (ప్రణవం) అని అర్థం. ‘ప్రణవో ధనుః శిరోహ్యాత్మా బ్రహ్మతల్లక్ష్యముచ్యతే’ అని ఉపనిషద్వాక్యం. ప్రణవం అంటే వంగేది అని అర్థం. ప్రణవం ఎవరికైతే వంగుతుందో, అటువంటి వ్యక్తికి మన ఆత్మను అర్పించాలి. ఇక్కడ ధనుస్సు రూపంలో ప్రణవం రామచంద్రునికి వంగింది. అంటే, మన ఆత్మను అర్పించడానికి తగిన దైవం శ్రీరాముడు. శివధనుస్సును ఎక్కుపెట్టడానికి ఎందరో దేవతలు కూడా ప్రయత్నించారు. వారెవరికీ అది సాధ్యం కాలేదు. అంటే ప్రణవం ఎవరికీ వంగలేదు. రామునికి మాత్రమే వంగింది. అంటే, మన ఆత్మార్పణకు అసలైన మార్గం శ్రీరాముడి చరణాలే అని స్పష్టమవుతుంది.
రాములోరి పెండ్లిగా జానపదులు సీతారామ కల్యాణ వైభవాన్ని జానపదాలుగా పాడుకుని, తనివితీరా రామభక్తి సామ్రాజ్యంలో మునిగి తేలుతుంటారు. పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమయ్య తన కీర్తనల్లో అనేక చోట్ల సీతారాముల కల్యాణోత్సవాన్ని, నవదంపతులుగా సీతారాములను మనసారా కీర్తించాడు. ‘రామం ఇందీవర శ్యామం పరాత్పర ధామం – సుర సార్వభౌమం భజే – సీతా వనితా సమేతం’, ‘అట్టె హరువిల్లు విరిచిన రాఘవా – సిరులతో జనకుని ఇంటను జానకి చెలగి పెండ్లాడిన రాఘవా’, ‘రాముడు రాఘవుడు రవికులుడితడు – భూమిజకు పతియైన పురుష నిధానము’ వంటి కీర్తనలు ఇందుకు ఉదాహరణ.
‘సీతమ్మ మాయమ్మ..’ వంటి వాగ్గేయకార కృతులు, ‘వామే భూమిసుతా పురశ్చ హనుమాన్…’ వంటి ధ్యానశ్లోకాలు సీతారాముల అన్యోన్య దాంపత్యాన్ని నిరంతరం గుర్తు చేస్తాయి.
ఓంకారం కారణదశలో అకారంగా మారుతుంది. ‘అదితి భగవతో నారాయణస్య ప్రథమ విధానం’ అనే వాక్యం ప్రకారం అ-కారం శ్రీమన్నారాయణుడి మొదటి పేరు. ‘ఏతస్మిన్ అంతరే విష్ణురుపయాత మహాద్యుతిః’- దశరథుడికి పుత్రుడిగా జన్మించింది సాక్షాత్తు శ్రీమహావిష్ణువు. అంటే, ప్రణవ స్వరూపుడైన శ్రీమహావిష్ణువే దశరథుడి కుమారుడైన శ్రీరామచంద్రునిగా మానవుడిగా జన్మించాడు. అందుకనే జనకుడు లక్ష్మీ స్వరూపిణి అయిన సీతమ్మను నారాయణ స్వరూపుడైన రామచంద్రుడికి అర్పించాడు.
మరొక అర్థంలో చూస్తే – శ్రీరామచంద్రుడు ఒక్కసారిగా శివధనుస్సును ఎక్కుపెట్టాడు. దాన్ని సంధించటానికి ఉన్న నారిని కట్టగానే, ఒక్కసారిగా ధనుస్సు రెండు ముక్కలైంది. ధనుస్సు ఒకభాగం శ్రీరాముడి చేతిలో ఉంది. రెండో భాగం నారి ద్వారా వేలాడుతున్నది. ఇది శివధనుర్భంగ దృశ్యం. ‘అ, ఉ, మ’ అనే అక్షరాల కలయికే ఓం కారం. ‘అక్షరానాం అకారోస్మి’ అనే వాక్యం ప్రకారం రామచంద్రమూర్తి అకార స్వరూపం. ఇది (నారాయణ స్వరూపం) నేను అని చెప్పటానికి రాముడు ధనుస్సు ఒక భాగాన్ని తన చేతితో పట్టుకున్నాడు. రెండో భాగం ‘అ’తో కలిసి ఉండే ‘మ’ అంటే మనిషి (జీవుడు). ‘అ’, ‘మ’ మధ్య ఉన్న ధనుస్సు నారి ‘ఉ’కార స్వరూపం. ‘అ’కారాన్ని ‘మ’కారాన్ని ‘ఉ’కారం కలిపి ఉంచుతుంది. అంటే, జీవాత్మ, పరమాత్మల సంబంధం ఎప్పటికీ వేరుపడేది కాదు అనే సత్యం మనకు బోధపడుతుంది. రెండుగా విడివడిన ధనుస్సు ఒక ఖండాన్ని చేతితో పట్టుకుని ‘ఓంకార ప్రతిపాద్యమైన దైవాన్ని నేనే సుమా! జీవుడు నాకు సంబంధించిన వాడే కానీ స్వతంత్రుడు కాడు’ అనే విషయాన్ని రామచంద్రమూర్తి స్పష్టంగా ప్రకటించాడు. ఇదీ శివధనుర్భంగ ఘట్టం ద్వారా మనకు అందే అద్వైత వేదాంత బోధ.
రాముడు నీలమేఘశ్యాముడు. నీలవర్ణం ఆకాశ లక్షణం. అంటే రాముడు పంచభూతాల్లో ఒకటైన ఆకాశ తత్వానికి ప్రతీక. సీతమ్మ నాగేటి చాలు ద్వారా అయోనిజగా లభించింది. అంటే, సీతమ్మ భూతత్వానికి ఆలంబన. పంచభూతాల్లో మొదటిదైన భూతత్వం సీతమ్మ కాగా, చివరిదైన ఆకాశ తత్వం రామయ్య. ఈ రెండిటి మధ్యలోనే మిగిలిన మూడు తత్వాలు ఉన్నాయి. ఎప్పుడైతే ఆకాశం భూమిని చేరుతుందో (వాన చినుకుగా మారి) అప్పుడు పుడమి (భూమి) పులకరిస్తుంది. సస్యాన్ని అందిస్తుంది. ఆ సస్యం జీవులకు ఆహారంగా మారి, శక్తిని ఇస్తుంది. అంటే, ఎప్పుడు రామయ్య సీతమ్మను చేరుకుంటాడో (సీతారామ కల్యాణం జరుగుతుందో) అప్పుడే లోకానికి శక్తి (రావణాది రాక్షస బాధ నుంచి విముక్తి పొందే శక్తి) అందుతుంది. ఈ విధంగా సీతారామ కల్యాణం లోక కల్యాణ కారకంగా, శాంతి దాయకంగా నిలుస్తుంది.
లౌకిక వ్యవహారంలో చూసినా, సీతారామ కల్యాణం సంవత్సరంలో మొదటి (వసంత) రుతువు, మొదటి (చైత్రం) నెలలో జరుగుతుంది. అంటే, కొత్త సంవత్సరంలో జరిగే తొలి వివాహం సీతారాముల కల్యాణమే. శిశిరంలో ఆకులు రాలి మోడుగా తయారైన చెట్లు, వసంతం రాగానే చిగురించి, నూతన శోభను సంతరించుకుంటాయి. ఎప్పుడు సీతారామ కల్యాణం జరుగుతుందో అప్పుడు నవవసంతం మొదలవుతుంది. ఎవరు సీతారామ కల్యాణం జరుపుతారో, వారి జీవితాల్లో నవవసంతం నిత్యవసంతంగా మారుతుంది. ఇదీ సీతారామ కల్యాణ వైభవం.
…? డాక్టర్ కప్పగంతు రామకృష్ణ