Katha Sudha | ఒకానొక గ్రామంలో ఓ స్థితిమంతుడైన వ్యాపారి ఉండేవాడు. అతను ఇక సంపాదించింది చాలనుకున్నాడు. తన శేష జీవితాన్ని మానవ సేవ చేయడానికి వినియోగించాలని భావించాడు. వృద్ధులకు, రోగులకు ఆశ్రయమిచ్చే ఓ ఆశ్రమానికి వెళ్లాడు. అక్కడి గురువుతో తన ఆలోచన గురించి చెప్పాడు. అతణ్ని గురువు అభినందించాడు. ‘ఓ మూడు రోజులపాటు ఆశ్రమంలో ఉండి, ఆ తర్వాత సేవ చేసే నిర్ణయం తీసుకో’మన్నాడు. గురువు చెప్పినట్లే ఆ వ్యాపారి ఆశ్రమ వాతావరణాన్ని పరిశీలించాడు.
సేవా బృందాలతో కలిసి మాట్లాడాడు. మూడోరోజు గురువు ఆ వ్యాపారిని పిలిచి ‘సేవ చేయడానికి సిద్ధమా?’ అని అడిగాడు. ‘అంతకుమించిన భాగ్యమా!’ అని బదులిచ్చాడు వ్యాపారి. తర్వాత వ్యాపారిని ఆశ్రమంలోని వేంకటేశ్వరస్వామి గుడి దగ్గరికి వెళ్లి స్వామివారి మూర్తి ముందు నిల్చుని ఫొటో తీసుకోమన్నాడు గురువు.
గంట తర్వాత వ్యాపారికి ఫొటో ఇచ్చాడు గురువు. ఆ చిత్తరువును వ్యాపారి ఆసక్తిగా గమనించసాగాడు. కాసేపటికి గురువు ‘స్వామితో దిగిన ఫొటోలో మీరు మొదటగా స్వామిని చూశారా, లేక మిమ్మల్ని మీరు చూసుకున్నారా?’ అని వ్యాపారిని ప్రశ్నించాడు. ‘నన్నే చూసుకున్నాను’ అని అతను బదులిచ్చాడు. గురువు చిన్నగా నవ్వి.. ‘అన్నీ వదిలేశావన్నావే! కానీ, నీపై నీకున్న వ్యామోహాన్ని ఇంకా వదులుకోలేదు. అందుకే ఆ బ్రహ్మాండనాయకుడైన శ్రీనివాసుడి పక్కన నిలబడి దిగిన ఫొటోలో.. ముందు స్వామిని కాకుండా, నిన్ను నువ్వు చూసుకున్నావు. సేవ చేయాలనే ఆసక్తి ఒక్కటీ ఉంటే సరిపోదు. ముందుగా వ్యామోహాన్ని త్యజించాలి. అదే సేవ చేయడానికి తొలిమెట్టు’ అని చెప్పాడు. వ్యామోహాన్ని విసర్జిస్తే గానీ, పూర్తిగా సేవ చేయలేమని తెలుసుకున్నాడు వ్యాపారి.
…? ఆర్.సి.కృష్ణస్వామి రాజు, 93936 62821