శుకముని అవనీ రమణునితో సంశ్రవణీయంగా కమనీయంగా ఇలా పలికాడు…
కం॥ ‘మంతనములు సద్గతులకు
పొంతనములు ఘనములైన పుణ్యముల కిదా
నీంతన పూర్వమహాఘ ని
కృంతనములు రామనామ కృతి చింతనముల్’
రాజా! శ్రీరామనామ, రూప, గుణ, లీలా, ధామముల నిరంతర చింతనములు- సంకీర్తన, సంస్మరణలు సద్గతులకు మంతనములు- ఏకాంత (రహస్య) మార్గాలు. గొప్ప పుణ్యాలకు పొంతనములు- పొత్తులు, సత్సంగతులు, ఆలవాలాలు, ఆశ్రయాలు. మునుపటి, ఇప్పటి మనువుల (బతుకుల) మహాపాపాలను, నికృంతనములు- పరిపూర్ణంగా పటాపంచలు కావించేవి.
శుక ఉవాచ- నిష్కళంకా! ఏ వంకా లేని విభీషణుని లంకా రాజ్యంలో ఢంకా మోగించి నిశ్శంకగా నిలిపి, శిష్ట సేవితుడైన శ్రీరాముడు సీతాలక్ష్మణ, సుగ్రీవ హనుమదాది వానర విశిష్టులతో పుష్పక విమానారూఢుడై వేల్పుల- దేవతల పుష్పవృష్టిలో తడుస్తూ నందిగ్రామానికి విచ్చేశాడు. రామచంద్రుని రాకను వీనులవిందుగా విని భరతుడు తాను ముందుండి పురజనులు వెంటరాగా కన్నుల నుండి ఆనంద బిందువులు జాలువారుతుండగా, ఎద మోదంతో నిండగా పాదుకలను మోసుకుంటూ అన్నగారికి ఎదురొచ్చాడు. ఇన్నేళ్లుగా తనను ఆదుకొన్న పాదుకలు ముందుంచుకొని, సాష్టాంగపడి సోదరుని పాదపద్మాలను సాదరంగా నుదుటికి ఆనించుకొన్నాడు. పాదధూళిని శిరస్సుపై చల్లుకొని అంతటితో తనివితీరక వేదాలే రత్న నూపురాలుగా అమరిన ఆ పాదాలను ఎదకు హత్తుకొని పేదవానికి పెన్నిధి ప్రాప్తించిన విధంగా సేదతీరాడు. ‘నృపవరా! ఇన్నాళ్లకు మా తపం పండి నీ కృపకు పాత్రులమై నిన్ను చూడగలిగాము’ అంటూ ఉత్తర కోసల ప్రజలంతా లోకోత్తరంగా తమ ఉత్తరీయాలు పైకెగరేసి ఊపుతూ, పూల వసంతాలాడుతూ, పాడుతూ అంతటా పండుగ చేసుకొన్నారు. పతిరాకకు కరిగిపోయే సుమతి ఐన ప్రాణసతి వలె సీతాపతి రాకతో అయోధ్య మితిలేని మోదం పొందింది. వానరవీరులు తన్ను సేవిస్తుండగా ఆ నృపవరుడు రాముడు అయోధ్య ప్రాసాదంలో పాదం పెట్టాడు. తన ఇల్లాలు తనను అనుసరించగా తాను అనుజులతో (తమ్ముళ్లతో) కలిసి తల్లులకు మొక్కాడు. ఉల్లములో ఉల్లాసం వెల్లివిరియగా తల్లులు అల్లన- మెల్లగా వారి తలలు నిమురుతూ, నవ్వుతూ వారిని ఒడిలోకి తీసుకొని వడివడిగా ముద్దాడారు. కన్నీళ్లతో తడిపారు.
రాజా! అనంతరం కులగురువు వశిష్ఠుడు వచ్చి రామచంద్రుని సిగముడిని విడిపించి కడలి (సాగర), నదీ జలాలతో అభిషేకించాడు. రాఘవుడు సీతతోపాటు మంగళస్నానం చేసి భ్రాత భరతుడు తనకు ప్రీతితో అప్పగించిన సింహాసనం అధిష్ఠించి జగత్పూజ్యంగా- జనరంజకంగా రాజ్యం చేయసాగాడు. రాజా! రాజ మహేంద్రుడైన ఆ రామచంద్ర విభుడు రాజ్యభారం వహించగా సప్తసాగరాలూ సంక్షోభం లేక శోభిల్లాయి. భూ వలయానికి భూకంపమనే విలయం లేకపోయింది. జలజ లోచనుడు జనార్దనునికి జాగరూకత- అప్రమత్తతతో అవసరం తీరింది. దిక్పాలకుల హీనమైన దీనభావం మాని- విడిచిపోయింది. వెలుగు జిలుగుల సోమసూర్యులకు వెలవెలపాటు (మసకబారడం) అనే ఆమయం- వ్యాధి తొలగిపోయింది. నల్ల కప్పేసిన దిక్కులు ఒక్కుమ్మడిగా వెల్లనయ్యాయి. గోడు గోడుమంటూ చెట్లకు మోడువారే దుస్థితి దూరమైపోయింది. త్రేతాగ్నులు నివురు కప్పడం తప్పిపోయింది. భూమిని భరిస్తున్న దిగ్గజాలకు, కుల పర్వతాలకు, వరాహమూర్తికి, ఆదిశేషునికి, అనాది కూర్మమూర్తికి భారం తగ్గింది. ప్రజల కష్టాలన్నీ నష్టమైపోయాయి’. ఈ కింది సీస పద్యం సహా పై ‘రామరాజ్య’ వర్ణన రససిద్ధుడు పోతన నూతనంగా చేసిన సరస స్వీయ కథనం. ఉక్తి వైచిత్రితో అన్యాపదేశంగా సాగిన ధ్వన్యాత్మకం! దశమ స్కంధంలో అమాత్యుడు ‘రాసలీల’ను రామరాజ్యంతో ఉపమించాడు- పోల్చాడు. ఇప్పటి ఈ ‘రామరాజ్య’ రూప అపురూప భామాకలాపాన్ని సాహితీ ప్రియంభావుకులు ఆలకించి, ఆస్వాదించి. ఆనందింతురు గాక!
సీ॥ ‘పొలతుల వాలుఁ జూపులయంద చాంచల్య
మబలల నడుములయంద లేమి
కాంతాలకములంద కౌటిల్య సంచార
మతివల నడవులయంద జడిమ
ముగుదల పరిరంభములయంద పీడన
మంగనాకుచముల యంద పోరు
పడఁతుల రతులంద బంధ సద్భావంబు
సతులఁ బాయుట యంద సంజ్వరంబు’
తే॥ ప్రియులు ప్రియురాండ్ర మనముల బెరసి తార్పు
లంద చౌర్యంబు, వల్లభులాత్మసతుల
నాఁగిక్రొమ్ముళ్లు వట్టుటందక్రమంబు
రామచంద్రుండు పాలించు రాజ్యమందు’
‘ఆ రామచంద్రుడు పాలించే రాజ్యంలో చెలువల (స్త్రీల) వాలు చూపుల్లోనే చాంచల్యం! పడతుల నడుముల్లోనే పేదరికం! అలివేణుల- తుమ్మెదల బారు వలె నల్లని జడలు గల కోమలాంగుల కేశాలలోనే కౌటిల్యం- వంకరతనం! నితంబినుల- గజగమనల నడకల్లోనే మాంద్యం
(జడత్వం)! ప్రమదల- స్త్రీ పరిరంభణాల్లోనే (ఆలింగనాల్లోనే) పీడనం- ఒత్తిడి! పొలతుల (స్త్రీల) పాలిండ్ల యందే పోరు- పరస్పర ఘర్షణ! భామినుల కలయికల్లోనే బంధాలు! తరుణీమణుల- భార్యల ఎడబాటులోనే తీవ్రమైన తాపం! ప్రియులు ప్రియురాండ్ర మనస్సులను దోచుకోవడంలోనే దొంగతనం! భర్తలు భార్యలను అడ్డగించి
జడలుపట్టుకు లాగడంలోనే ఆగడం- అక్రమం తప్ప ఇతరత్రా అంతా సక్రమమే!’ తండ్రివలె
రామచంద్రుడు కన్న తండ్రులను కూడా మరపించి ప్రజలను కాపాడాడు.
శుకుడు- రాజా! ఆ రామచంద్రుడు రాజర్షి చరితుడు. స్వధర్మ నిరతుడు. ఏకపత్నీ వ్రతుడు. సర్వలోక (ప్రజా) సమ్మతుడు. త్రేతాయుగమైనా కృతయుగ ధర్మాలు పాటిస్తూ, ప్రజలకు బాల మరణాల వంటి అరిష్టాలు కలగకుండా చాలా నిష్ఠతో రాజ్యం చేశాడు. పరిణయ మాడిన తరుణం మొదలు వియోగం వరకు సీతారాముల ప్రణయ యోగ పరిణతి, పరస్పర సమర్పణ రతి తో కూడిన భారతీయ ఆదర్శ దంపతి భావానికి- దాంపత్యానికి దర్పణం పడుతూ, విశుద్ధ ప్రేమ తత్తానికి సీమలు- హద్దులు చెరిపివేస్తూ ముద్దులు మూటగడుతున్న, వెలదు- స్త్రీలందరికీ వెలలేని కలకాలపు మగని వలపు బాటను వెలిగించే ఈ ఆటవెలది పద్యం పోతన మహాకవి అనువాద పాటవానికి అచ్చమైన మచ్చుతునక! ‘ప్రేమ్ణానువృత్త్యా శీలేన ప్రశ్రయావనతా సతీ, భియా హ్రియాచ భావజ్ఞా భర్తుః సీతా హరన్మనః’- ఇది మూలం. ఇక అమాత్యుని సర్వజనామోద యోగ్యమైన మోదమలరే అనువాదం…
‘బంగారం లాంటి సీతాదేవి సిగ్గు, సింగారాలు, భయమూభక్తీ, నయమూ (నీతి, మృదుత్వం) ప్రియమూ కలిగి, చక్కని నడవడి, కలివిడితో మగని మనస్సును తన వశం చేసుకొన్నది.’
ఆ॥‘సిగ్గువడుట గల్గి సింగారమును గల్గి
భక్తి గల్గి చాల భయము గల్గి
నయముఁబ్రియముఁ గల్గి నరనాథు చిత్తంబు
సీత దనకు వశము చేసికొనియె’
ఇలా అన్యోన్యంగా దాంపత్యం వాసికెక్కి సాగిపోతుండగా ఒకరోజు అర్ధరాత్రి అయోధ్య నివాసి ఒకడు తన అర్ధాంగితో జగడమాడి ‘పరాయివాని పంచన కాపురం చేసిన ఈ వంచనశీలను- చంచలురాలిని ఆలిగా ఏలుకోవడానికి నేనేమైనా ఏలిక- పాలకుడైన ఆ వెర్రి రాముడినా? బేలా! చాలు చాలిక పో!’ అని అరుస్తుండగా విన్నాడు మారువేషంలో తిరుగుతున్న రాముడు. లోకమంతా కోడై కూస్తున్నదని చారు (వేగు)ల ద్వారా తెలుసుకొన్న మార జనకుడు- మా (లక్ష్మీ)నాథుడు, మర్యాదా పురుషోత్తముడు, ఏకపత్నీవ్రతుడు రాముడు శోక తప్తుడవుతూ కూడా లోకారాధన తత్పరుడై, ఆదమరచి నిద్రిస్తున్న- అప్పటికే అంతర్వత్ని (గర్భవతి) ఐన తన ప్రియపత్నిని, ఆ పరమసాధ్విని, ఏ సంగతీ చెప్పక రాత్రికిరాత్రే వాల్మీకి ఆశ్రమంలో విడిచి రమ్మని ఆజ్ఞాపించాడు. ఆశ్రమంలోనే ఆమాత కుశలవులనే కవలలను కన్నది. ఆచార్య వాల్మీకి అనుగ్రహంతో వైదిక విద్యల్లో ఆరితేరిన కుశలవులు అనేక సభల్లో రామకథా సామగానం చేస్తూ ఒకరోజు రాఘవేంద్రుని యజ్ఞశాలకు వచ్చారు. మోళ్లు చిగురించే మాడ్కి- విధంగా, అమృతధారలు వర్షించేటట్లు రామకథను ఆలపించారు. ఆ మధురగాథను విని పరవశించిన రాముడు ప్రేమ మీరగ లవకుశులతో ‘ఓ ముద్దు కుర్రలారా! ధన్యులారా! మీ జననీ జనకులు ఎవరో చెప్పండి’ అన్నాడు. వాళ్లు- ‘మేము వాల్మీకి మునీంద్రుని మనుమలం. రాఘవేంద్రుని యాగాన్ని చూడవచ్చాం’ అన్నారు.
మరునాడు తల్లీకొడుకులతో వాల్మీకి ముని రాముని కని అనేక విధాల వినుతించి ఇలా అన్నాడు.. ‘రామచంద్రా! నీవు సూర్యవంశమనే సముద్రానికి సోము-చంద్రుని వంటివాడవు. ఈ సీత పతివ్రత, పుణ్యసతి. సత్యనిష్ఠ కలది. ఈమెను విడువక స్వీకరించు’. రాజా! రామచంద్రుడు పుత్రులకై విచారించగా భూజాత సీత కుశలవులను వాల్మీకికి అప్పగించి, పతిదేవుని పాదాలను ధ్యానిస్తూ భూగర్భంలో ప్రవేశించింది. తాను భగవంతుడైనా రామభద్రుడు భార్యా వియోగానికి దుఃఖించాడు. అనంతర కాలంలో ఆ బ్రహ్మణ్య దేవుడు బ్రహ్మచర్యం అవలంబించి పదమూడు వేల సంవత్సరాలు లోకారాధన చేసి తన అలోకమైన పరమపదం పొందాడు. ఆదిదేవుడైన ఆ వసుమతీశునికి- రామవిభునికి సాగరంపై సేతువు కట్టడం, అసుర మూకలను తుదముట్టించడం ఎంతపని? వానరుల సాయం ఏపాటిది? ‘సురల కొరకు గ్రీడచూపె గాక’- ఇతర దేవతలకు అనితరమైన తన లీలా వినోదాన్ని చూపాడు. అంతే! ఆ కల్యాణరామునితో కలిసిమెలిసి తిరిగిన వారూ, తనివి తీర తిలకించిన వారూ, చనువుతో తాకి పులకించిన వారూ ఐన ఆ కోసలదేశ ప్రజలు ఆదియోగులు పొందే సద్గతి చెందారు.
శుకుడు.. పరీక్షిన్మహారాజా!
చ॥ ‘వశుఁడుగ మ్రొక్కెదన్ లవణ వార్ధి విజృంభణతా నివర్తికిన్
దశదిగధీశమౌళి మణి దర్పణ మండిత దివ్యకీర్తికిన్
దశశత భానుమూర్తికి, సుధారుచి భాషికి, సాధు పోషికిన్
దశరథరాజు పట్టికిని దైత్యపతిం బొరిగొన్న జెట్టికిన్’
… క్షౌరసాగరపు అహంకార విజృంభణాన్ని అణచినవానికి, దిక్పాలకుల కిరీటమణి దర్పణాల్లో- అద్దాల్లో ప్రకాశించే దివ్యకీర్తి కలవానికి, సహస్ర సూర్య ప్రభా భాసమానునికి, అమృత భాషణునికి, సాధు పోషణునికి, దశరథ మహారాజ పట్టి (కుమారుని)కి, దైత్యపతి రావణుని హతమార్చిన జెట్టి- వీరునికి నేను వినమ్రుడనై నమస్కరిస్తాను.
ఉ॥ ‘నల్లనివాఁడు, పద్మనయనంబులవాఁడు మహాశుగంబులన్
విల్లును దాల్చువాఁడు గడు విప్పగు వక్షమువాఁడు మేలు పైఁ
జల్లెడువాఁడు నిక్కిన భుజంబులవాఁడు యశంబు దిక్కుల
జల్లెడువాఁడు నైన రఘుసత్తముఁడీవుత మా కభీష్టముల్’
‘శ్యామ సుందరుడు, తామరస నేత్రుడు, గొప్పవిల్లు, అమ్ములను దాల్చువాడు, విశాలమైన రొమ్ముకలవాడు, మేలు చేకూర్చే ఏలిక- పాలకుడైనవాడు, నిక్కిన- ఎగు భుజాలవాడు, అన్ని దిక్కులా కీర్తిని వెదజల్లువాడు, అనఘుడు, వినుత గుణశీలుడు అయిన ఇనకుల తిలకుడు మా కోరికలను తీర్చుగాక’. పై రెండు వృత్తాలు, రామభక్తుడు పోతన కథాంతమున ఎల్లరిపక్షాన ఉల్లము చేర్చి కూరిమితో కూర్చి నల్లనివానికి సమర్పించిన నెత్తావుల నవ చంపకాల- సంపెంగల, ఫుల్ల నీలోత్పలాల- నల్ల కలువల అనురాగ మాలికలు!
(సశేషం)