తిరుమల : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో నవంబరు 30 నుంచి డిసెంబరు 8వ తేఈ వరకు వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా జరుగనున్నాయి. సోమవారం ఉత్సవాలకు అంకురార్పణ జరుగనున్నది. ఈ సందర్భంగా ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు లక్ష కుంకుమార్చన నిర్వహించనున్నారు. భక్తులు వర్చువల్గా కార్యక్రమంలో పాల్గొనేందుకు టీటీడీ అవకాశం కల్పించింది. సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8.30 గంటల మధ్య పుణ్యాహవచనం, రక్షాబంధనం, సేనాధిపతి ఉత్సవం, యాగశాలలో అంకురార్పణ కార్యక్రమాలు చేపడుతారు.
30న ధ్వజారోహణం
ఆలయంలో ఈ నెల 30న ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు ధ్వజస్తంభ తిరుమంజనం, అలంకారం, ఉదయం 9.45 నుంచి 10 గంటల నడుమ ధనుర్లగ్నంలో ధ్వజారోహణంతో అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతి రోజు ఉదయం 8 నుంచి 9 గంటల వరకు, రాత్రి 7 నుంచి 8 గంటల వరకు అమ్మవారు వాహనమండపంలో వివిధ వాహనాలపై దర్శనమివ్వనున్నారు.
వాహన సేవల వివరాలు..
ఈ నెల 30న ఉదయం ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు మొదలు కానున్నాయి. రాత్రి చిన్నశేష వాహనంపై అమ్మవారు దర్శనమివ్వనున్నారు. 1న పెద్దశేషవాహనం, హంసవాహనం, 2న ముత్యపుపందిరి వాహనం, సింహవాహనం, 3న కల్పవృక్ష వాహనం, హనుమంతవాహన సేవ జరుగనున్నది. 4న పల్లకీ ఉత్సవం – వసంతోత్సవం, గజవాహనం, 5న సర్వభూపాలన వాహనం, సాయంత్రం స్వర్ణరథం బదులు సర్వభూపాలవాహనం, రాత్రి గరుడవాహనం నిర్వహిస్తారు. 6న సూర్యప్రభ వాహనం, చంద్రప్రభ వాహనం, 7న రథోత్సవం బదులు సర్వభూపాల వాహనం, అశ్వ వాహనం, 8న వాహన మండపంలో పంచమితీర్థం నిర్వహించనుండగా.. సాయంత్రం జరిగే ధ్వజావరోహణంతో కార్తీక బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.