పరీక్షిన్మహారాజుకు శుకయోగి ప్రవచించిన భాగవతాన్ని నైమిశారణ్యంలో సూతుడు సత్రయాగ సందర్భంగా శౌనకాది మహర్షులకు వినిపిస్తున్నాడు.. ‘నభగస్యాపత్యం నాభాగః’- నభగ పుత్రుడైన నాభాగుని ఉత్తమ ధార్మిక సంస్కారాలన్నీ అతని ఆత్మజుడు అంబరీషునికి అబ్బినాయి. మణిమాణిక్యాలను, మట్టిపెళ్లలనూ సమంగా చూచే పరమవైరాగ్య సంపన్నుడైన ఆ రాజమణి వీర భోజ్యమైన రాజ్య సంపదను కలలోని కలిమిగా, మూణ్నాళ్ల ముచ్చటగా, ఎప్పటికైనా ఆరిపోయే దీపంగానూ భావించాడు. చిత్తం భగవదాయత్తం చేసి విద్యుక్త ధర్మమైన ఉత్తమ రాజ్యపాలనను విడువక సాగిస్తూ ఆ రాజసత్తముడు రాజర్షిగా విరాజిల్లాడు. ఇలా తపోయుక్త భక్తి యోగం, స్వధర్మానుష్ఠానం వలన పరమాత్మ ప్రసన్నుడవగా అంబరీషుడు అన్ని ఆసక్తులను అధిగమించాడు. భక్తరక్షణ దీక్షా దక్షుడైన అధోక్షజుడు ప్రతిపక్షు (శత్రువు)లను శిక్షించి, ఆత్మీయులను రక్షించే అవక్ర (అడ్డులేని)మైన సుదర్శన చక్రాన్ని ఆ రాజర్షి రక్షణకై నియోగించాడు.
శుక ఉవాచ- రాజా! అంబరీషుడు పత్నీ సమేతంగా ఒక సంవత్సర కాలం ఏకాదశీ (ద్వాదశీ) వ్రతం ఆచరించాడు. వ్రతం పూర్తి కాగా కార్తిక మాసంలో మూడు రాత్రులు (దశమి, ఏకాదశి, ద్వాదశి) ఉపవాసమున్నాడు. ద్వాదశి ఉదయం దామోదరుని అర్చించి వైదిక బ్రాహ్మణులకు విరివిగా గోదానాలిచ్చి, షడ్రసోపేతంగా సంతర్పణ గావించి తాను పారణ- భోజనం చేయడానికి పూనుకున్నాడు. ఆ సమయంలో అతిథిగా అరుదెంచిన దుర్వాస మహర్షిని, భవ్యకవితావేశుడు, అపర వ్యాసుడు పోతన అమాత్యుడు ఈ కంద పద్యంలో అందంగా వర్ణించి మన ముందు నిలిపాడు..
కం॥ ‘భాసుర నిగమ పదోప
న్యాసుఁడు సుతపోవిలాసుఁ డనుపమ యోగా
భ్యాసుఁడు రవిభాసుఁడు దు
ర్వాసుఁడతిథి యయ్యెఁ దన్నివాసంబునకున్’
వేదాలను పుక్కిట పట్టినవాడు, మహా తపస్సంపన్నుడు, నిరుపమ (సాటిలేని) యోగాభ్యాస నిపుణుడు, ప్రభాకరుని వలె ప్రకర్షంగా ప్రకాశించువాడు అయిన దుర్వాసుడు అతని నివాసానికి విచ్చేశాడు. అచ్యుతుడే ఆ రూపంలో వచ్చాడని అంబరీషుడు అమందానందం పొందాడు. పాదాలు ప్రక్షాళించి, పూజించి తన మందిరంలో ప్రసాదం (భోజనం) స్వీకరించి తనను కృతార్థుని చేయవలసిందిగా ప్రార్థించాడు పృథివీపతి. మోదంతో ఆమోదం తెలిపి యమునకు స్నానానికి వెళ్లాడు మహర్షి. అక్కడ ధ్యానం చేస్తూ కూర్చుని రాకుండా జాగు చేశాడు. అప్పటికి గడియ మాత్రమే మిగిలి ఉన్న ద్వాదశి తిథిలోనే పారణ చేయాల్సి ఉంటుంది. తిథి దాటితే వ్రత భంగం. అతిథిని విడిచి తింటే అధర్మం. పెద్ద ధర్మ సంకటం! వైధీ భక్తునికి గొప్ప బాధే వచ్చి పడ్డది- తినరాదు, తినకుండా ఉండరాదు. ఏం చేయాలో బోధపడలేదు. ధర్మం చెప్పండని మర్మం తెలిసిన బుధు(పండితు)లను ప్రార్థించాడు. ‘ప్రభూ! తీర్థపాదుడు పురుషోత్తముని పవిత్ర పాదతీర్థం పుచ్చుకోండి. అది తినినట్లూ కాదు, తిననట్లూ కాదు. ఇది ధర్మ సమ్మతం. వ్రతం సుసంపన్నం అవుతుంది’ అని ఆపద్ధర్మం తెలిపారు ధర్మజ్ఞులు. రాజర్షి దానవారి వాసుదేవుని స్మరిస్తూ వారి (తీర్థజల) పారణ చేసి దుర్వాసుని రాకకై ఎదురు చూచాడు. మరలి వచ్చిన మహర్షి మనోయోగంతో విషయం గ్రహించాడు. అది తనకు అపచారం అనిపించింది. అసలే రుద్రాంశ, ముక్కోపి. ఆగ్రహోదగ్రుడయ్యాడు. కనుబొమలు ముడిపడ్డాయి. కోపంతో కాయం- శరీరం కంపించింది. కరకరలాడే ఆకలి మీద ఉన్నాడేమో కొరకొర చూస్తూ ‘ఐశ్వర్యంలో కన్నుమిన్నూ కానని ఈ పాతకుణ్ని, మీరు కన్నారు గదా! నన్ను అన్నానికి ఆహ్వానించి, తాను ముందుగానే ఆరగించి కూర్చున్న మందుడు వీడు. నా ముందు వీడు ఎందుకు పనికొస్తాడో ఇప్పుడే లోకానికి కనువిందు కావిస్తా’ అంటూ మండిపడి పెటపెటా పండ్లు కొరుకుతూ, కండ్ల నుంచి నిప్పులు రాలుతుండగా, సిగలోని ఒక జడను పీకి పగతో కృత్య (భూతకి)ను సృష్టించి, అకృత్యం చేశాడని రాజుపై ప్రయోగించాడు. అది అమాంతంగా అంబరీషుని మీదికి దూకింది. ఆయన అడుగు కూడా కదల్చక, అబ్బురపడక నిబ్బరంగా నిలబడే ఉన్నాడు. వెంటనే సుదర్శన చక్రం కృత్యను సాంతం దహించి మంటలు చిమ్ముతూ మునిని వెంబడించింది, వెంటాడింది. ఎలాగ? మంటలు మహర్షిని అంటకుండా!
ప్రాణభయంతో పరుగులు తీస్తూ దుర్వాసుడు త్రాణ (రక్షణ) కొరకు బ్రహ్మలోకం చేరి విరించి (బ్రహ్మ)ని వరించి, వందించి చక్రాన్ని వారించమని వేడాడు. ‘చక్రజ్వాలలకు అడ్డుపడ కలిగిన వక్రబుద్ధి శక్రా (ఇంద్రా)దులలో కూడా ఎవడూ లేడే!’ అంటూ చతురాననుడు చేతులెత్తేసి చక్కగా పక్కకు తప్పుకొన్నాడు. నిరాశ చెంది దుర్వాసుడు శర్వాలయా (కైలాసా)నికి వెళ్లి కృత్తివాసుని (శివుని) ప్రపత్తి చేసి విపత్తు నుంచి కాపాడమని నెత్తినోరు బాదుకున్నాడు. వాసుదేవునికి చక్రమిచ్చింది వామదేవుడేగా! చక్రరూపంగా ఉన్నది శివుడే కదా! ‘నీవెంట పడ్డవాణ్ని నేనే అయినప్పుడు నిన్ను కాపాడటం ఎలా సంభవం?’ అని మనసులో భావించి భవుడు- శివుడు ‘మునీంద్రా! మురారి చక్రాన్ని మరలించే శక్తి నాకు లేదు. నీవు ఆ మహాత్మునే ఆశ్రయించు, నీకు మేలు చేస్తాడు’ అని బోధించాడు. దుర్వాసుడు వైకుంఠానికి వచ్చి ‘వరదా! వాసుదేవా! నీ దాసునికి ద్రోహం తలపెట్టిన దురాత్ముణ్ని. నన్ను దయతో కాపాడు’ అంటూ మొరపెట్టుతూ, మ్రొక్కి బెట్టుపోకుండా పాదాలను వదలకుండా గట్టిగా పట్టుకున్నాడు. అచ్యుతుడు ఇలా అన్నాడు…
చ॥‘చలమున బుద్ధిమంతులగు సాధులు నా హృదయంబు లీల దొం
గిలి కొనిపోవుచుండుదు రకిల్బిషభక్తి లతాచయంబుల
న్నిలువగఁ బట్టి కట్టుదురు నేరుపుతో మదకుంభి కైవడిన్
వలలకుఁ జిక్కి భక్తజన వత్సలతన్ జనుచుందుఁ దాపసా!
‘ఓ తాపసోత్తమా! బుద్ధిమంతులైన సాధుసంతులు పట్టుదల పూని హృదయాన్ని అవలీలగా కొల్లగొట్టి పట్టుకుపోతూ ఉంటారు. మహర్షీ! మదించిన ఏనుగును బంధించినట్లుగా పాపరహితమైన నిష్కామ భక్తి అనే తీగలతో నేర్పుగా నన్ను నిలబెట్టి కట్టి పడేస్తారు. ఆ ప్రేమ బంధానికి చిక్కిన నేను భక్తుల మీది వాత్సల్యంతో వారిని వదిలి వెళ్లలేక వారి ఎదలోనే ముదమారగ వసిస్తా. మునీంద్రా! నా మేలు కోరడమే నా భక్తుని పని! అట్టి అనన్య భక్తులకు నేనే పరమగతిని. ఆవు వెంటపడే దూడలాగా నేను భక్తుని అంటిపెట్టుకొని ఉంటాను, వెంట వెళ్తాను. అదీకాక, తన దేహం మీద, గేహం మీద, జీవితం మీద, తనయుల, చుట్టాల, ఆలి, సంపదాలి (ఆస్తుల) మీద ఆసక్తి కట్టిపెట్టి, నన్ను తప్ప అన్యం ఎరుగనట్టి ఎట్టివారినైనా నేను విడిచిపెట్టను. పతివ్రతలు ఉత్తముడైన భర్తను వశపరచుకొన్నట్లు- ఇంటా బయటా అంటిపెట్టుకొని ఉన్నట్లు, పుణ్యాత్ములు పంచ జ్ఞానేంద్రియ మార్గాలను అరికట్టి, నా మీది వలపుతో నన్నే నిరంతరం తలపులలో నిలుపుకొంటారు.
కం॥ ‘సాధుల హృదయము నాయది
సాధుల హృదయంబు నేను, జగముల నెల్లన్
సాధుల సేవ యెరుంగుదు
సాధులెరుంగుదురు నాదు చరితము విప్రా’
భూసురోత్తమా! సాధువుల (భక్తుల) హృదయాలన్నీ నాలోనే భాసురంగా (ప్రకాశిస్తూ) ఉంటాయి. నేను వారి హృదయాలలో భాసమానంగా ఉంటాను. వారి సంగతి నాకు తెలుసు, నా చరిత్ర ఏమిటో వారికి తెలుసు. మునివరా! సాధు సత్పురుషుల్లో నా తేజస్సు అధికంగా ఉంటుంది. వారిని బాధపెట్టేవారికి అది హేతి- ఆయుధంగా, భీతిని- బాధను కలిగిస్తుంది. అట్టివారికి ఏ రీతిగా కూడా చేతోమోదం- మానసిక సుఖశాంతులు లేకుండా చేస్తుంది. ఓ బ్రాహ్మణుడా! వెళ్లు. ఆ అంబరీషుణ్నే శరణువేడు. అతనే అభయమిస్తాడు’. మూలంలో- ‘అహం భక్త పరాధీనః అస్వతంత్రః భక్త జనప్రియః’- (నేను భక్తులకు వశపడి ఉంటాను. వారి విషయంలో నాకు స్వాతంత్య్రం లేదు. నాకు భక్తులు అత్యంత ప్రియులు) అని ఉండగా, తెలుగు పద్యాలలో- సాధులు నా హృదయంబు లీల దొంగిలికొని పోవుట, మదకుంభి కైవడి భక్తిలతా చయంబుల నిలువగబెట్టి కట్టుట, గోవు వెంటఁ దగులు కోడె భంగి’- ఇవి పోతన్న గారు దిద్దిన వన్నెలు. ఇంపైన మేళవింపులు.
(సశేషం)
తంగిరాల రాజేంద్రప్రసాద శర్మ
98668 36006