ఒక గురువు తన ఆశ్రమంలో కొందరు యువకులకు శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నాడు. శిక్షణ పూర్తి చేసుకున్న వాళ్లు గ్రామాలకు వెళ్లి పిల్లలకు ఆధ్యాత్మిక విజ్ఞానం బోధించాలి. శిబిరం పూర్తయ్యే రోజు రానే వచ్చింది. వీడ్కోలు సమావేశం ఏర్పాటుచేశాడు గురువు. గ్రామాలకు వెళ్లి శిష్యులు చేయాల్సిన కార్యక్రమాలను వివరించాడు. ఓ శిష్యుడు నిలబడి ‘పిల్లలతో ఎలా వ్యవహరించాలి గురువు గారు?’ అని అడిగాడు. గురువు ఏం సమాధానం చెబుతారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూడసాగారు. గురువు చిన్నగా నవ్వి, తనను ప్రశ్నించిన యువకుడికి రెండు గులకరాళ్లు ఇచ్చాడు.
ఒకరాయిని కొలనులోకి విసరమన్నాడు. అలాగే చేశాడు శిష్యుడు. నీళ్లన్నీ చెదిరి, రాయి డుబుక్కున మునిగిపోయింది. మరో రాయిని గట్టిగా ఉన్న గట్టు మీదికి విసరమన్నాడు. అలాగే చేశాడు శిష్యుడు. రాయి కొంత దూరం వెళ్లి గట్టుమీద ఆగిపోయింది. ‘ఏం జరిగిందో గమనించావా?’ అని ప్రశ్నించాడు గురువు. ‘నీళ్లలో వేసిన రాయి మునిగిపోయింది. గట్టున వేసిన రాయి అక్కడే ఉండిపోయింది’ అని చెప్పాడు. ‘నీళ్లు పలచగా ఉండటం వల్ల రాయి సులభంగా అడుక్కి పోయింది. అదే గట్టు మట్టితో గట్టిగా ఉండటం వల్ల అక్కడే నిలబడింది.
మనం చేయాల్సిందీ అదే! మెత్తగా ఉండాల్సిన చోట మెత్తగా ఉండాలి. గట్టిగా ఉండాల్సిన చోట గట్టిగా ఉండాలి. పూర్తిగా మెతకగానూ, కఠినంగానూ ఉండకూడదు’ అని వివరించాడు గురువు. ‘నిజమే.. తప్పు చేసే పిల్లలను దండించడం, మంచి చేసే పిల్లలను అభినందించకపోతే వారు గాడి తప్పే ప్రమాదం ఉంద’ని గ్రహించారు శిష్యులు. గురువు ఆశీర్వాదం తీసుకొని, ఆధ్యాత్మిక బోధనలు చేయడానికి గ్రామాలకు బయల్దేరారు.
…? ఆర్.సి.కృష్ణస్వామి రాజు, 93936 62821