Cinthana | ‘గోవల్లభుడ నేను, గోవులు మీరు’… వేదాంత పరంగా అహం (నేను) పదానికి పరబ్రహ్మ అని అర్థం. ‘అహం బ్రహ్మాస్మి’- ‘నేనే పరబ్రహ్మని’ అనే ఈ విజ్ఞానం లేని అజ్ఞానులైన మీరందరూ గోవులు- పశువులు. నేను గోవల్లభుడను- పశుపతిని అని పరమాత్ముని ఉద్ఘోష- చాటింపు! అహంకారం- ‘దేహమే నేను’ అన్న అభిమానం కల జీవుడే పశువు. ఆ అహంకారం నశిస్తే పశుపతి. అవిద్యా (అజ్ఞాన) పాశబద్ధుడు కదా జీవుడు. పాశముక్తుడు సదాశివుడు. ఊక (అజ్ఞాన ఆవరణ)తో ఆవరింపబడి ఉంటే వడ్ల గింజ. ఊక- పొట్టు తొలగిపోతే బియ్యపు గింజ. ఊక ఉన్నంతవరకు జీవునికి రాకపోకల- జన్మమరణాల కాక (తాపం) తప్పదు. పైపొట్టు పోతే ఇక పుట్టుట, గిట్టుట లేవు.
‘రాజు నే, భటులు మీరలు’.. ‘సర్వం ఖల్విదం బ్రహ్మ’- అంతా నిశ్చితంగా బ్రహ్మమే అయితే ‘రాజు- భటులు’ అన్న భేదం ఎందుకు చెప్పినట్టు? అంటే సత్తు అసత్తు, ఉచ్చం నీచం అంతా తానే కాన తన విలాసం (ఆత్మరతి)- వినోదం కొరకే ఈ భేద కల్పన! అభేదాన్ని- ఏకత్వాన్ని దర్శించడమే జ్ఞానం. అదే పరమార్థం. అయినా భజనం- ఉపాసన కొరకు భేద కల్పన. భక్తి కోసం కల్పితమైన ద్వైతం- జీవ ఈశ్వర భేదం అద్వైతం కన్నా ఎంతో సుందరమనీ, ఆ భక్తి వలన కలిగే ఆనందం మోక్షానందం కంటే వందల రెట్లు అధికమని మనీషుల- పరమ భాగవతుల అనుభవం! ‘నేఁదస్కరుండ, మీరింటివారు’.. పరమాత్మ పశుపతియే కాక శ్రేయస్కరుడైన తస్కరపతి కూడా! ఏమిటీ ఆయన తస్కరించేది? అంటే, తనను నిరంతరం స్మరించే భక్తుల అనేక జన్మల పాప సమూహాన్ని- సంచిత పాపాన్ని హరిస్తాడు.
అజ్ఞానమనే మొద్దు నిద్దురలో మునిగి ఉన్నట్లయితే, నీలో దాగి ఉన్న పెచ్చరిల్లిన కామ, క్రోధ, లోభాలనే దొంగల రూపంలో నేనే (జ్ఞాన అజ్ఞానాలు రెండూ తానే కనుక) నీ జ్ఞానమనే అమూల్య రత్నాన్ని అపహరిస్తానని కూడా హెచ్చరిక! ‘నేను సూత్రధారిని’.. ‘సూత్రేమణిగణా ఇవ’ (గీత)- ఈ నామ రూపాత్మక చరాచర వస్తువులన్నీ దారంలో పలు విధాల పూసల వలె వాస్తవానికి నాయందు గుచ్చబడి ఉన్నాయి. ‘సర్వాధారో నిరాధారః’- నేనే అంతటికీ ఆధారం. నాకు ఏ ఆధారంతోనూ అగత్యం లేదు. అన్ని మణులకూ దారమే ఆధారం. చిన్మయ దేవుడనే వాడు ఉంటేనే కదా మృణ్మయ ప్రాణుల నాటకాలు, పాత్రలు, అభినయాలు!
శుక ఉవాచ- రాజా! ఆ నల్లవాడు బాలకులెల్లవారిలో అల్లరి పిల్లవాడుగా అనిపిస్తున్నా మంచివాడే కాని కల్లరి- అసత్యవాది, వంచకుడు కాదు. దొంగగా కనిపిస్తున్నా ఆ గంగాతరంగ ధవళాంగుడు, శుభాంగుడు దయాంతరంగుడే! ఆ బాలగోపాలుని చౌర్యక్రీడలన్నీ భక్త ఔదార్య భరిత చిన్మయ లీలలే! మూల భాగవతంలో కేవలం నాలుగు శ్లోకాలలో ఉన్న బాలక్రీడా వర్ణనను స్వకపోల కల్పితంగా వేదాంతార్థ కలితంగా, పదునాలుగు కందాలలో లలితంగా విస్తరించి అందంగా పొందుపరచాడు అపరభక్తి కవితా విరించి పోతన!
రాజా! నిత్యమూ అందెల రవళులతో చిందులు తొక్కుచూ కనువిందు చేసే బాల ముకుందుడు ఒకనాడు మంద (గోకులం)లో ఏ కుందరదన (గోపిక)కీ కనిపించలేదు. ఆ ఆనందానికి నోచుకోని గోపికలందరూ ఏమీ తోచక ఓపికలు కోల్పోయి, నందగృహానికి వచ్చి ఆ చిన్నారి చిలిపి చేష్టలకు తట్టుకోలేక పోతున్నామని కోపం నటిస్తూ తల్లి యశోదతో ఇలా మొరపెట్టుకున్నారు..
కం॥ ‘బాలురకుఁబాలు లేవని
బాలెంతలు మొరలు వెట్టఁ బకపక నగి యీ
బాలుండాలము సేయుచు
నాలకుఁగ్రేపులను విడిచె నంభోజాక్షీ!’
అమ్మా యశోదా! మా ఇళ్లలో పసివాళ్లకు పాలు చాలటం లేదని బాలెంతలు ఎంతగా గోల పెడుతున్నా వారి మొరలు ఆలకించక నీ తుంటరి పిల్లడు పకపక నవ్వుతూ, వెక్కిరిస్తూ లేగ దూడల తాళ్లు విప్పి తల్లుల వద్దకు వదిలేస్తున్నాడు.
కం॥ ‘పడతీ! నీ బిడ్డడు మా
కడవలలో నున్న మంచి కాఁగిన పాలా
పడుచులకుఁ బోసి చిక్కిన
కడవలఁబోనడిచె నాజ్ఞ కలదోలేదో!’
పడతీ!- ఓ యమ్మా! కడవలలో ఉన్న చక్కగా కాగిన పాలను నీ బాలుడు తోడి పిల్లలచే తాగించాడు. సరే, అంతటితో ఊరుకున్నాడా? ఆ కడవలన్నీ పగులకొట్టాడు. చూడగా అతనిపై నీకు అదుపు ఆజ్ఞ ఉన్న జాడ ఏమాత్రం కనిపించడం లేదు. ఓ నందగోప కాంతా! ఈ వింత చూడు. నీ చిన్నవాడు నిన్నకాక మొన్న పుట్టాడో లేదో, అప్పుడే దొంగతనాలు మొదలుపెట్టాడు. అవికూడా మామూలువి కాదు. మా ఇళ్లలో జొరబడి ఉట్లు అందకపోతే వాటి కింద రాళ్లు, పీటలు దొంతరలుగా పేర్చి, ఓ ఇందుముఖీ! అందుకునే ప్రయత్నం చేశాడు. ఇలా చేస్తాడనే మేము ఉట్లను ఇంకా ఎత్తుగా కట్టుకొన్నాము. చేతితో పట్టలేక మీవాడు ఎట్టకేలకు కిందనుంచే కుండకు పెద్ద చిల్లి పెట్టి మీగడపాలు దోసిళ్లలో పట్టి తాగాడు. ఓ తలోదరీ!- ఇంత సన్నని కడుపు కలదానా! అంతపెద్ద పొట్టగల పట్టి (కొడుకు)ని ఎట్లా కన్నావమ్మా? తల్లీ! నీ పుత్రుడు వీరింట్లో జొరబడి పెరుగంతా తిని పోతూపోతూ నిద్రపోతున్న ఇంటి కోడలి మూతికి కొద్దిగా పెరుగు అద్ది వెళ్లాడు. ఒసేయ్ నంగనాచీ! దొంగతిండి తింటావా అని కోడలిని అత్తగారు కొట్టింది. ముద్దరాలా! నీ ముద్దుల కొమరుడు ఒక ఇంట్లో చేరి ఘుమఘుమలాడుతున్న ఘృతాన్ని- నేతిని చక్కగా తాగి ఆ కడవలను పక్క ఇంటిలో పడవేసి పోయాడు. తరువాత వీరికి వారికి పెద్ద తగాదా అయింది. తెలుసా తల్లీ! మరో గోపిక…
కం॥ ‘వేలుపులటె నా కంటెను
వేలుపు మరి యెవ్వఁడనుచు వికవికనగి మా
వేలుపుల గోడపై నో
హేలావతి! నీ తనూజు డెంగిలిఁజేసెన్’
మా ఇంటి పూజామందిరపు గోడలపై ఉన్న దేవుళ్ల చిత్రపటాలను చూసి నీ కొడుకు- ‘వీరా మీ దేవతలు? నా కంటే వేరే దేవత ఎవడైనా ఉన్నాడా? అని వెటకారంగా- వెక్కిరింతగా నవ్వుతూ వాటిపై ఉమ్మివేసి వెళ్లాడమ్మా!- భాగవత సిద్ధాంత రీత్యా ఇతర దేవతలందరూ శ్రీకృష్ణుని అంశావతారాలు. శ్రీకృష్ణుడు మాత్రం సాక్షాత్ భగవంతుడు- ‘కృష్ణస్తు భగవాన్ స్వయం’. ఆయన జగద్గురువు. జ్ఞానులు పరమాత్మని తమ ఆత్మలోనే దర్శిస్తారు తప్ప ప్రతిమలో కాదు- ‘శివోదేహే ప్రతిష్ఠితః’ అజ్ఞానులకు భావ నిశ్చలత- మనో నిగ్రహానికి విగ్రహాలు కల్పించబడ్డాయి. ‘యాన్తి దేవవ్రతా దేవాన్’ (గీత 9-25)- దేవతా పూజకులు- సత్తగుణం కలవారు దేవతలను, పితృదేవతల ఆరాధకులు- రాజసికులు పితృలోకాలను, భూత పూజకులు- తమోగుణ ప్రధానులు భూతలోకాలను పొందుతారు. అర్జునా! నా భక్తులు మాత్రం నన్నే చేరుతారు. అనగా త్రిగుణాతీతుడైన పరమాత్మను ఉపాసించువారు గుణాతీత బ్రహ్మపదవినే పొందుతారు. అన్యదేవతారాధకులకు కూడా ఆయా దేవతల రూపంలో ఫలమిచ్చేది ఆ సర్వదేవతా స్వరూపుడైన శ్రీకృష్ణపరమాత్మే!
వేరొక వనిత… ఆడుకొనే బంతి మా పెరట్లో పడిందని నీ సుపుత్రుడు మా దొడ్డి లోపలికి వచ్చి మా చిన్నది జలకమాడుతుంటే దాని వలువ- చీర తీసుకొని పారిపోయాడు. చెలువా! ఇదేమైనా బాగుందా? ‘అజ్ఞానేనా వృతం జ్ఞానం తేన ముహ్యన్తి జన్తవః’ (గీత) ఆత్మ స్వరూపాన్ని అవగతం కానీయక- తెలియనీయక ఆవరించే అజ్ఞానమనే ఆవరణాన్ని- వస్ర్తాన్ని అపహరించి అనుగ్రహం చూపాడని లీలా పరమార్థం! రాగల వస్ర్తాపహరణ లీలకు ఇది నాందీ ప్రస్తావన- సూచన. ఇంకొక వ్రేత.. ఎర్రగా బొర్రగా ఉన్న మా కుర్రదాన్ని చూచి మీ కర్రివాడు- ‘నిన్ను దొంగతనంగా లేవదీసుకుపోతా, నాతో వస్తావా?’ అని అడిగాడట! ఓ వెర్రితల్లీ! ‘చిత్రమిట్టిది గలదే?’- ఇలాంటి చిత్రం ఎక్కడైనా చూశామా?- ఎవ్వరికీ తెలియకుండా నిన్ను ఆవరణ, విక్షేపాదులను దాటించి నా పరంధామానికి- మోక్షస్థానానికి గొనిపోతాను, రమ్మని పలికాడు. ఇదీ పరమార్థం! సాక్షాత్ మహాలక్ష్మీ స్వరూపురాలైన రుక్మిణీదేవి కూడా… ‘కృష్ణ! పురుషోత్తమ! చేకొని పొమ్ము వచ్చెదన్’ (నువ్వు అంగీకరిస్తే నీవెంట రావడానికి సిద్ధంగా ఉన్నా) అని పరమాత్మకు ప్రణయ సందేశం పంపింది కదా!
కం॥ ‘కొడుకులు లేరని యొకసతి
గడు వగవగఁ దన్ను మగనిగా గైకొనినన్
గొడుకులు గలిగెదరని పైఁ
బడినాడిది వినుము శిశువు పనులే తల్లీ!’
ఇదిగో తల్లీ! మరో విచిత్రం విను. ఒక మగువ నీ సుతుని చూచి, తనకు కొడుకులు లేరని వగవగా- బాధపడగా ‘నన్ను మగడుగా చేసుకొంటే నీకు బిడ్డలు పుడతారు’ అంటూ మీదిమీదికి వచ్చాడు నీ గడుసరి కొడుకు. ఇవి పసివాని పనులేనా?… సంతాన ప్రాప్తికి కూడా అంతిమంగా అనంతుని- పరమాత్ముని అనుగ్రహమే కారణం కదా! విష్ణు సహస్రనామ స్తోత్రంలో విష్ణుమూర్తికి వంశవర్ధనుడని, తంతు (సంతాన) వర్ధనుడని నామాలు. ‘గతిః భర్తా ప్రభుః సాక్షీ’ అని భగవద్గీత. సతులందరి పతులకు ‘పతి గతి’ కదా పరమాత్మ. ‘నీవే నా పతియు గతియు నిజముగ కృష్ణా’ అనేకదా తెలుగువారి దైనందిన ప్రార్థనా పద్యం!
(సశేషం)
– తంగిరాల రాజేంద్రప్రసాద శర్మ 98668 36006