అమరావతి : సరదా కోసం నీటి గుంతలో దిగిన ఇద్దరు విద్యార్థులకు ఈత రాక ప్రమాదవశాత్తు నీట మునిగి చనిపోయిన సంఘటన ప్రకాశం జిల్లా కనిగిరి మండలం పేరంగుడిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఇండ్ల దినేష్(14), ఇండ్ల లోకేష్(14) అనే విద్యార్థులు ఈరోజు పాఠశాలలో జరిగిన గణతంత్ర వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం స్నేహితులతో కలిసి గ్రామ సమీపంలో నూతన రైల్వే వంతెన నిర్మాణం కోసం తీసిన గుంతలో ఈత కొట్టేందుకు దిగారు. గుంతలో లోతు ఎక్కువగా ఉండడం, ఇద్దరికీ ఈత రాకపోవడంతో ఒక్కసారిగా నీటిలో మునిగిపోయారు.
మిగతా విద్యార్థులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురై కేకలు వేయడంతో సమీప పొలాల్లోని రైతులు గుంత వద్దకు వచ్చి ఇద్దరు విద్యార్థులను బయటకు తీశారు. అప్పటికే వారు మృత్యువాత పడ్డారు. ఇండ్ల దినేష్ తల్లి అదే గ్రామానికి సర్పంచ్ కాగా.. లోకేష్ తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. ఇద్దరు చిన్నారుల మృతితో రెండు కుటుంబాల్లో విషాదఛాయలు అలముకున్నాయి.