తిరువనంతపురం: అత్యాచార బాధితురాలిని పెళ్లి చేసుకున్న వ్యక్తికి కోర్టు పదేళ్లు జైలు శిక్ష విధించింది. కేరళలోని కొచ్చీ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. పాలూరుతికి చెందిన 22 ఏళ్ల వ్యక్తి 2018 జూలైలో ఒక బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో పోక్సో చట్టంతోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అతడ్ని అరెస్ట్ చేశారు. అయితే బాధితురాలు, ఆమె తల్లి ఎదురుతిరిగారు. అతడికి అనుకూలంగా కోర్టులో సాక్ష్యం చెప్పారు. దీంతో 2019లో అతడు బెయిల్పై విడుదలయ్యాడు. అనంతరం మేజర్ అయిన బాధితురాలిని అతడు పెళ్లి చేసుకున్నాడు. 2021లో వారికి ఒక సంతానం కలిగింది.
మరోవైపు ఈ కేసుపై కొచ్చీ కోర్టు తీర్పు ఇచ్చింది. బాలికపై లైంగిక దాడి కేసులో నిందితుడైన ప్రస్తుతం 25 ఏళ్ల వ్యక్తికి పదేళ్ల కఠిన కారాగార శిక్షతోపాటు లక్ష జరిమానా విధించింది. నిందితుడు బాధితురాలిని పెళ్లి చేసుకున్నప్పటికీ చేసిన నేరం నుంచి తప్పించుకోలేడని కోర్టు స్పష్టం చేసింది.