కబీర్ సబ్ జగ్ హండియా మందిల్ కంధిచడాయి హరి బిన్ అప్నా కో నహీఁ దేఖో ఠోకి బజాయి (సంత్ కబీర్ సప్తశతి 36)
అంటాడు కబీర్దాస్ ఒక సందర్భంలో. ‘మద్దెలను మెడలో వేసుకొని నింపాదిగా మోగిస్తూ లోకమంతా తిరిగాను. అణువణువూ గాలించా ను. సందులూ, మూలలూ వదిలిపెట్టలేదు. ఎక్కడచూసినా నా కంటికి శ్రీహరి ఒక్కడే కనిపించాడు’ అని దీని భావం. ఈ మధ్య చాలామందికి దేవుడు ‘ఇందులో ఉన్నాడు, అందులో లేడు’ అని చెప్పడం అలవాటైంది. ‘లేడు’ అనడానికి గాని, ‘ఉన్నాడు’ అనడానికి గాని తమ వద్ద ఏ ఆధారాలున్నాయో పరిశీలించుకోరు, చెప్పలేరు.
దేవుడు అంతటా ఉన్నాడని, అన్నిటా ఉన్నాడని, సర్వాంతర్యామి అని కబీరు వంటి అనుభవజ్ఞులు, జ్ఞానులు ఒకవైపు చెప్తుంటే వింటా రు. ఒప్పుకొంటారు. ‘మేమూ అదే అంటున్నాం’ అంటారు కూడా. అయినా ‘విగ్రహాలలో లేడు, ఇంకోలా ఉన్నాడు’ అంటారు. దేవుడు సర్వాంతర్యామి అని ఒప్పుకొంటూనే ఇలా అనడం ఒక విచిత్రం. వాళ్లు చెప్పే మాటలను బట్టి ‘దేవుడు సర్వాంతర్యామి కాడు’. కాని, ఆ మాట మాత్రం సూటిగా చెప్పలేకపోవడం మరో విచిత్రం. ఒకచోట ఉన్నాడు. మరోచోట లేడు. అన్నప్పుడే సర్వాంతర్యామి కాడని కదా అర్థం!
ఇటువంటి ప్రవృత్తి ‘మనసు చేసే మాయ’ అనే చెప్పవచ్చు గాని, మనసుకు అతీతమైన జ్ఞానం అని చెప్పలేం. ‘మన ఏవ మనుష్యాణాం కారణం బంధ మోక్షయోః’ అన్నారు. మనసే బంధానికి గాని, మోక్షానికి గాని కారణం. దానికి ప్రేమను అలవాటు చేస్తే మధురమైన శాంతిదాయకమైన దైవానుభూతికి అర్హతను ప్రసాదిస్తుంది. చేయకపోతే కేవలం తర్కవాదానికి దారితీస్తుంది. బంధం ఇంకా బిగుసుకోవడానికి కారణమవుతుంది. ఆ ప్రేమనే దైవం వైపు మరలిస్తే పరమ ప్రేమ అవుతుంది. అదే భక్తి.
‘సా పరమ ప్రేమ రూపా’- భక్తి పరమ ప్రేమ రూపమైనదని నారదుడు భక్తి సూత్రాల్లో నిర్వచిస్తాడు. అంటే మనకు సాటి మనుషులపై ఉండే మామూలు ప్రేమ. ఆ ప్రేమే దేవుడి మీద నిలిచిందా! అదే పరమప్రేమ. ఆ ప్రేమను తోటివారిపై మళ్లిందా, వారిలో దైవాన్ని దర్శించగలుగుతారు. అంటే దైవాన్ని చూడగలుగుతూ ప్రవర్తిల్లే ప్రేమ పరమ ప్రేమ. నియమాలు, ఆచారాలు, వాదనలు, శాస్ర్తాలు, కట్టుబాట్లు, ఆత్మస్తుతులూ, పరనిందలూ ఇవన్నీ మామూలు ప్రేమలో కనిపిస్తాయి. వీటన్నింటినీ దాటి పరమ ప్రేమలోకి ప్రయాణం కొనసాగితే అన్నీ సద్దుమణుగుతాయి. రాజ్యమేలేది పరమ ప్రేమ రూపమైన భక్తి ఒక్కటే!
అటువంటి పరమ ప్రేమను చేరగలిగినవాడు ప్రత్యేకంగా ధ్యానం చేయవలసిన పనిలేదు. చేసేదే ధ్యానమవుతుంది. నియమం పాటించాల్సిన పనిలేదు.
పాటించేదే నియమమవుతుంది. అతను అణువణువునా దైవాన్ని దర్శించడమే గాక దైవానుభూతిని పొందుతూ ఆనందిస్తూ ఉంటాడు. అలాంటి పరిస్థితిలో అతను విగ్రహా ల్లో దేవుడు లేడని గాని, నిరాకారంగానే ఉన్నాడని గాని, స్థూలంలో లేడని గాని, సూక్ష్మంలోనే ఉన్నాడని గాని అనలేడు. అంటే అది అబద్ధమే అవుతుంది కదా! ఇక అతను మౌనం వహించి నవ్వుకుంటాడు. నిండు కుండ తొణకదు కదా! అతని జ్ఞానం జిజ్ఞాసువులకే పనికివస్తుంది. కాలక్షేపానికి గాని, తన అభిప్రాయాన్ని మన్నించాల ని ప్రశ్నించేవాడికి గాని పనికిరాదు. అలాగని నియమాలను గాని, ఆచారాలను గాని అతను తృణీకరించడు. ప్రాథమిక దశలో అవి సహకరిస్తాయని ఎదిగే కొద్దీ అవి తమంత తామే తొలగిపోతాయని గమనిస్తాడు. వాటిని పట్టుకొని వేలాడడు. వాటిని అలాగే పట్టుకొని పాకులాడితే చివరికి అవే మిగిలిపోతాయని గ్రహిస్తాడు. మొక్క ఎదగడానికి కంచె ఏర్పాటు చేస్తాం. కానీ, అది ఎదిగేకొద్దీ కంచె అవసరం లేకుండాపోతుంది. పూర్తిగా ఎదిగాక కంచెను తీసివేస్తాం. ఇదీ అంతే!
-డా॥ వెలుదండ సత్యనారాయణ
94411 62863