ముంబై: రెస్టారెంట్ సిబ్బంది దాడి నుంచి తప్పించుకునేందుకు ఒక వ్యక్తి బిల్డింగ్ పైనుంచి దూకడంతో మరణించాడు. మహారాష్ట్రలోని పూణె జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 21 ఏళ్ల వ్యక్తి ఎరవాడలో కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్గా పని చేస్తున్నాడు. ఆదివారం రాత్రి స్నేహితులతో కలిసి వాకాడ్లోని రెస్టారెంట్కు పార్టీ కోసం వెళ్లాడు. అయితే అక్కడ పార్టీ చేసుకుంటున్న మరో బృందంలోని వ్యక్తితో వాగ్వాదం జరిగింది. ఇది ఘర్షణకు దారి తీయగా రెస్టారెంట్ సిబ్బంది రెండు గ్రూపులను బయటకు పంపేశారు.
కాగా, ఆ వ్యక్తి తన స్నేహితులతో కలిసి మళ్లీ ఆ రెస్టారెంట్కు వెళ్లాడు. దీంతో యజమాని, సిబ్బంది ఆ వ్యక్తి, అతడి స్నేహితులపై చైర్లతో దాడి చేశారు. ఈ నేపథ్యంలో దాడి నుంచి తప్పించుకునే క్రమంలో లాబీలోకి పరుగు తీసిన ఆ వ్యక్తి, రెండో అంతస్తు నుంచి కిందకు దూకాడు. తలకు తీవ్ర గాయం కావడంతో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. మృతుడి స్నేహితుడి ఫిర్యాదుతో రెస్టారెంట్ యజమాని, మేనేజర్, డీజే, సిబ్బందితో సహా ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.