మీరట్: బాలికపై సామూహిక లైంగికదాడికి పాల్పడిన నలుగురిలో ఒకడు పోలీస్ కాల్పుల్లో గాయపడ్డాడు. ఉత్తరప్రదేశ్ మీరట్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. సర్దానా పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థిని గురువారం ట్యూషన్ నుంచి ఇంటికి తిరిగివస్తుండగా నలుగురు వ్యక్తులు అడ్డగించి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. మనోవేదనకు గురైన బాలిక ఇంటికి వచ్చి జరిగిన దారుణాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. అనంతరం విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ చనిపోయింది. బాధితురాలి సూసైడ్ నోట్ ఆధారంగా ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేయగా మరో ఇద్దరు పరారిలో ఉన్నారు.
కాగా, బాలికతోపాటు ట్యూషన్కు వెళ్లే ప్రధాన నిందితుడు లఖన్, మరో నిందితుడు వికాస్ను పోలీసులు శనివారం కోర్టులో ప్రవేశపెట్టేందుకు తీసుకెళ్తుండగా తుపాకీ లాక్కొని కాల్పులు జరిపి తప్పించుకునేందుకు ప్రయత్నించారు. పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో లఖన్ కాలికి బులెట్ గాయమైంది. దీంతో అతడికి ఆసుపత్రిలో చికిత్స అందించారు.