ముంబై: మైనర్ బాలికతో ప్రేమ వ్యవహారానికి సంబంధించిన కేసులో ఒక వ్యక్తికి కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ ఘటన జరిగింది. 2014 ఏప్రిల్ 14న కురార్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన 13 ఏండ్ల బాలిక పనిమీద బయటకు వెళ్తున్నట్లు తల్లితో చెప్పింది. అయితే ఆమె తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. తమ కుమార్తెను ఒక వ్యక్తి కిడ్నాప్ చేసి ఉంటాడని అనుమానించిన బాలిక తండ్రి, ఏప్రిల్ 19న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు బాలిక తల్లి, ఆమె స్నేహితులు, మరో మహిళను ఆరా తీసి వారి స్టేట్మెంట్ రికార్డు చేశారు. దీని ఆధారంగా 24 ఏండ్ల వ్యక్తి పూణెలో ఉన్నట్లు గుర్తించారు. స్థానిక పోలీసుల సహాయంతో అతడ్ని అరెస్ట్ చేశారు. కిడ్నాప్, లైంగికదాడితోపాటు పోక్సో చట్టంలోని సెక్షన్ కింద నిందితుడిపై కేసు నమోదు చేశారు.
కాగా, ఆ బాలికతో తనకు ప్రేమ వ్యవహారం ఉన్నదని నిందితుడు కోర్టుకు తెలిపాడు. కుటుంబ సభ్యుల వేధింపులు తట్టుకోలేకపోతున్నానని, పెండ్లి చేసుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ఆమె బెదిరించడంతో వివాహం చేసుకున్నట్లు చెప్పాడు. తన వయసు 18 ఏండ్లుపైనేనని అప్పుడు ఆమె చెప్పిందన్నాడు. బాలిక సమ్మతితో ఆమెను పెండ్లి చేసుకున్న ఆధారాలు, వీడియోను కోర్టుకు సమర్పించాడు. ఆమెతో తన పెళ్లి చట్టబద్ధమేనని, బాలికపై తాను లైంగిక దాడికి పాల్పడలేదని కోర్టుకు తెలిపాడు. ఆమె ఆత్మహత్య చేసుకోకుండా కాపాడేందుకే వెంటనే పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని వివరించాడు. అయినప్పటికీ అతడు జైలులోనే ఉన్నాడు.
మరోవైపు ఆ వ్యక్తితో తనకు పెళ్లి జరిగినట్లు ఆ బాలిక కోర్టులో ఒప్పుకున్నది. 8వ తరగతి చదువుతున్న తనకు స్కూల్ ట్రిప్లో ఆ వ్యక్తితో పరిచయం ఏర్పడిందని తెలిపింది. అతడు తన ఇంటికి పలుమార్లు వచ్చాడని, తాను కూడా అతడి ఇంటికి వెళ్లానని చెప్పింది. ఈ క్రమంలో తమ మధ్య ప్రేమ ఏర్పడిందని ఆ బాలిక పేర్కొంది. ఈ నేపథ్యంలో అతడు తనను వసాయ్కు తీసుకెళ్లాడని, పెండ్లి తర్వాత అక్కడ ఉండాలని తాము నిర్ణయించుకున్నామని ఆ బాలిక తెలిపింది. ఈక్రమంలో తమ మధ్య శరీరక సాన్నిహిత్యం ఏర్పడిందని పేర్కొంది.
ఈ కేసుపై విచారణ జరిపిన పోక్సో ప్రత్యేక కోర్టు అన్ని ఆధారాలను పరిశీలించింది. బాలిక తనంత తానుగా అతడి వద్దకు వెళ్లినట్లు చెప్పడంతో ఆమెను నిందితుడు కిడ్నాప్ చేయలేదని పేర్కొంది. అయితే ఆ వ్యక్తి బాలిక వయసును పరిగణలోకి తీసుకోకుండా మైనర్ అయిన ఆమెను వెంటనే పెండ్లి చేసుకున్నాడని కోర్టు భావించింది. ప్రస్తుతం 32 ఏండ్ల వయసున్న అతడు తన యవ్వన కాలమంతా జైలులోనే మగ్గాడని కోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో బాలిక మైనర్ కావడం వల్ల పోక్సో చట్టంలోని సెక్షన్ ఆరుకు సంబంధించిన నేరానికిగాను ఆ చట్టం ప్రతిపాదించిన కనీస శిక్షగా పదేండ్లు జైలు శిక్ష విధిస్తున్నట్లు కోర్టు తీర్పు ఇచ్చింది.