అహంకారసుతం విత్త భ్రాతరం మోహ మన్దిరమ్
ఆశాపత్నీం త్యజే ద్యావత్తావన్ముక్తో న సంశయః॥
(మైత్రేయోపనిషత్తు 2-12)
‘ఎప్పుడైతే మనిషి అహంకారమనే కుమారుణ్ని, ధనమనే సోదరుణ్ని, మోహమనే ఇంటిని, ఆశ అనే భార్యను వదలేయగలుగుతాడో అప్పుడే అతడు ముక్తి పొందుతాడు అనడంలో సందేహం లేదు’ అని చెబుతుంది మైత్రేయ ఉపనిషత్తు. ముముక్షువైనవాడు పైన చెప్పినవన్నీ వదిలేయగలగాలి. అంటే వాటిపట్ల పూర్తి వైరాగ్యం మనసులో స్థిరపడాలి. అప్పుడే ఆ వ్యక్తికి ముక్తి లభిస్తుంది. ప్రాణాయామ ప్రత్యాహారాది సాధనలన్నీ యోగమార్గం కిందికి వస్తాయి. సంగీత సాహిత్యాది లలిత కళలు రాగమార్గం కిందికి వస్తాయి. రెండిటి లక్ష్యము మోక్షమే అని విస్మరించొద్దు.
తులసీదాసు, పోతన మొదలైన కవులు… త్యాగరాజు, అన్నమయ్య లాంటి వాగ్గేయకారులు నిరంతరం పరతత్వాన్ని కీర్తించి తరించిన వారే! సంగీత ప్రపంచంలో ధ్రువతారగా పేరుగాంచిన త్యాగరాజుకు ధనంపై ఉన్న వైరాగ్యాన్ని గురించిన ఒక సంఘటనను పరిశీలిద్దాం. ఉపనిషత్తు పేర్కొన్నట్టు ధనమనే సోదరుని ఏ విధంగా వదిలివేయాలో ఆ మహనీయుని జీవితం ద్వారా తెలుసుకోవచ్చు. అలాంటివారికి వైరాగ్యమే సంపద అవుతుంది. ఒకరోజు త్యాగరాజు తంబుర మీటుతూ, చిరుతలు వాయిస్తూ భక్తి గీతాలు ఆలపిస్తూ భిక్షాటనకు బయలుదేరాడు.
ఒక బ్రాహ్మణుడు త్యాగరాజు పాత్రలో బియ్యం కుమ్మరించాడు. అప్పుడు నాణేల శబ్దం వినిపించగా త్యాగయ్య కలవరపడ్డాడు. వాటి స్పర్శవల్ల బియ్యం మైలపడ్డాయి అని భావించి.. బియ్యాన్ని నడివీధిలో పారబోశాడు. త్యాగయ్యకు ధనం మీద అంత వైరాగ్యం. తంజావూరు ప్రభువైన శరభోజి మహారాజు అతనికి ఎలాగైనా ధనరాశులు సమర్పించాలని ప్రయత్నించాడు. కానీ, ఫలించలేదు. అదీ ఆ ‘నాదబ్రహ్మ’ వైరాగ్యం. ధనంపై తీవ్ర వైరాగ్యం ఉంటే గాని మోక్షం సిద్ధించదన్న ఉపనిషత్ వాక్యానికి త్యాగయ్య నిలువెత్తు నిదర్శనం.
…? డా॥ వెలుదండ సత్యనారాయణ