పాల సముద్ర మథనం కోలాహలంగా ప్రారంభమైంది. అడుగున కుదురు లేనందున కడుబరువైన కొండ కడలిలో బుడబుడమంటూ మునిగిపోతుంది. అప్పుడు వాసుకి ‘విడవండి విడవండి’ అంటూ గట్టిగా అరిచాడు. కవ్వపు ముంపును చూసి దేవదానవుల గుంపు గడగడ వడకింది.
శుక ఉవాచ- ఓ రాజా! ఓపలేని సురాసురులు ఎంత ప్రయత్నించినా పర్వతాన్ని మరలా పైకి లేపలేకపోయారు. సిగ్గుతో తల దించుకున్నారు. బడలికతో కడలి గట్టుపై కూలబడి మిక్కిలి బాధపడ్డారు. ప్రబలమైన విధిని అధిగమించడంలో ఎవ్వరైనా అబలులే కదా! సాగర జాలాలలో దిగిపోతున్న మందరగిరిని చూసి అందరూ ఆవేదన చెందడం ఇందిరావరుడు అవలోకించాడు. అజితుడు అనుకూలుడై వారిపై కూరిమి- ప్రేమ కురిపిస్తూ వారి సమక్షంలోనే మహాకూర్మం (లక్ష ఆమడల వెడల్పయిన కఠిన కర్పరం (వీపుడిప్ప గల)గా మారిపోయాడు. పయోధి (సాగరం)లో ప్రవేశించాడు. అ కచ్ఛప (తాబేలు) రూపంలో వాసుకితోపాటు మందర పర్వతాన్ని చిన్న ముత్తెపు చిప్పవలె తొందరగా పైకెత్తాడు. దానిని చూచి అమరులు ఆశ్చర్యంలో తలలు ఊపుతూ అవని ఆకాశాలు ప్రతిధ్వనించేలా ‘ఆహా! బాగుబాగు! అజితా! నీవే మాకు శరణు!’ అంటూ జేజేలు పలికారు.
కం॥ ‘తరిగాండ్రలోన నీకఁడఁట
తరి కడవకుఁ గుదురు నాఁక త్రాడఁట చేరుల్
దరి గవ్వంబును దానఁట
హరిహరి! హరి చిత్రలీల హరియే యెరుగున్’
పరీక్షిన్మహారాజా! ఇలా విష్ణువు కడలిని చిలికే వారిలో ఒకడయ్యాడు. కడలి అనే కడవకు కుదురయ్యాడు. తరచే కవ్వం, దానికి చుట్టిన తాడుకూడా తానే అయ్యాడు. ఆహా! ముదావహమైన హరి విచిత్రలీలలు సదా ఆ హరికి మాత్రమే ఎరుక కదా! ఇట్లు క్షీరసాగరం మథించి సిరిని, సుధను సాధించడం శ్రీవల్లభునికి తప్ప ఎవరికి సాధ్యం? గీర్వాణు (దేవత)లందరూ గొల్లలై చల్లగా కడలి చిలికారు. గరుడవాహనుడు సైతం గొల్ల అయ్యాడు!
సురాసురులు సాగరాన్ని తరుస్తున్నారు. మందరం బొంగరంలాగా గిరగిరా తిరుగుతున్నది. భయంకరమైన ఆ శబ్దం బ్రహ్మాండమంతా నిండింది. చతురాననుని చెవులు గింగురుమన్నాయి. రాజా! అంతతొందరగా తిరుగుతున్న మందర మంథానం (కవ్వం) వలన కలిగే రాపిడి కూడా కూర్మరాజు వీపు తీటకు దీటుగా సమాధానం చెప్పలేకపోయింది. ఇలా చిలుకుతుండగా అల్లకల్లోలమైన పాలవెల్లిలో నుంచి అగ్నిజ్వాలల వెల్లువతో కూడిన హాలాహలమనే మహావిషం పుట్టింది. అదిచూచి వెరచి దేవదానవులు వాసుకిని వదిలి వేగంగా పరుగులెత్తారు. ఆ కాలకూటం అంబరానికి పొంగింది. పాతాళం దాకా కూడా పాకింది. అకాల ప్రళయం వచ్చిపడినట్లయింది. దితి, అదితి పుత్రులు అతలాకుతలమై మతి చెడి వేరుగతి కానక సతీసమేతుడైన కైలాసపతిని నతి (నమస్కార) పూర్వకంగా స్తుతిస్తూ శరణాగతి చేశారు.
‘ఫాలలోచనా! కపాలీ! పాలకడలిని చిలుకగా లోకాలను హడలెత్తించే- మింగివేసే హాలాహలం పుట్టింది. శంకరా! ఈ సంకటాన్ని తొలగించడం నీకే సాధ్యం. ఆ విషజ్వాలను అవలీలగా పరిగ్రహించి దయతో ప్రాణికోటిని అనుగ్రహించు’ అని అర్థించారు. ఆలకించిన ఆశుతోషుడు- బోళా శంకరుడు తన అనుంగు అర్ధాంగిని- లీలావినోదిని అయిన బాలామణిని అంగీకారం కొరకై అవలోకించి ఇలా అన్నాడు- ‘ప్రాణేశ్వరీ! ప్రాణభయంతో ప్రపన్నులైన ప్రాణులను పరిరక్షించడం ప్రభువుల కర్తవ్యం. పరహితమే పరమ ధర్మం. ప్రియా! పరోపకారి అయిన పురుషుని పట్ల పురుషోత్తముడు పూర్ణంగా ప్రసన్నుడవుతాడు. కాన, ఓ పద్మముఖీ! మధురాతి మధురమైన మాకంద ఫలరసం వలె ఈ విషాన్ని ఆరగించి లోకులందరినీ ఆనందపరుస్తా.’ ఆమె మాత్రం తక్కువా, మక్కువతో అలాగే ‘కానివ్వండి’ అన్నది.
ఈ ప్రసంగంలో మహాకవి పోతన సందర్భశుద్ధి శోభిల్లగా లోకసహజమైన స్వభావానికి అద్దంపడుతూ శుక-పరీక్షిత్తు ప్రశ్నోత్తర రూపంగా అమూలకాలైన రెండు అమూల్య పద్య పారిజాతాలను సద్యఃస్ఫూర్తితో హృద్యంగా పరిమళింపజేశాడు. పరీక్షిత్తు ప్రశ్నించాడు..
మ॥ అమరన్ లోకహితార్థమంచు నభవుండౌఁ గాక యం చాడెఁబో
యమరుల్ భీతిని మ్రింగవే యనిరి వో యంభోజ గర్భాదులుం
దముఁ గావన్ హర! లెమ్ము లెమ్మనిరి వో తాఁజూచి కన్గంట న
య్యుమ ప్రాణేశ్వరునెట్లు మ్రింగుమనె నయ్యుగ్రానల జ్వాలలన్
‘పరమర్షీ! విశ్వానికి మేలు కలుగుతుంది కదా అని భావించి విరూపాక్షుడు విషం ఆరగించడానికి ఆనందంగా అంగీకరించాడే అనుకో! ప్రాణభయంతో గీర్వాణ బృందం వంగివంగి- ఓ గంగాధరా! గరళాన్ని ‘మింగు మింగు’ అని అర్థించిందే అనుకో! పితామహా (బ్రహ్మా)దులు ‘ఓ పశుపతీ! ఉపేక్షించక మమ్ములను పరిరక్షించు’ అని ప్రార్థించారే పో! హాలాహలాన్ని తాను ప్రత్యక్షంగా చూస్తూ కూడా ఆ సతీమతల్లి హైమవతి అతి ఉగ్రమైన ఆ అగ్నిజ్వాలా సంహతి (సమూహం)ని కటువని భావించక భక్షించుమని నిటలాక్షునితో ఎటుల చెప్పింది? శుకముని శిష్యునికి ఇలా సెలవిచ్చాడు…
కం॥ ‘మ్రింగెడు వాడు విభుండని
మ్రింగెడిదియు గరళమనియు మేలని ప్రజకున్
మ్రింగుమనె సర్వమంగళ
మంగళ సూత్రంబు నెంత మది నమ్మినదో!’
‘మహారాజా! మ్రింగేవాడు తన విభుడు విశ్వనాథుడని, మ్రింగేది విషమని తెలిసి కూడా, దాని వలన విశ్వానికి మేలు కలుగుతుందనే విశాల భావంతోనే విశాలాక్షి విషాన్ని మ్రింగుమని పలికింది. సర్వమంగళ తన మంగళసూత్రాన్ని అంతరంగంలో ఎంతగా నమ్మిందో కదా!’ ‘యశ్శివో నామ రూపాభ్యాం’- ఎవని పవిత్రనామమూ, దివ్య రూపమూ- రెండూ పరమ మంగళప్రదాలో అట్టి మహేశుడు కట్టిన మంగళ సూత్రం తన గళం-మెడలోనిది! ‘యాదేవీ సర్వమంగళా’- మరి తానో! సర్వమంగళ స్వరూపిణి! పరమశివుని స్వభావ ప్రభావాలు సర్వమంగళకు తెలియనివి కావు. స్వభావం కారుణ్యం! ‘కర్పూర గౌరం కరుణావతారం’- మూర్తీభవించిన కరుణ. మరి ప్రభావం? అది అనితరం, అనిర్వాచ్యం! త్రిపురాంతకుడు కామాంతకుడు, కాలాంతకుడు కూడా. కాముని కంటితో కాల్చివేసినవాడు, కాలుని కాలితో కూల్చివేసినవాడు! కనుక, చిదానందుడు, సదాశివుడు విషం తాగినా అది ఆయనకు సుధాపానమే! మంగళగౌరికి ముదావహమే! అందుకే ‘మ్రింగుమనె సర్వమంగళ’! (సశేషం)
తంగిరాల రాజేంద్రప్రసాద శర్మ
98668 36006