లక్నో: పోలీసుల రైడ్లో ఒక మహిళ బులెట్ గాయంతో మరణించింది. దీంతో గుర్తు తెలియని పోలీసులపై హత్య కేసు నమోదైంది. ఉత్తర ప్రదేశ్లోని సిద్ధార్థ్ నగర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. కొడ్రా గ్రాంట్ గ్రామంలో ఆవును వధించినట్లు పోలీసులకు శనివారం ఫిర్యాదు అందింది. దీంతో పోలీసులు ఆ గ్రామానికి వెళ్లారు. 53 ఏండ్ల మహిళ రోష్నికుమారుడు ఉబైద్-ఉర్-రెహ్మాన్ను అరెస్ట్ చేశారు. దీంతో రెహ్మాన్ కుటుంబ సభ్యులు, స్థానికులు పోలీసులపై దాడి చేశారు. ఈ క్రమంలో కాల్పుల ఘటన జరిగింది. దీంతో బుల్లెట్ గాయంతో రోష్ని చనిపోయింది. అయితే గ్రామస్తులే తుపాకీతో కాల్పులు జరిపారని, ఆమెకు బులెట్ గాయమైందని పోలీసులు ఆరోపించారు.
మరోవైపు రోష్ని మృతదేహానికి పోస్ట్మార్టం నిర్వహించారు. బులెట్ గాయం వల్ల ఆమె చనిపోయినట్లు తేలింది. పోలీసులే హత్య చేశారని ఆరోపిస్తూ రోష్ని కుటుంబ సభ్యులు నిరసనకు దిగారు. దీంతో ఆ ప్రాంతంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలో రెహ్మాన్ సోదరుడు అబ్దుల్ రెహమాన్ ఫిర్యాదుతో గుర్తు తెలియని పోలీసులపై సిద్ధార్థ్ నగర్ సర్కిల్ పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. అయితే తాను పోస్ట్మార్టం రిపోర్ట్ను ఇంకా చూడలేదని సిద్ధార్థ్ నగర్ సర్కిల్ అధికారి ప్రదీప్ కుమార్ యాదవ్ తెలిపారు. మృతురాలి కుటుంబం ఫిర్యాదుపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.