ఒకానొక రోజు ఆరుణి మహర్షి తన కుమారుడు శ్వేతకేతువుతో మర్రి పండునొకదాన్ని తీసుకురమ్మన్నాడు. తెచ్చిన పండును ముక్కలుగా కోయమన్నాడు తండ్రి. శ్వేతకేతువు అలాగే పండును ముక్కలుగా కోశాడు.‘అందులో నీకేం కనిపిస్తున్నది’ అని అడిగాడు. ‘విత్తనాలు కనిపిస్తున్నాయ’న్నాడు శ్వేతకేతు. ‘ఒక విత్తనాన్ని తీసి బద్దలు చేయమ’న్నాడు ఆరుణి. అలాగే చేశాడు శ్వేతకేతు. ఆ బద్దలైన విత్తనంలో ‘ఏమి కనిపిస్తుద’ని అడిగాడు తండ్రి. ‘ఏమీ కనిపించడం లేద’ని చెబుతాడు కుమారుడు.
‘కుమారా! ఈ బీజంలో ఏది అతి సూక్ష్మంగా ఉండి నీకు కనిపించడంలేదో ఆ అగోచర అంశం నుంచే, ఈ కంటికి కనిపించే ప్రచండమైన గొప్ప మర్రి చెట్టు నిర్మితమైంది. బీజంలోని ఆ అవ్యక్త అంశం మీద శ్రద్ధ పెట్టు. ఇదేవిధంగా బ్రహ్మాండమైన అగోచర అవ్యక్తాంశం నుంచే ఈ చరాచర సృష్టి వ్యక్తమవుతున్నది. అందుకే, ఈ విశ్వమంతా ఆ సత్స్వరూపమే! అంతేకాక నీ రూపం (తత్త్వమసి), నా రూపం (అహం బ్రహ్మాస్మి) ఆ అవ్యక్తాంశం వల్ల ప్రకటితమవుతున్నవే! ఈ వివరణ వల్ల శ్వేతకేతువుకు జ్ఞానోదయమైనది.
విత్తు నుంచి చెట్టు, చెట్టు నుంచి బొగ్గు, బొగ్గు నుంచి వజ్రం, విత్తు నుంచి చెట్టు, చెట్టు నుంచి తైలం, తైలం నుంచి శక్తి.. ఇలా ఎన్నో రకాలుగా, రూపాలుగా విత్తు మారుతుంది. కేవలం విత్తు ఎలా చెట్టయింది? చెట్టు ఎలా బొగ్గయింది? బొగ్గు వజ్రమెలా అయింది? వీటి వెనుక సైన్స్ దాగుందని అందరి నమ్మకం. నిజానికి ఒక చిన్న విత్తు ఎలా వృక్షమై వివిధ రూపాలుగా పరిణమించింది? ఒక చిన్న విత్తు వేటిని సమీకరించుకొని వృక్షరూపాన్ని సంతరించుకుంటుంది? భూమిలో నాటిన విత్తనానికి నీళ్లు పోయడం వల్ల, భూమిలో ఉన్న గుప్తోష్ణం విత్తనంలో జీవ పదార్థాన్ని ప్రేరేపిస్తుంది. భూమిలో ఖనిజ లవణాలు, గాలిలో కర్బన పదార్థం, సూర్యరశ్మి, నీటిలో ఉన్న హైడ్రోజన్, ఆక్సిజన్ మొలకెత్తిన మొక్కకు ఆకృతిని జతచేస్తూ పోతాయి. తర్వాత పరిణామ క్రమంలో మొక్క వివిధ రూపాల్లోకి మారిపోతుంది. పండులో, వజ్రంలో, తైలంలో, కాగితంలో ఉన్నదంతా ఒక్కటే. మరి తేడాలు ఎందుకంటే, అలా కలిసే పంచభూతాల రీతులు, పాళ్లు వేరువేరు.
ఇలాంటి అల్ప విషయాల నుంచి అనల్ప విశ్వం, దాని పుట్టుక, ఉనికి, ప్రయాణం గురించి శాస్త్రీయత ఇంకా పరిశోధన సల్పుతూనే ఉంది. దాని పరిశోధన ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదు. ఐన్స్టీన్, స్టీఫెన్ హ్యాకింగ్ లాంటి పరిశోధనా దురంధరులు ఈ విశ్వ రూపకల్పనకు కారణం మాత్రం ఏదో శక్తి అయి ఉందంటారు. అయితే, దీనివెనుక అనంతమైన ఆత్మ ఉందనేది అద్వైతం. అంతేకాకుండా ఇవన్నీ ఆ ఆత్మ పరిణమించగా ఉద్భవించినవే అని తీర్మానిస్తుంది. ఆ ఆత్మ నుంచే సర్వ భూతాలూ ఉద్భవించాయని దాదాపు మూడువేల ఏండ్లకు పూర్వమే మన రుషులు తెలియజేశారు. ఇదే విషయాన్ని నేటి క్వాంటం ఫిజిక్స్ నిరూపిస్తున్నది. నేటి క్వాంటం ఫిజిక్స్ నిరూపణలు ఎన్నో మన ఉప నిషత్తుల్లో శ్లోకాల రూపంలో నిక్షిప్తమై ఉండటం గమనార్హం. అవగాహనలేమితో వాటిని శాస్త్రీయకోణంలో మనం వాడుకోలేకపోయాం.
అణోరణీయాన్మహతో మహీయాన్
ఆత్మాస్య జన్తోర్నిహితో గుహాయామ్ (కఠోపనిషత్తు)
‘అణువు కన్నా అణువైనదీ, అత్యంత పెద్దదాని కన్నా పెద్దదీ అయిన ఈ ఆత్మ ప్రాణుల హృదయ గుహలో కొలువై ఉంది. విచిత్రంగా ఆ ఆత్మ శరీరమై ఉన్నా, శరీర రహితమై ఉంది’ అని పై శ్లోకార్థం. ఇదే విషయాన్ని క్వాంటం ఫిజిక్స్ కాంతి పదార్థ-తరంగ సిద్ధాంతం ద్వారా ప్రతిపాదించింది. అంటే విశ్వంలో అత్యంత సూక్ష్మ పదార్థాలుగా పరిగణించేవాటిని గమనిస్తే పదార్థంగానూ, గమనించకుంటే తరంగ రూపంలోనూ చలిస్తూ ఉంటాయంటుంది క్వాంటం ఫిజిక్స్. ఇదే విషయాన్ని ఈశావాస్య ఉపనిషత్తు ‘ఆత్మ చలిస్తుంది, చలించదు, లోపలా, బయటా, దగ్గరా, దూరంగా ఉంటుంద’ని పేర్కొన్నది. సర్వాంతర్యామియై విలసిల్లేది ఆత్మే అని చెబుతున్నది. దానివల్లే ఈ చరాచరం ఉనికిలోకి వస్తుంది. ఆ ఆత్మశోధనే ఉత్కృష్ఠమైన పరమాత్మ సాధన అని ఉపనిషత్తులు ముక్తకంఠంతో ఘోషించాయి.
సత్యస్వరూపుడు, సర్వాంతర్యామి అయిన భగవంతుడి విషయంలో పోతనామాత్యుడు అన్నట్టుగా, ఇందుగలడు అందులేడన్న సందేహానికి తావులేదు. ఆ సత్పదార్థాన్ని స్థిరచిత్తంతో ఆరుణి, అష్టావక్ర, యాజ్ఞవల్క, గార్గి, పరాశర, వ్యాస, గౌడపాద, ఆదిశంకరాచార్య, రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి లాంటి అనేకానేక మహర్షులు దర్శించారు. జోర్డానో బ్రూనో, స్పినోజా, ఐన్స్టీన్ వంటి ఆధునికులు అలాంటి సత్పదార్థం ఒకటి ఉందని, అదే అన్నిటికీ హేతువని అంటారు. శాస్త్రీయత అంటే తెలియని కాలంలోనే హేతువాద భూమిక మీద భగవంతుడిని కనులారా, మనసారా ఆస్వాదించిన పవిత్ర నేల ఇది.
-రావుల నిరంజనాచారి