దేవుడు నిరాకారుడు. నామరూపాలు లేనివాడనే జాడ్యం పట్టుకున్నది మనకు. నిజమే! కానీ, మనకు నామరూపాలున్నాయి కదా! అవసరాలు ఉన్నాయి కదా! వాటిని తీర్చేందుకు భగవానుడు భూమి మీదకు రావలసి వస్తున్నది. అప్పుడు నామరూపాలు ధరించి రావలసిందే! అవసరం తీరిపోగానే అదృశ్యుడవుతాడు. ‘దేవుడికి నామరూపాలున్నాయా!’ అంటే ‘దిగి వచ్చినప్పుడు ఉన్నాయి. రానప్పుడు లేవు’ అని చెప్పుకోవాల్సివస్తుంది. అంతేగానీ, అసలే లేవు అనడానికి వీల్లేదు. నామరూపాలు లేకపోతే మనకు భూమ్మీద ఉనికే లేదు. దేవునికి మాత్రం నామరూపాలున్నా, లేకున్నా ఉనికి ఉంది. అయితే, ఆయన ఉనికి వాటికి సంబంధించింది కాదు. అందువల్ల భగవానుడు నామరూపాలకు అతీతుడు అంటే అవి లేనివాడని కాదు, వాటితో అవసరం లేనివాడని అర్థం. అవసరమైనప్పుడు నామరూపాలు ధరించి అవతరిస్తాడని భావం. ఇదే విషయాన్ని గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ప్రవచించాడు.
‘యదాయదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత
అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం’ (భగవద్గీత 4-7)
‘ధర్మానికి హాని సంభవించినప్పుడు నన్ను నేను సృజించుకుంటాను’ అని పేర్కొన్నాడు.
పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం
ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగేయుగే (భగవద్గీత 4-8)
‘సాధు రక్షణ, దుష్ట శిక్షణ కోసం, ధర్మ సంస్థాపన కోసం ప్రతి యుగంలో అవతరిస్తాను ’ (అదీ అవసరం అయితేనే) అన్నాడు కృష్ణపరమాత్మ. తన అవతార పరిసమాప్తి అయ్యేంత వరకు భగవానుడు నామరూపాలు ధరిస్తాడని అర్థమవుతున్నది. కాబట్టి దేవుడికి నామరూపాలు లేవని కాదు. పైగా అవి దివ్యమైనవని కూడా అంగీకరించాల్సిందే!
‘భూషణములు చెవులకు, బుధ
తోషణములనేక జన్మదురితౌఘ విని
శ్శోషణములు, మంగళతర
ఘోషణములు గరుడ గమన గుణ భూషణముల్’
(భాగవతం 10వ స్కందం 1685వ పద్యం)
‘గరుడ వాహనుడైన విష్ణుమూర్తి కళ్యాణ గుణాలను గురించిన మాటలు మన చెవులకు సొమ్ముల వంటివి. విద్యావంతులైన వారికి సంతోషాన్ని సమకూర్చేవి. అనేక జన్మలుగా చేసుకున్న పాప సమూహాలను నశింపజేసేవి’ అని భాగవతం చెబుతున్నది. ఈ విధంగా ‘శ్రీకృష్ణుని దివ్య నామరూపాదుల స్మరణం పాపహరణం, మోక్షదాయకం’ అని పురాణాలు ఘోషిస్తుంటే.. దేవునికి నామరూపాలు లేవని అనడం పురాణాలను, శాస్ర్తాలను ఖండించినట్టే! అంతేకాదు, సామాన్యుడిని తికమకలో పడేయటమే అవుతుంది. వేదాలను ప్రభు సమ్మితాలన్నారు. అంటే ప్రభువులాగా శాసించినట్టుగా చెబుతాయి. పురాణాలు మిత్ర సమ్మితాలు. మిత్రునిలాగా అదే పరతత్వాన్ని గురించి చెబుతాయి. పురాణాలను తిరస్కరిస్తే.. వేదాలను తృణీకరించినట్టే అవుతుంది.
మన నామరూపాలు, క్రియలు మామూలువే కావొచ్చు. భగవంతునివి దివ్య ములు, మనన యోగ్యాలు. గీతలో చెప్పినట్టు తనను తాను సృజించుకోగలుతు న్నాడు దేవుడు. అది మానవుడికి సాధ్యం కాదు. తనను తాను సృష్టించుకునే భగవతుండు కర్మ బంధాల్లో చిక్కుకోడు. ఇరుక్కుపోయినట్టుగా కనిపిస్తాడంతే! లేకపోతే ధర్మోద్ధరణ ఎలా? అందువల్ల దేవుడు నామరూపాలు ధరించినంత మాత్రాన కొంప మునిగిపోయిందేమీ లేదు. ఏదో జరగకూడనిది జరిగిపోయిం దనుకోవలసిన పనిలేదు. ‘నామరూపాలు ధరించకపోవడమే ఆ దేవుని లక్షణం’ అంటూ నిర్వచించాలని భావించడం అవివేకం. అలాగే రాముడు, కృష్ణుడు మొదలైన అవతార పురుషులు దేవుళ్లు కాదనడం మరో వింత. ‘దేవుని నామ రూపాలు, లీలావిలాసాదులు దివ్యములు’ అని పురాణాలు స్పష్టం చేస్తున్నా యి. వాటి దివ్యత్వాన్ని అర్థం చేసుకోకుండా అవి కూడా సామాన్యమైనవని ప్రచారం చేయడం భక్తికి, దివ్యస్మరణకు జీవులను దూరం చేసినట్టే! రెండడుగులు ముందుకు నడిపించి నాలుగు అడుగులు వెనక్కి లాగినట్టే అవుతుంది!!
డాక్టర్ వెలుదండ
సత్యనారాయణ
94411 62863