ఆశ్రమంలో ఉదయపు నడక నడుస్తున్న గురువుతో ‘ఆనందంగా ఉండాలంటే ఎలా?’ అని ప్రశ్నించాడు ఒక శిష్యుడు. గురువు చిన్నగా నవ్వి, పక్కనే ఉన్న కొండను గమనించమన్నాడు. ఒక శిక్షకుడి ఆధ్వర్యంలో కొందరు కొండ ఎక్కుతున్నారు. వారిలో ఆరోగ్యవంతమైన యువకులతోపాటు కండ్లు కనిపించని వ్యక్తులు కూడా ఉన్నారు. ఆరోగ్యవంతులైన యువకులు చాలామంది కొండ ఎక్కడానికి కష్టపడుతున్నారు. కొందరు చాలాసార్లు జారిపడుతున్నారు. అదే కండ్లులేని వాళ్లు మాత్రం నిదానంగా, ప్రశాంతంగా కొండ ఎక్కడం కనిపించింది. అది చూసి ఆశ్చర్యపోయిన శిష్యుడు ‘స్పష్టంగా అన్నీ కనిపిస్తున్నా.. కొందరు కొండ ఎక్కడానికి ఇబ్బంది పడుతున్నారు.
ప్రపంచమంతా చీకటిమయమైన అంధులు సులభంగా ఎలా ఎక్కగలుగుతున్నారు?’ అని గురువును ప్రశ్నించాడు. ‘నిజమే.. చూపు ఉన్నవాళ్లు, కొండ ఎక్కడం గురించి ‘వారు చెప్పింది, వీరు చెప్పిందీ…’ విని అనవసర సమాచారమంతా బుర్రలోకి ఎక్కించుకున్నారు. ‘అలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇక్కడ కష్టం, అక్కడ కష్టం…’ వంటి విషయాలు ముందుగానే వారికి తెలుసు. అందుకే తడబడుతున్నారు. అదే అంధులు వారికి ఏ సమాచారమూ లేదు. అంటే వారి బుర్ర ఖాళీగా ఉంది. అందుకే శిక్షకుడు ఎలా సూచనలు చేస్తే అలా నడుస్తున్నారు. దానివల్ల వాళ్లు నింపాదిగా కొండ ఎక్కగలుగుతున్నారు’ అని వివరించాడు గురువు.
‘నిజమే కదా, ఈ క్షణం ఉన్నట్లు మరుక్షణం ఉండదు. ఈ రోజు జరిగినట్లు మర్నాడు జరగదు. ఖాళీ పాత్రలో నీళ్లు నింపగలం కానీ, నిండుగా ఉన్న పాత్రలో నింపలేం కదా! మనం పూర్వానుభవాలను మదిలో పెట్టుకుని వర్తమాన విషయాలను పరిశీలిస్తే భంగపాటు తప్పదు. ఉన్నది ఉన్నట్లుగా చూస్తే సరిపోతుంది…’ అని అర్థం చేసుకున్నాడు శిష్యుడు.
ఆర్.సి.కృష్ణస్వామి రాజు: 93936 62821