Sankranti Special | ఎవరమ్మా నువ్వు? ఎందుకా సంబురం? ఈ చలిలో ఇంత పెందరాలే ఎక్కడికి బయల్దేరావు? అన్నిటికీ చిన్నగా నవ్వి ఊరుకుంటావేం! ఇంతకీ ఎవరింటికి వెళ్తున్నావ్? ‘మీ ఆనందమే నా పరిచయం’ ‘ఇంటింటా రాశులుగా పోసిన ధాన్యమే నా రూపం’ ‘వాకిట రంగవల్లులు తీర్చిదిద్దిన ప్రతి లోగిలికీ వెళ్తా. పసుపు రాసిన ప్రతి గడపనూ పలకరిస్తా. కష్టాన్ని నమ్ముకున్న ప్రతి మనిషినీ అనుగ్రహిస్తా.. నా పేరు సంక్రాంతి లక్ష్మి.. పుష్య లక్ష్మి’
రావమ్మ మహాలక్ష్మి రావమ్మ..
నీ కోవెల మా ఇల్లు కొలువై ఉందువు గానీ..
హరిదాసు సుతిమెత్తగా గళమెత్తి తనను కీర్తిస్తుంటే.. మహాలక్ష్మి ఎందుకు రాదు! చిరతల తాళానికి తగ్గట్టుగా చిద్విలాసం చిందిస్తూ ఆయన ఆగిన ముంగిట ముచ్చట గొలుపుతూ నిల్చుంటుంది అమ్మ. ఆ ఇంటి ఇల్లాలు దొడ్డ మనసుతో, ప్రశాంత వదనంతో, మోవిపై చిరునవ్వులు కురిపిస్తూ వచ్చి హరిదాసు నెత్తిన ఉన్న అక్షయ పాత్రలో గుప్పెడు ధాన్యం కుమ్మరిస్తే చాలు.. ఆ ఇంట నవనిధులూ అక్షయం అయ్యేలా వరమిస్తుంది సంక్రాంతి లక్ష్మి. ఎప్పుడు దానం చేసినా అంతకు పదింతలు కటాక్షిస్తుంది కల్పవల్లి. సంక్రాంతి పర్వదినం సందర్భంగా చేసే చిరు దానం కూడా అనంతమై అఖండ ఫలితాన్నిస్తుందని పెద్దల మాట. హరిదాసు ఆఖరిమాట ‘కృష్ణార్పణం’. భగవత్ కృపతో కలిగిన సంపదను తిరిగి ఆ దేవదేవుడికే సమర్పించడం మన సంప్రదాయం. మూడురోజుల సంక్రాంతి నేర్పేది ఇదే! నలుగురితో పంచుకోవడమే పండుగ పరమార్థం.
లక్ష్మమ్మా.. ఇటు చూడవమ్మా!!
మాయాలేదు.. మర్మం లేదు! అంతా కళే! కనికట్టు కళ. కట్టిపడేసే కళ. విప్రవినోదులు భళా! కండ్లప్పగించి చూస్తుండగానే రాయిని కప్పగా మార్చేస్తారు. నిమ్మ పండును దానిమ్మగా చేసేస్తారు. కాస్త ఘటికుడైన మాయలోడు అయితే టక్కుటమార విద్యలనూ ప్రదర్శించి నాలుగు కుంచెల ధాన్యాన్ని అదనపు బహుమతిగా పొందుతాడు. ఆనందాన్ని పంచే వినోదమూ లక్ష్మీరూపమే! ఇప్పుడు కనుమరుగైన విప్రవినోదులు ఒకప్పుడు పల్లెపల్లెలో చేసిన అల్లరి అంతాఇంతా కాదు! వీధులే మల్టీప్లెక్స్లు అయిన రోజులవి.
మా లచ్చమ్మా.. ఇది వినవమ్మా!
‘కంచి కామాక్షి పలుకు.. మదుర మీనాక్షి పలుకు..’ సంక్రాంతి వేళ ప్రత్యేక ఆకర్షణ ఎరుకల సోదమ్మ. చారెడు ధాన్యమిస్తే చాలు.. బారెడు భవిష్యత్తు చెప్పేస్తుంది. ముగ్గురమ్మలు ఒక్కటై పలికిస్తారో.. వంశపారంపర్యంగా వచ్చిన అనుభవమో తెలియదు కానీ, ఆమె మాట మన్నికైనది! పండక్కి పుట్టింటికి చేరిన ఆడబిడ్డలకు ఆమెతో మాటామంతీ ఓ ఆటవిడుపు. కలికి కడగంటిచూపులో తల్లిదండ్రులకు కనిపించని కన్నీటి ఛాయలను కనిపెట్టి.. ‘మొగుడు మంచోడె.. అమ్మమాట మీరడు.. ఆలి మాట వినడు..’ అని ఆ బిడ్డ కష్టాన్ని ఓ కంట పసిగట్టమని తండ్రికి కర్తవ్యం గుర్తు చేస్తుంది. అక్కడే సడ్డకులతో కాలక్షేపం చేస్తున్న ఆ ఇల్లాలి పెనిమిటికి పరోక్షంగా సుద్దులు చెబుతుంది. భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడానికి మహాలక్ష్మమ్మే సోదమ్మగా సాక్షాత్కరించిన వైనం ఇది.
డూడూ బసవన్నను తోలుకొని గంగిరెద్దు దాసరి వచ్చేది.. పాతపంచ ఇస్తారనే ఆశతోనే కావచ్చు! కానీ, పండుగ సరదా లక్ష్మిని పదింతలు పెంచడమే తన విధిగా భావిస్తాడు. డోలు, సన్నాయి వాద్యాలతో ‘అయ్యగారికి దండం పెట్టు.. అమ్మగారికి దండం పెట్టు’ అంటూ బసవన్నను ఆడిస్తూ ఇంటిల్లిపాదీ పండుగపూట నందీశ్వరుడి దర్శనం చేసుకునే అవకాశం కల్పిస్తాడు. గంగిరెద్దును ఆడించే అప్పన్న మాత్రం తక్కువా! సాక్షాత్తూ విష్ణుమూర్తి స్వరూపమే! పూర్వం గజాసురుడి పొట్టలో ఉన్న పరమేశ్వరుణ్ని బయటికి రప్పించడానికి శ్రీమహావిష్ణువు వేషం మార్చి, గంగిరెద్దుల మేళాన్ని కట్టి కథను రక్తికట్టించిన ఉదంతం తెలిసిందే కదా! ప్రతి కళలో తొణికిసలాడే శక్తి మహాలక్ష్మి అంశే! వాకిట్లో బసవడి నృత్యం ఆ ఇంట సిరులను కురిపిస్తుంది అనడంలో సందేహం అక్కర్లేదు.
‘అంబ పలుకు.. జగదంబ పలుకు..’ అని గొంతెత్తే బుడబుక్కల కళాకారుడు శకునపక్షి శాస్త్రంలో ఉద్దండ పండితుడు. కోడి కూసింది మొదలుకొని నింగిలో సూరీడు సురుక్కుమనే వరకు అతను పలికిందల్లా బంగారమే! అతను ఆడించే డమరుకం ధ్వని చెవిన పడినవారంతా లక్ష్మీ కటాక్షం పొందే అదృష్టవంతులే. ఒకటేమిటి సంక్రాంతి వేళ పల్లెపల్లెలో కనిపించే, వినిపించే కళారూపాలన్నీ పుష్య లక్ష్మి అనుగ్రహాలే! ఇన్ని సంబురాలు స్వాగతం పలుకుతూ ఉండగా.. పుష్య మాసంలో మహాలక్ష్మి ప్రతి ఇల్లూ తన పుట్టిల్లే అని భావించి కదిలివస్తుందని కవులు అభివర్ణించారు.
పల్లెపల్లెనూ పలకరించడానికి వచ్చిన సిరులతల్లిని కళలే కాదు.. కాలమూ సాదరంగా స్వాగతిస్తుంది. పచ్చికపై మంచు బిందువులు నిలిచి ముచ్చటగొలుపుతాయి. దారిపొడవునా చేమంతుల కేరింతలే! అల్లిబిల్లి లిల్లిపూలు పొగమంచు చూరి మత్తుగా కనిపిస్తాయి. పెరటి నేలంతా గమ్ముగా కమ్ముకునే గుమ్మడి తీగ పూలతో పారాణి అలంకరించుకుందా అనిపిస్తుంది. చెట్లన్నీ ముదురు ఆకుపచ్చ రంగు పులుముకొని దర్జాగా దర్శనమిస్తాయి. మంచుదుప్పటి కప్పుకొన్న తటాకాలు అల్లంత దూరం నుంచే వణికించేస్తాయి. ఛాయాదేవి కౌగిట వెచ్చదనానికి మరిగిన మార్తాండుడు ఆలస్యంగా ప్రభవిస్తాడు. ఉదయించే భానుబింబం ఉల్లి పువ్వు వన్నెలో కనువిందు చేస్తుంది. తెలిమంచు తెరలను బద్ధకంగా తొలగించుకొని బయటపడ్డా.. అగ్నిదేవుడితో చనువు పెరిగి చలిమంటల్తో దోస్తీ చేస్తున్న మనిషిని చూసి ప్రత్యక్ష నారాయణుడు చిన్నబుచ్చుకుంటాడేమో! తీక్షణంగా వీక్షించాలనుకున్నా వీలుకాక, తన మార్గాన్నే మార్చుకొని ఉత్తర దిశగా ఉపక్రమించడం మొదలుపెడతాడు. ఆనాటి నుంచి దినదిన ప్రవర్ధమానమై చలిని తోకముడిచేలా చేయడంలో కృతకృత్యుడు అవుతాడు. సస్యలక్ష్మికి సరిపడా సూర్యరశ్మిని పంచుతూ, క్రమక్రమంగా పెంచుతూ సంక్రాంతి సందడికి నాంది పలుకుతాడు భానుడు.
సంక్రాంతి అంటే చేరడం అని అర్థం. ఈ పండుగ నాటికి పొలాల్లోంచి ధాన్యలక్ష్మి ఇండ్లకు చేరుతుంది. పట్నవాసులంతా పల్లెకు చేరుకుంటారు. ఇలాతలం నుంచి రివ్వున ఎగిరిన గాలిపటాలు గగనతలంలోకి దూసుకెళ్తాయి. భోగి పండ్ల అభిషేకం కోసం పిల్లలంతా వాడకట్టులోని ఇండ్లలోకి చేరిపోతారు. నోముల వాయనాలు ఇచ్చిపుచ్చుకోవడానికి ముత్తయిదువలు కలివిడిగా ఒక్కో ఇంటికి చేరిపోతుంటారు. ఇన్ని చేరికలకూ కారణం ఆదిత్యుడు ధనుస్సులోంచి మకర రాశిలోకి సంక్రమించడం. నెలకో రాశి మారుతూనే ఉంటాడు కదా! ఇదే ఎందుకు ప్రత్యేకం? ద్వాదశాదిత్యుడైన దివాకరుని దివ్యయాత్రలో ప్రధాన ఘట్టాలు నాలుగు. అవి మేష, కర్కాటక, తుల, మకర సంక్రమణాలు. మార్తాండుడు ఈ మజిలీలు చేరగానే వాతావరణంలో మార్పులు స్పష్టంగా గోచరిస్తాయి. అందులో మకర సంక్రమణం మరింత మనోహరం. జొన్న, సజ్జ, కొర్ర తదితర మెట్ట పంటలు దట్టంగా పండి దిట్టంగా దిగుబడులు కురిపించే కాలమిది. వరి కోతలు పూర్తయ్యే ముచ్చట తెలిసిందే! పాడి గేదెలు దండిగా పాలను వర్షించే కాలం, లేగదూడలతో పశుసంపద పెరిగే సమయం ఇది. ప్రకృతి పరంగా ఇన్ని విశేషాలున్న ఈ కాలం ఆధ్యాత్మికంగా మరెన్నో ప్రత్యేకతలను సంతరించుకున్నది.
సంక్రాంతి ఆరోగ్యదాయని
‘సర్వ సాధనలో దేహ సాధన ముఖ్యమ’ని సాక్షాత్తూ పరమేశ్వరుడు పార్వతీదేవికి ఉపదేశించాడు. ఆరోగ్యాన్ని భద్రంగా కాపాడుకుంటేనే కదా.. ఏ పనైనా చేయగలం. సంక్రాంతి సందర్భంగా చేసే పిండివంటలన్నీ ఆరోగ్య సాధనకు అక్కరకొచ్చేవే! చకిలాలు, అరిసెలు, నువ్వుల లడ్డూలు ఇలా చేసే ప్రతి పదార్థమూ నువ్వులు, బెల్లం ప్రాధాన్యం కూడుకున్నవే ఉంటాయి. చలికాలంలో శరీరానికి అవసరమైన వేడిని ఇవి అందిస్తాయి. నువ్వులు వేడి పుట్టించడంతోపాటు కీళ్లకు సత్తువనిస్తాయి. సజ్జలు పండే ప్రాంతంలో నువ్వులు చల్లుకొని సజ్జరొట్టెలు చేసుకునే ఆచారం ఉంది. ఉత్తర భారతదేశంలో గొంగళ్లు దానం చేసే సంప్రదాయం కనిపిస్తుంది. ఇలా దానమిచ్చిన వారికి భగవంతుడి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. సంక్రాంతి పర్వం సందర్భంగా శనైశ్చరుడి అనుగ్రహం కోరుతూ నువ్వులు దానం చేయాలని సూచించారు పెద్దలు. నువ్వులు కొనలేని బీదసాదలకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలనే లక్ష్యంతో ఈ నియమం చేశారు పెద్దలు. సంక్రాంతి పండుగ వ్యక్తిగత ఆరోగ్యాన్ని ప్రసాదించడంతోపాటు సామాజిక బాధ్యతనూ గుర్తుచేస్తుంది.
సంక్రాంతి సందడికి మొదటగా స్వాగతం పలికేది గాలిపటాలే. పండుగకు పది రోజుల ముందు నుంచే రంగురంగుల పతంగులు నింగిలో గింగిరాలు తిరుగుతూ, గాలివాటానికి తగ్గట్టుగా వంగి సలాములు కొడుతూ సయ్యాటలు ఆడతాయి. ఏడాదిలో ఎప్పుడూ లేని పతంగులు ఇప్పుడు ఎగురవేయడం దేనికి? ఈ ప్రశ్న వెనుకా ఆరోగ్య మంత్రమే సమాధానంగా కనిపిస్తుంది. ఈ కాలంలో సూర్యరశ్మి అధికంగా అవసరం అవుతుంది. ముఖ్యంగా ఎదిగే పిల్లలకు! అందుకే కాబోలు పెద్దలు పతంగుల సంప్రదాయానికి తెరలేపారు. గాలిపటాల జోరులో, పతంగులతో పేచీ పడుతూ పిల్లలంతా ఆరుబయట అలసిపోతున్నా పట్టించుకోకుండా వినోదిస్తుంటారు. ఈ క్రమంలో శరీరానికి కావాల్సినంత ‘డి’ విటమిన్ లభిస్తుంది. అంతేకాదు.. నింగిలోకి అలా చూస్తూ ఉండటం వల్ల కంటి చూపు మెరుగవుతుంది. ఏదైనా సాధించాలనే పట్టుదల కూడా వారిలో పెరుగుతుంది. ఇన్ని లాభాలున్న పతంగుల సంస్కృతిని పద్ధతిగా పాటిస్తేనే ఆనందం. అంతేకానీ, పక్షుల పీకలు తెగనరికే చైనా మాంజాల వినియోగం పైశాచికమే అవుతుంది.
భోగి.. పిల్లల వైభోగం
సంక్రాంతికి ముందురోజు ‘భోగి’తో భోగ భాగ్యాలను తమ జీవితంలోకి ఆహ్వానిస్తారు. గోదాదేవి రంగనాథుణ్ని చేపట్టిన రోజు ఇదే. ఈ రోజు చిన్నపిల్లలకు భోగి పండ్లు పోసే సంప్రదాయం ఉన్నది. రేగు పండ్లను తల మీద పోయడం వల్ల పిల్లల మీద ఉన్న చెడు దృష్టి తొలగిపోయి నారాయణుడి అనుగ్రహం లభిస్తుందని భావిస్తారు. తల పైభాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది. భోగి పండ్లను పోసి దాన్ని ప్రేరేపితం చేస్తే, పిల్లల్లో జ్ఞానం పెరుగుతుందని ఒక నమ్మకం. రేగుపండ్లు, చెరకుగడలు, బంతిపూల రెక్కలు, నాణేలను భోగి పండ్లుగా వాడతారు. రేగు పండ్లకు బదరీఫలాలు అని పేరు. శివుణ్ని ప్రసన్నం చేసుకోవడానికి నర, నారాయణులు బదరికావనంలో తపస్సు చేస్తుండగా, వారి తలల మీద దేవతలు బదరీ ఫలాలను కురిపించారట. ఆనాటి సంఘటనకు ప్రతీకగా పిల్లలను నారాయణుడిగా భావించి భోగి పండ్లను పోసే సంప్రదాయం ఏర్పడిందని చెబుతారు. ఎరుపు రంగులో ఉండే రేగు పండ్లను సూర్యుడికి ప్రతీకగా భావిస్తారు. అలా ఆదిత్యుడి ఆశీస్సులు పిల్లలకు లభిస్తాయని భోగిపండ్లు పోస్తారు.
సాధన మార్గం
ఆధ్యాత్మిక సాధనలన్నీ మోక్షలక్ష్మిని పొందడానికే! ఇహంలో సకల సంపదలతో తులతూగినా.. పరంలో సాధించాల్సిన స్థిరమైన సంపద మోక్షమే కదా! మహోన్నతమైన పురుషార్థాన్ని పొందడానికి అనువైన కాలం ఉత్తరాయణం. పవిత్రమైన, శాస్ర్తోక్త సత్కర్మలకు ఉత్తరాయణం ప్రధానమైందని ఆగమాలు చెబుతున్నాయి. శుద్ధికి, సిద్ధికి శీఘ్రఫలకారిగా అనుకూలించే సమయమిది. ఉత్తరాయణాన్ని దేవయానంగానూ అభివర్ణిస్తారు. వెలుగును ఇచ్చే మార్గంగా దీన్ని చెబుతారు. ఇదే ఉత్తరాయణం. రెండోది పితృయానం. ఇది చీకటి మార్గం, ధూమ మార్గం. అదే దక్షిణాయనం. వెలుగు మార్గంలో పయనించిన వారు, సూర్యుడి అనుగ్రహాన్ని పొందుతారు. ఈ తత్త్వాన్ని గ్రహించిన ఉపాసకులు ఉత్తరాయణ కాలాన్ని ఆధ్యాత్మిక సాధనకు వినియోగించుకుంటారు.
కనుమ సందడి
సంక్రాంతి మరుసటి రోజు కనుమ. ఇది పశువుల పండుగ. వ్యవసాయంలో మనతోపాటు శ్రమించిన ఎడ్లను, పాడికి ఆధారమైన గోవులను ఈ సందర్భంగా ప్రత్యేకంగా అలంకరించి పూజిస్తారు. సేద్యానికి ఉపయోగించే పరికరాలను కూడా శుభ్రం చేసి పసుపు, కుంకుమలతో అలంకరిస్తారు. పొంగళ్లు చేసి పొలాల్లో చల్లుతారు. కొన్ని ప్రాంతాల్లో ఎడ్లను ఊరేగిస్తారు. దక్షిణ కర్ణాటకలోని పల్లెల్లో ఎడ్లతో ‘కంబళ’ పోటీలు నిర్వహిస్తారు. వీటిని చూసేందుకు దేశవ్యాప్తంగా పర్యాటకులు సంక్రాంతి వేళకు అక్కడికి చేరుకుంటారు. కనుమ మర్నాడు ముక్కనుమగా చెబుతారు. దీనికి ఎలాంటి ప్రాధాన్యం లేకపోయినా మూడు రోజుల పండుగ తర్వాత విశ్రాంతి తీసుకునే రోజుగా భావిస్తారు.
గురుగులు.. కుంకుమ భరిణెలు..
సంక్రాంతి పండుగలో ముత్తయిదువలు నోము ఆచరిస్తారు. తెలంగాణ ప్రాంతంలో సంక్రాంతికి ముందు పక్షం రోజులను పీడ
దినాలుగా భావిస్తారు. వృద్ధులు, రోగపీడితులు ఈ కాలంలో మరణించే ప్రమాదం ఉంటుందని ఆందోళన చెందుతుంటారు. దీనికి పరిహారంగా సంక్రాంతి పూట వ్రతం చేస్తారు. అమ్మవారిని ఆరాధిస్తారు. ఒకప్పుడు మట్టి గురుగులను నోములో ఉంచి గురిగితోపాటు పసుపు, కుంకుమ, నువ్వులు ముత్తయిదువలకు వాయనంగా ఇచ్చేవారు. ఇప్పుడు గురుగుల స్థానంలో భరిణెలు, ఇతర అలంకరణ వస్తువులను వాయనంగా ఇస్తున్నారు. పండుగ వేళ పాలు పొంగించే తంతు ప్రహసనంగా సాగుతున్నది. ఇంటి మధ్యలో ఆవుపిడకలపై మట్టి గురిగిలో పాలను మరిగించి, పొంగిస్తారు. పాలు పొంగి ఇంటి లోపలివైపునకు దొర్లితే ఆ ఏడాది సిరిసంపదలు కలుగుతాయని విశ్వసిస్తారు.
ఉత్తరాయణ ప్రవేశ సమయంలో కొందరు పితృదేవతల ప్రీత్యర్థం తర్పణాలు విడుస్తారు.
ముచ్చటైన మూడు రోజుల సంక్రాంతి పండుగలో ఆద్యంతం ఆనందాలే కనిపిస్తాయి. ప్రతి పనిలోనూ దైవత్వం దర్శనమిస్తుంది. సంప్రదాయాలు, సందళ్లు అన్నిటా వైజ్ఞానిక రహస్యాలూ దాగి ఉన్నాయి.
ప్రాంతానికో ఆచారం కనిపించినా.. అన్నిటి పరమార్థం కలిమిని కలిసి పంచుకోవాలని సూచిస్తుంది!
సంక్రాంతి శోభను పల్లెపల్లెకూ పంచే కళాకారులకు తోచింది ఇవ్వడం, వ్యవసాయంలో సాయంగా ఉన్న పశువులను పూజించుకోవడం, చేదోడువాదోడుగా నిలిచిన వ్యక్తులకు పంటలో భాగం ఇవ్వడం ఇవన్నీ మన పెద్దలు ఆచరించి, ఆనందించిన విధానాలు. వారి అడుగుజాడల్లోనే మనమూ పయనిద్దాం.
సంక్రాంతి లక్ష్మిని సమంగా పంచుకుందాం!
sankranti special | సంక్రాంతి ముందు భోగి మంటలు ఎందుకు వేస్తారు? దీని వెనుక కారణమేంటి?
“Sankranti Special | గంగిరెద్దులాటకు ఎలాంటి గిత్తలు కావాలి? వాటిని ఎలా అలంకరిస్తారు?”